Delhi HC: విమానాల్లో మాస్కు ధరించాల్సిందే.. లేకపోతే ‘నో ఫ్లై’ జాబితాలోకే
04 June 2022, 11:08 IST
- విమాన ప్రయాణికులు మాస్క్లను కచ్చితంగా ధరించేలా నిబంధనలను అమలు చేయాలని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
డీజీసీఏకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు
విమానాశ్రయాల్లో, విమానాల్లో మాస్క్ నిబంధనపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ ధరించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కొవిడ్ ముప్పు నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు భారీ జరిమానాలను విధించాలని ఆదేశాలు జారీ చేసింది.
నో ఫ్లై జాబితాలో పెట్టండి...
ప్రయాణికులు మాస్కులు ధరించడం లేదని పిటిషన్ వాదించారు. తాజా నిబంధనలు తప్పక అమలయ్యేలా.. డీజీసీఏ మార్గదర్శకాలు రూపొందించాలని కోర్టు ఆదేశించింది. మాస్కులు ధరించకుండా, పరిశుభ్రతా నియమాలను ఉల్లంఘించే ప్రయాణికులు, ఇతరులపై చర్యలు తీసుకునేలా చర్యలు ఉండాలని సూచించారు. విమానాశ్రయాలు, విమానాల్లోని సిబ్బందికి మార్గదర్శకాలు ఇవ్వాలని వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని అవసరమైతే వారిని విమానంలో నుంచి దించివేయాలి. వారి పేర్లను 'నో ఫ్లై' జాబితాలో ఉంచాలని స్పష్టం చేసింది.
మరోవైపు దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ మళ్లీ మొదలైనట్లు కనిపిస్తోంది. గత కొన్నిరోజులుగా రోజువారీ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కరోనా క్రియాశీల కేసుల సంఖ్య 21వేలు దాటింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం.. తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో స్థానికంగా కొవిడ్ కేసులు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గుర్తించింది. కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలి సూచించింది.