Monsoon: అలా జరిగితే నైరుతి రుతుపవనాల విస్తరణ మరింత ఆలస్యం! వివరాలివే
01 June 2023, 16:36 IST
- Monsoon: నైరుతి రుతుపవనాల విస్తరణ ఈ ఏడాది కాస్త ఆలస్యంగానే జరిగేలా కనిపిస్తోంది. అల్ప పీడనం ఏర్పడుతుందన్న అంచనాలు ఉన్నాయి.
Monsoon: అలా జరిగితే నైరుతి రుతుపవనాల విస్తరణ మరింత ఆలస్యం! వివరాలివే (HT Photo)
Southwest Monsoon: నైరుతి రుతుపవనాలు ఈనెల 4వ తేదీన దేశంలో ముందుగా కేరళలోకి ప్రవేశించనున్నాయి. సాధారణం కంటే ఈసారి నాలుగు రోజులు ఆలస్యంగానే కేరళకు రుతుపవనాలు రానున్నాయి. అయితే, అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడుతుందని తాజాగా అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో నైరుతి రుతుపవనాల విస్తరణకు ఆటంకం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెల 6వ తేదీలోగా అల్పపీడనం ఏర్పడనుండటంతో కేరళ నుంచి ఇతర ప్రాంతాలకు రుతు పవనాల పయనం మందగించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రుతు పవనాల విస్తరణకు అల్పపీడనం ఆటంకం కలిగించొచ్చని చెబుతున్నారు. దీంతో ఈసారి వర్షాకాలం ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివరాలివే.
“జూన్ 6వ తేదీ నాటికి అరేబియా సముద్రం మీదుగా ఆల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని మోడల్స్ చూపిస్తున్నాయి. ఇక రుతు పవనాల విస్తరణ అనేది అల్పపీడన కదలిక, తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. ఈ అల్పపీడనం భారత తీరం వైపునకు వస్తుందా.. మన తీరానికి దూరంగా ఉంటుందా? అనేది చూడాల్సి ఉంటుంది. మోడల్ విభిన్న పరిస్థితులను సూచిస్తోంది. 5 రోజుల కంటే ముందు మేం ఏం ప్రకటించలేం. అందుకే కాస్త వేచిచూస్తాం. ఆ తర్వాత హెచ్చరిక జారీ చేస్తాం. ఒకవేళ అల్పపీడన తీవ్రమైతే.. రుతుపవనాల పురోగతిపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది” అని భారత వాతావరణ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు నైరుతి రుతు పవనాలు జూన్ రెండో వారంలో ప్రవేశిస్తాయని ప్రస్తుతం అంచనాలు ఉన్నాయి. అయితే, ఒకవేళ అల్పపీడన ప్రభావం పడితే మూడు రోజులు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బంగాళాఖాతం ఉత్తర పరిమితులైన అండమాన్ నికోబార్ దీవులను ఇప్పటికే నైరుతి రుతుపవనాలు కప్పేశాయి. మాల్దీవులు, కమోరిన్ ప్రాంతాలకు ఈ ఇవి చేరుకునేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతం ప్రాంతాలకు రానున్న రెండు మూడు రోజుల్లో రుతుపవనాలు చేరుకుంటాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంగా జూన్ 1వ తేదీనే కేరళలో నైరుతి రుతు పవనాలు ప్రవేశించాలి. అయితే ఈ సారి కాస్త ఆలస్యమై జూన్ 4న వస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ప్రైవేట్ సంస్థ అయిన స్కైమేట్ వెదర్ సర్వీసెస్ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేసింది. “జూన్ 3,4 తేదీల్లో రుతుపవనాలు ప్రారంభం అవుతాయని మేం భావిస్తున్నాయి. అయితే ప్రస్తుతం రుతుపవనాల పురోగతిపై అనిశ్చితి నెలకొని ఉంది. జూన్ 6 లేకపోతే జూన్ 7వ తేదీ నాటికి అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది తుఫానుగా మారుతుందా లేదా అనేది ప్రస్తుతానికి స్పష్టత లేదు. అయితే, తేమ అంతా అల్ప పీడనం చుట్టూ కేంద్రీకృతం అవుతుంది. ఇది రుతుపవనాల విస్తరణ ఆటంకం కలిగిస్తుంది. పశ్చిమ తీరం చుట్టూ వర్షాలు కురుస్తాయి. అయితే జూన్ 10 వరకు ఆ ప్రాంతాలను రుతుపవనాలు తాకకపోవచ్చు. రుతు పవనాల విస్తరణకు ప్రస్తుత పరిస్థితి అంత అనుకూలంగా లేవు” అని స్కైమేట్ వెదర్ క్రైమేట్, మెట్రాలజీ వైస్ ప్రెసిడెంట్ మహేశ్ పలావత్ చెప్పారు.
సాధారణంగా అయితే కేరళకు జూన్ 1న నైరుతి రుతుపవనాలు ప్రవేశించి వానాకాలం మొదలవ్వాలి. ఆ తర్వాత ఐదు నుంచి ఆరు రోజుల్లో దేశమంతా విస్తరించాలి. అయితే ఈసారి మొత్తం ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఇక అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉంటే.. రుతు పవనాల విస్తరణ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.