Mangaluru Auto Blast: ‘ప్రమాదం కాదు.. ఉగ్రవాద చర్య'.. కుక్కర్కు డొటేనేటర్లు!
20 November 2022, 13:45 IST
Mangaluru Auto Blast: మంగళూరులో జరిగిన ఆటో పేలుడు ఘటనలో ఆశ్చర్యపరిచే నిజాలు బయటికి వస్తున్నాయి. ఇది ఉగ్రవాద చర్యగా ఆ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు.
Mangaluru Auto Blast: ఆటో పేలుడు ఘటనలో సంచలన విషయాలు
Mangaluru Auto Blast: కర్ణాటకలోని మంగళూరులో జరిగిన ఓ ఆటోరిక్షా పేలుడు ఘటనలో సంచలన విషయాలు బయటికి వచ్చాయి. శనివారం సాయంత్రం మంగళూరులో ఓ ప్రయాణిస్తున్న ఆటోలో హఠాత్తుగా పేలుడు జరిగింది. మంటలు వచ్చాయి. అయితే ముందుగా ఇది ప్రమాదం అని భావించారు. అయితే పోలీసుల విచారణలో విస్తుగొలిపే విషయాలు బయటికి వస్తున్నాయి. ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదని, ఉగ్ర చర్య అని తేలింది. ఈ విషయాన్ని కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ (Karnataka DGP Praveen Sood) వెల్లడించారు. ఈ ఆటో బ్లాస్ట్ విషయంలో మరిన్ని విషయాలు బయటికి వచ్చాయి.
“ఈ బ్లాస్ట్ ప్రమాదవశాత్తు జరిగింది కాదు. తీవ్రంగా నష్టం కలిగించాలనే ఉద్దేశంతో చేసిన ఉగ్రవాద చర్య. కేంద్ర ఏజెన్సీలతో కలిసి కర్ణాటక రాష్ట్ర పోలీసులు ఈ విషయంలో విచారణ చేస్తున్నాం” అని కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ ట్వీట్ చేశారు.
మంగళూరులోని ఓ పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం ఆటోలో పేలుడు సంభవించింది. డ్రైవర్, ఓ ప్రయాణికుడు ఈ ఘటనలో గాయపడ్డారు. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. అయితే పేలుడుకు గురైన ఆటోరిక్షాలో బ్యాటరీతో పాటు ప్రెజర్ కుక్కర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం.
Mangaluru Auto Blast: ‘కుట్ర దాగి ఉంది’
ఈ ఘటనపై కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర స్పందించారు. దీని వెనుక కుట్ర దాగి ఉందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. “మేం అందుకున్న సమాచారం బట్టి చూస్తే ఈ ఘటన వెనుక లోతైన కుట్ర దాగి ఉందని కనిపిస్తోంది. నిందితులకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది” అని ఆయన అన్నారు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారని, మాట్లాడలేని స్థితిలో ఉన్నారని చెప్పారు. కేంద్ర ఏజెన్సీలతో కలిసి రాష్ట్ర పోలీసులు విచారణ చేస్తున్నారని జ్ఞానేంద్ర తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో పూర్తి వివరాలు బయటపడతాయన్నారు.
Mangaluru Auto Blast: కుక్కర్ కు డెటోనేటర్, బ్యాటరీలు
ఈ బ్లాస్ట్ కోసం ఓ కుక్కర్ కు డొటేనేటర్లు, వైర్లు, బ్యాటరీలను నిందితులు ఫిట్ చేసినట్టు పోలీస్ వర్గాల నుంచి సమాచారం బయటికి వచ్చింది. పేలుడు తర్వాత ఆటో లోపల పూర్తిగా ధ్వంసం అయింది. తీవ్రమైన బ్లాస్ట్ చేసేందుకు ఆటోలోని వారు ఆత్మాహుతికి ప్రయత్నించారని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. కోయంబత్తూరులో జరిగిన కార్ బ్లాస్ట్ కు, దీనికి సంబంధాలు ఉన్నాయన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. అయితే వదంతులు నమ్మొద్దని పోలీసులు చెబుతున్నారు.
Mangaluru Auto Blast: అతడే ప్రధాన నిందితుడు! నకిలీ ఆధార్
ఈ ఆటో పేలుడు ఘటనలో ప్యాసింజర్ ను ప్రధాన నిందితుడిగా పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. పేలుడు జరిగిన ఆటోలో ఓ ఆధార్ కార్డు దొరికింది. అయితే అది హుబ్లీకి చెందిన ఓ వ్యక్తిదిగా గుర్తించారు. ఈ ఘటనతో అతడికి సంబంధం లేదని చెబుతున్నారు. ఆ ఆధార్ కార్డులోని వ్యక్తి చూసేందుకు తనలానే ఉండడంతో ఆటోలో ఉన్న నిందితుడు దీన్ని వాడుతున్నట్టుగా పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఎవరిని టార్గెట్ చేసుకొని ఈ పేలుడు పాల్పడ్డారన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదని పోలీసులు చెబుతున్నారు. ఇక నిందితుడు వాడుతున్న సిమ్ కార్డు కూడా నకిలీ పేరు మీదే తీసుకున్నాడని తెలుస్తోంది.
ఓ బిల్డింగ్ నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో శనివారం ఈ ఆటో పేలుడు జరిగింది. ఇందులో డ్రైవర్ తో పాటు ప్రయాణికుడు గాయపడ్డారు. ఈ దృశ్యాలు సీసీ టీవీలో కూడా రికార్డ్ అయ్యాయి. దీన్ని ముందుగా చిన్నపాటి పేలుడుగానే భావించారు. అయితే ఉగ్రవాద లింకులు ఉన్నట్టు విచారణలో తేలింది.