Bharat Jodo Yatra - Day 27: తల్లీ కొడుకుల ఆత్మీయత..
06 October 2022, 19:29 IST
Bharat Jodo Yatra - Day 27: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఆయన తల్లి, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ తల్లీకొడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని చూపే ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
భారత్ జోడో యాత్రలో పాల్గొన్న తన తల్లి సోనియాగాంధీ షూ లేస్ ను కడ్తున్న రాహుల్ గాంధీ
Bharat Jodo Yatra - Day 27: కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా ఈ యాత్రలో పాల్గొంటున్నాయి. యాత్ర 27వ రోజున కర్నాకటలో ఈ యాత్రలో పార్టీ చీఫ్ సోనియా గాంధీ పాలు పంచుకున్నారు.
Bharat Jodo Yatra - Day 27: సోనియా గాంధీ సైతం..
తాజాగా, కాంగ్రెస్ పార్టీ చీఫ్, రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీ కూడా ఈ యాత్రలో కొడుకు రాహుల్ తో పాటు అడుగులో అడుగేశారు. 76 ఏళ్ల వయస్సులో, ఆరోగ్యం అంతగా సహకరించనప్పటికీ.. రాహుల్ గాంధీతో కలిసి ఆమె కొన్ని కిలోమీటర్లు పాదయాత్రలో పాల్గొనడం విశేషం. షెడ్యూల్ ప్రకారం కొద్ది దూరమే నడవాల్సి ఉన్నా.. దాదాపు అరగంటకు పైగా ఆమె తన కొడుకుతో పాటు ఉత్సాహంగా అడుగులు వేశారు.
Bharat Jodo Yatra - Day 27: కొడుకు ప్రేమ..
ఈ పాదయాత్ర సందర్భంగా.. రాహుల్ గాంధీ పలుమార్లు తల్లి భుజం చుట్టూ ఆప్యాయంగా చేయి వేయడం, తల్లి షూ లేస్ ను తనే స్వయంగా కట్టడం అక్కడి వారిని ఆశ్చర్యచకితులను చేశాయి. సాధారణంగా, ప్రజా జీవితంలో ఉన్న కుటుంబాలు తమ ఆప్యాయత, అనురాగాలను బహిరంగంగా వ్యక్తపరచడం సరికాదనుకుంటారు. కానీ, రాహుల్ గాంధీ తన తల్లితో వ్యవహరించిన తీరు పట్ల అందరూ ఆయనకు అభిమానులయ్యారు. ముఖ్యంగా తల్లీ కొడుకుల అనుబంధానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Bharat Jodo Yatra - Day 27: పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం..
భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కర్నాటకలో సాగుతోంది. పార్టీ నేత డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధ రామయ్య తదితర నేతలు ఈ యాత్రను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. ముఖ్యంగా, యాత్రలో సోనియా గాంధీ పాల్గొనడంతో పార్టీ శ్రేణులు, నాయకుల్లో ఉత్సాహం పరవళ్లు తొక్కుతోంది. సోనియా గాంధీ పాదయాత్రలో పాల్గొన్నంత సేపూ.. కార్యకర్తల నుంచి నినాదాలు హోరెత్తాయి.
Bharat Jodo Yatra - Day 27: రాహుల్ ట్వీట్..
తాను చేపట్టిన భారత్ జోడో యాత్రలో తన తల్లి సోనియా గాంధీ పాల్గొన్నసందర్భంగా రాహుల్ గాంధీ ఒక ట్వీట్ చేశారు. ‘‘ఎన్నో తుపానులను ఎదుర్కొన్నాం.. మరెన్నో సవాళ్లను అధిగమించాం.. మనమంతా కలిసికట్టుగా భారత్ ను ఏకం చేద్దాం’’ అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ట్వీట్ తో పాటు పాదయాత్రలో తన తల్లి భుజం చుట్టూ చేయి వేసి నడుస్తున్న ఫొటోను జత చేశారు. ఇదే ఫొటోను కాంగ్రస్ కూడా తన అఫీషియల్ ట్విటర్ హ్యాండిల్ లో పోస్ట్ చేసింది. ఈ ట్వీట్లకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఇతర అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది.