Charmme Kaur Clarity on rumours: పూరితో విడిపోవడంపై క్లారిటీ ఇచ్చిన చార్మీ.. రూమర్లకు చెక్..!
08 September 2022, 17:31 IST
- Charmme Kaur Clarity on Puri Connects: లైగర్ ఫ్లాప్తో చార్మి, పూరి జగన్నాథ్ విడిపోయారని సోషల్ మీడియా విస్తృతంగా ఊహాగానాలు వస్తున్నాయి. తాజాగా ఈ పుకార్లపై క్లారిటీనిచ్చింది చార్మీ కౌర్. త్వరలో తిరిగి వస్తామని స్పష్టం చేసింది.
చార్మీ కౌర్
Charmme Kaur Clarity on Rumours: విజయ్ దేవరకొండ హీరోగా.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లైగర్. ఈ చిత్రం ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన అభిమానులకు నిరాశే మిగిలింది. ఫలితంగా సోషల్ మీడియా వేదికగా పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించిన పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ విడిపోయారని పలు రూమర్లు వ్యాప్తి చెందుతున్నాయి. తాజాగా వీటిపై క్లారిటీ ఇచ్చింది చిత్ర నిర్మాతల్లో ఒకరైన చార్మీ.
“ప్రశాంతంగా ఉండండి అబ్బాయిలు.. సోషల్ మీడియా నుంచి కాస్త బ్రేక్ తీసుకున్నాం. పూరి కనెక్ట్స్ తిరిగి వస్తుంది. ఈ సారి భారీగా, మరింత మెరుగ్గా బౌన్స్ బ్యాక్ అవుతుంది. అంతవరకు కూల్గా ఉండండి” అంటూ చార్మీ తన ట్విటర్ వేదికగా పోస్ట్ పెట్టింది.
టాలీవుడ్ ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం. పూరి-చార్మి ఇద్దరూ విజయ్తో తాము తీయబోయే పాన్ఇండియా ప్రాజెక్టు జనగణమనను నిలిపివేశారని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా వీరిద్దరూ వ్యాపార భాగస్వాములుగా తమ దారులు తాము చూసుకున్నారని, పూరి జగన్నాథ్ కూడా ముంబయి నుంచి తన మకాం తిరిగి హైదరాబాద్కు మార్చారని సోషల్ మీడియాలో ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ వార్తలకు మరింత బలం చేకూరూస్తూ సోషల్ మీడియాకు బ్రేక్ తీసుకుంటున్నామని చార్మీ ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. దీంతో మరో ట్వీట్తో స్పష్టతనిచ్చే ప్రయత్నం చేసిందీ ముద్దుగుమ్మ.
"రూమర్లు, రూమర్లు, రూమర్లు.. ఈ ఊహాగానాలన్నీ ఫేక్. పూరి కనెక్ట్స్ ఎలా పురోగతి చేయాలనే అంశంపై మేము ప్రస్తుతం దృష్టి పెట్టాం. అప్పటి వరకు ఈ పుకార్లను ఆపండి" అంటూ చార్మీ ట్విటర్ వేదికగా స్పష్టం చేసింది. చార్మీ ఇచ్చిన ఈ ప్రకటనతో పూరి జగన్నాథ్తోనే తన తదుపరి చిత్రం తీయబోతున్నట్లు తెలుస్తోంది.
విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రం గత నెల 25న విడుదలైంది. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఆయనతో పాటు కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇది విజయ్కు హిందీలో తొలి చిత్రం. రమ్య కృష్ణ ఇందులో రౌడీ హీరోకు తల్లి పాత్రలో కనిపించింది. అనన్యా పాండే హీరోయిన్ కాగా.. రోనిత్ రాయ్ విజయ్కు కోచ్ పాత్రలో కనిపించారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా ఏకకాలంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.