Maharshi Actor Guru Swamy Died: టాలీవుడ్లో విషాదం.. 'మహర్షి' సినిమాలో రైతు గురుస్వామి మృతి
09 September 2022, 20:16 IST
- Maharshi Actor Died: మహర్షి సినిమాలో రైతుగా నటించి ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని సాధించిన నటుడు గురుస్వామి మరణించారు. అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచారు. మహేశ్ బాబుకు వ్యవసాయం నేర్పించే రైతు పాత్రలో ఆయన ఒదిగిపోయారు.
మహర్షి రైతు గురుస్వామి మృతి
Maharshi Actor Guru Swamy Passed Away: టాలీవుడ్లో గత కొంతకాలంగా వరుసగా సినిమా నటీ, నటుల మరణం విషాదం నింపుతోంది. తాజాగా మహర్షి చిత్రంతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గురుస్వామి కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం నాడు తుదిశ్వాస విడిచారు. మహేశ్ బాబు హీరోగా.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన మహర్షి సినిమాలో రైతుగా నటించిన గురుస్వామి ఆకట్టుకున్నారు. రైతు అంటే ఇలానే ఉండాలి అనేంతగా సినిమాలో అలరించారు.
ఈ చిత్రంలో గురుస్వామి మహేశ్ బాబుకు వ్యవసాయం ఎలా చేయాలో నేర్పిస్తారు. వీరిద్దరి మధ్య నడిచే సన్నివేశాలు ఎంతో ఎమోషనల్గా ఉంటాయి. ముఖ్యంగా మట్టికి, రైతుకు మధ్య ఉన్న బంధాన్ని చెప్పే క్రమంలో ఆయన సంభాషణలు, నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. మహర్షి చిత్రంతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న గురుస్వామి.. ఈ సినిమా తర్వాత కూడా పలు సినిమాల్లో నటించారు.
గురుస్వామి స్వస్థలం కర్నూలు జిల్లా వెల్దుర్తి. అక్కడే విద్యాబ్యాసం పూర్తి చేసి ఉన్నత చదువులు చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా స్థిరపడ్డారు. ఆయన్ స్వతహాగా నాటక రంగానికి చెందిన కళాకారుడు. అందుకే ఉద్యోగం చేస్తూనే నాటక రంగంలో రాణించారు. 2019లో వ్చ్చిన మహర్షి సినిమాతో వెండితెరపై తనదైన నటనతో ఆకట్టుకున్నారు. తాజాగా ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
టాపిక్