NTR Fans Arrested: మితిమీరిన అభిమానం.. మేకలను బలిచ్చి పోస్టర్పై రక్తాభిషేకం.. పోలీసుల అరెస్ట్
23 May 2023, 11:44 IST
- NTR Fans Arrested: కర్ణాటకలోని రాబర్ట్సన్పేటలో 9 మంది ఎన్టీఆర్ అభిమానులను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల తారక్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫ్లెక్సీపై మేకలను చంపి వాటి రక్తాన్ని చిందించారు. ఈ కారణంగా పోలీసులు అరెస్టు చేశారు.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ అరెస్ట్
NTR Fans Arrested: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుంత కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. దీంతో ఎంతకాలం నుంచో ఎదురుచూస్తున్న తరుణం రావడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పైపెచ్చు సింహాద్రి 4కేలో రిలీజ్ కావడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే కర్ణాటకలో రాబర్ట్సన్ పేటలో తారక్ ఫ్యాన్స్ అత్యుత్సాహం చూపించారు. ఫలితంగా కటకటాల పాలయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా దేవర పోస్టర్ రిలీజ్ కావడంతో కర్ణాటకలోని రాబర్ట్సన్ పేటలో మేకలను కొంతమంది ఫ్యాన్స్ మేకలను బలి ఇచ్చారు. అంతేకాకుండా తారక్ ఫ్లెక్సీపై ఆ మేకల రక్తాన్ని చిందించారు. దేవర పోస్టర్పై రక్తాభిషేకం మాదిరిగా చేశారు. దీంతో ఈ ఘటనకు కారణమైన 9 మంది అభిమానులను పోలీసులు అరెస్టు చేశారు.
వీరిని పీ శివనాగరాజు, కే సాయి, జీ సాయి, డీ నాగ భూషణం, వీ సాయి, పీ నాగేశ్వరరావు, వై ధరణి, పీ శివ, బీ అనిల్ కుమార్లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మే 20న వీరంతా ఎన్టీఆర్ పుట్టిన రోజు జరుపుకోడానికి రాబర్ట్సన్ పేటలోని సిరి కృష్ణ, సిరి వెంకట థియేటర్క వచ్చారు. అనంతరం మేకరలను చంపి వాటి రక్తాన్ని జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్పై చిందించారు. ఆ తర్వాత మేకలను చంపడానికి ఉపయోగించిన ఆయుధాలతో పాటు మేకల మృతదేహాలను తీసకెళ్లారు. దీంతో ఈ 9 మంది ఫ్యాన్స్ను పోలీసులు అరెస్టు చేశారు.
ఫ్యాన్స్ మితిమీరి ప్రవర్తించడం ఇదే మొదటి సారి కాదు. ఇటీవలే తారక్ అభిమానులు మరో ఘటనలో థియేటర్లో మంటలు చెలరేగడానికి కారణమయ్యారు. విదేశాల్లో సైతం ఇలాంటి ఘటనలు జరిగాయి. దీంతో పలు షోలను థియేటర్ యాజమాన్యాలు రద్దు చేసుకున్నాయి. అభిమానం హద్దులు దాటిన ప్రతిసారి ఏదోక నష్ట జరుగతూనే ఉంది. ఈ విషయంలో సదరు హీరోల అభిమానులు ఆచితూచి వ్యవహరించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
ప్రస్తుతం తారక్ దేవర చిత్రంతో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, హరికృష్ణ కే నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్ రామ్ ఈ సినిమాకు సమర్పకులుగా వ్యవహిరంచారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్చున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నారు. ఆర్ట్ డైరెక్టర్గా సాబు సిరిల్, రత్నవేలు ఛాయగ్రహణం, శ్రీకర ప్రసాద్ ఎడిటర్గా వ్యవహరించనున్నారు. త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది.