Actress Riya Sen in Bharat Jodo Yatra: రాహుల్ గాంధీతో కలిసి నడిచిన నటి రియాసేన్
17 November 2022, 19:08 IST
Actress Riya Sen in Bharat Jodo Yatra: బాలీవుడ్ తో పాటు పలు భాషా సినిమాల్లో నటించిన ప్రముఖ నటి రియా సేన్ గురువారం భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో కొనసాగుతోంది.
రాహుల్ గాంధీతో నటి రియాసేన్
Actress Riya Sen in Bharat Jodo Yatra: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన దేశ వ్యాప్త పాద యాత్ర ‘భారత్ జోడో యాత్ర’ మహారాష్ట్రలో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలకే కాకుండా, పార్టీలకు అతీతంగా ప్రముఖులు, సెలబ్రిటీలు ఈ యాత్రలో పాలు పంచుకుంటున్నారు.
Actress Riya Sen in Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో రియాసేన్
మహారాష్ట్రలోని పాతూరు నుంచి గురువారం భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో రాహుల్ గాంధీతో పాటు గురువారం బాలీవుడ్ నటి రియాసేన్(Riya Sen) ఈ యాత్రలో పాల్గొన్నారు. ప్రింటెడ్ ఆరెంజ్ రెడ్ కలర్ కుర్తా, జీన్స్ ధరించి రాహుల్ తో పాటు కలిసి ఆమె నడిచారు. బాలీవుడ్ లో స్టైల్, ఖయామత్, ఝంకార్ బీట్స్, ధూమ్, సిటీ అండర్ త్రెట్ తదితర సినిమాల్లో ఆమె నటించారు. రాహుల్ గాంధీతో పాటు ఈ యాత్రలో ఇప్పటివరకు సినీ నటులు రితేశ్ దేశ్ ముఖ్, పూజా భట్, టీవీ యాక్టర్ సుశాంత్ సింగ్ రాహుల్ తో పాటు కలిసి నడిచారు.
Actress Riya Sen in Bharat Jodo Yatra: దేశ వ్యాప్త యాత్ర
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేపట్టిన కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ.. ఇప్పటివరకు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో తన యాత్ర ముగించారు. మహారాష్ట్రలో ఆయన దాదాపు 383 కిమీలు పాద యాత్ర చేయనున్నారు. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లోని 6 ఎంపీ, 15 ఎమ్మెల్యే స్థానాల్లో రాహుల్ యాత్ర సాగుతుంది. 12 రాష్ట్రాల్లో 3570 కిమీల యాత్ర కొనసాగించిన అనంతరం వచ్చే సంవత్సరం కశ్మీర్ లో ఈ యాత్ర ముగుస్తుంది. భారత దేశ చరిత్రలో ఇంత సుదీర్ఘమైన పాదయాత్ర చేసిన నాయకుడు లేడు. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ యాత్రకు కాంగ్రెస్ శ్రేణుల నుంచే కాకుండా, రాజకీయేతర వర్గాలు, పౌర సంఘాలు, సెలబ్రిటీలు, సామాన్యుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.