Bengaluru-Chennai Expressway : 2024 మార్చ్ నాటికి బెంగళూరు- చెన్నై ఎక్స్ప్రెస్వే సిద్ధం!
06 January 2023, 8:55 IST
Bengaluru-Chennai Expressway : 2024 మార్చ్ నాటికి బెంగళూరు- చెన్నై ఎక్స్ప్రెస్వే సిద్ధమవుతుంది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
వచ్చే ఏడాదిలో అందుబాటులోకి బెంగళూరు- చెన్నై ఎక్స్ప్రెస్వే!
Bengaluru-Chennai Expressway : రూ. 17వేల కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న బెంగళూరు- చెన్నై ఎక్స్ప్రెస్వే గురించి కీలక అప్డేట్ ఇచ్చారు కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ. 2024 మార్చ్ నాటికి.. ఈ ఎక్స్ప్రెస్వే పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు.
బెంగళూరులో గురువారం ఆకస్మిక పర్యటన చేపట్టారు నితిన్ గడ్కరీ. నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారుల పనులను తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాజెక్ట్లో భాగంగానే.. 52కి.మీల బెంగళూరు- మైసూర్ గ్రీన్ఫీల్డ్ హైవేను కూడా నిర్మిస్తున్నట్టు చెప్పారు.
Bengaluru-Chennai Expressway inauguration : "వచ్చే నెలలో బెంగళూరు- మైసూర్ హైవే ప్రాజెక్ట్ పూర్తవుతుంది. కొన్ని పనులు పెండింగ్లో ఉండటం చూశాను. అవి సమయానికి అయిపోతాయి. ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని లేదా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానిస్తాము," అని నితిన్ గడ్కరీ అన్నారు.
నితిన్ గడ్కరీ ప్రకారం.. బెంగళూరు- మైసూర్లో 10లెన్ల ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతోంది. హైవేలను ఆనుకుని ఉన్న గ్రామాలు, పట్టణాల్లోకి వెళ్లేందుకు.. చెరో వైపు రెండు లేన్లను ఏర్పాటు చేశారు. మిగిలినవి డైరక్ట్గా బెంగళూరు/మైసూర్కు వెళ్లేందుకు ఉపయోగపడతాయి.
Bengaluru-Chennai Expressway Nitin Gadkari : బెంగళూరు- మైసూర్ ప్రాజెక్ట్ను రెండు భాగాలుగా విడదీశారు. ఒకటి.. బెంగళూరు నుంచి నిదఘట్ట వరకు. ఇంకోటి.. నిదఘట్ట నుంచి మైసూర్ వరకు ఉంటుంది. ప్రాజెక్ట్ పూర్తయితే.. బెంగళూరు నుంచి మైసూర్కు.. కేవలం 70 నిమిషాల్లో చేరుకోవచ్చని కేంద్రం చెబుతోంది.
"మేము జాతీయ రహదారులను నిర్మించి ఇస్తున్నాము. ఇక ఆ పరిసర ప్రాంతాలను ఇండస్ట్రియల్ క్లస్టర్గా అభివృద్ధి చేసుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే," అని నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు.
Bengaluru-Chennai Expressway route map : మొత్తం మీద.. 285.3కి.మీల బెంగళూరు- చెన్నై ఎక్స్ప్రెస్వేను నిర్మిస్తోంది కేంద్రం. 231కి.మీల్లో ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. 2024 మార్చ్ నాటికి ఎక్స్ప్రెస్వే పనులు పూర్తవుతాయి. ఈ ప్రాజెక్ట్లో కొంత అటవీ ప్రాంతం కూడా ఉందని, అందులో నిర్మాణాల కోసం క్లియరెన్స్ ఇవ్వాలని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైకి విజ్ఞప్తి చేసినట్టు పేర్కొన్నారు నితిన్ గడ్కరీ.
అంతేకాకుండా.. బెంగళూరు శాటిలైట్ రింగ్ రోడ్డు నిర్మాణంపై కసరత్తులు చేస్తున్నట్టు నితిన్ గడ్కరీ వివరించారు. దీని వ్యయం రూ. 17వేల కోట్లని అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు. మొత్తం మీద ఇదొక 288కి.మీల ప్రాజెక్ట్ అని వెల్లడించారు. ఈ 288 కి.మీల్లో కర్ణాటకలోనే 243కి.మీల రోడ్డు ఉంటుందని స్పష్టం చేశారు.
Bengaluru-Chennai Expressway project : "ఈ శాటిలైట్ రింగ్ రోడ్డును.. పుణె- బెంగళూరుకు కనెక్ట్ చేయాలని చూస్తున్నాము. ఆ తర్వాత.. దానిని ముంబై- పుణె ఎక్స్ప్రెస్వేకు కనెక్ట్ చేస్తాము. ఈ పనులు పూర్తయితే.. బెంగళూరు నుంచి ముంబైకి కేవలం ఆరున్నర- ఏడు గంటల్లో వెళ్లిపోవచ్చు," అని నితిన్ గడ్కరీ తెలిపారు.