తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Jagan Srikakulam Tour: నేడు శ్రీకాకుళం జిల్లాకు సీఎం జగన్‌ - భూపత్రాలు పంపిణీ

CM Jagan Srikakulam Tour: నేడు శ్రీకాకుళం జిల్లాకు సీఎం జగన్‌ - భూపత్రాలు పంపిణీ

HT Telugu Desk HT Telugu

23 November 2022, 8:12 IST

    • ఏపీ సీఎం జగన్ బుధవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష (రీ సర్వే) పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
ఏపీ సీఎం జగన్
ఏపీ సీఎం జగన్

ఏపీ సీఎం జగన్

CM YS Jagan Srikakulam Tour: ఇవాళ సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష (రీ సర్వే) పత్రాల పంపిణీని ఆయన ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు నరసన్నపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానానికి చేరుకుంటారు. 11 నుంచి 12.55 గంటల వరకు అక్కడ జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు. లబ్ధిదారులకు పత్రాలు పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 1.25 గంటలకు అక్కడ బయలుదేరి 3.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం…

2020 డిసెంబర్‌ 21న వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఇప్పటివరకు 47 వేల 276 చదరపు కిలోమీటర్ల పరిధిలోని.... 6 వేల 819 గ్రామాల్లో డ్రోన్‌ ఫ్లయింగ్‌ పూర్తిచేసింది. 2 వేల గ్రామాల్లో రీసర్వే కార్యకలాపాలు పూర్తవగా... 18 వందల 35 గ్రామాల్లో 7 లక్షల 29 వేల 381 మంది రైతుల భూహక్కు పత్రాలను తయారుచేశారు. వచ్చే 15 రోజుల్లో 2 వేల గ్రామాలకు సంబంధించిన రైతులకు భూహక్కు పత్రాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఈ 2 వేల గ్రామాల రిజిస్ట్రేషన్ సేవలను గ్రామ సచివాలయాల్లో ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌ బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో.. భూపత్రాల పంపిణీని ప్రారంభిస్తారు.

అత్యాధునిక సాంకేతికతో భూముల రీసర్వే కార్యక్రమాన్ని చేపట్టింది ఏపీ సర్కార్. డ్రోన్లు, కంటిన్యూయస్లీ ఆపరేటింగ్‌ రిఫరెన్స్‌ స్టేషన్లు, జీఎన్‌ఎస్‌ఎస్‌ రోవర్స్‌ వంటి అత్యాధునిక సర్వే సాంకేతికతలను ఉపయోగించి ఈ సమగ్ర రీసర్వేని నిర్వహిస్తోంది. భూ హక్కు పత్రం అందించడం ద్వారా భూ యజమానులకు హక్కు భద్రత కల్పించడం, 5 సెంమీ లేదా అంతకంటే తక్కువ ఖచ్చితత్వంతో జియో–రిఫరెన్స్‌ కోఆర్డినేట్‌ల ఆధారంగా భూ రక్ష సర్వే రాళ్లను నాటడం ద్వారా భూమికి భౌతిక భద్రత కల్పించడం ఈ సమగ్ర సర్వే ప్రధాన లక్ష్యాలు. ప్రతి భూ కమతానికి విడిగా అక్షాంశ, రేఖాంశాలు, విశిష్ట గుర్తింపు సంఖ్య, సమగ్రంగా భూ వివరాలు తెలిపే క్యూఆర్‌ కోడ్‌తో కూడిన భూ కమత పటం భూ యజమానులకు జారీ చేయనున్నారు. గ్రామ స్థాయిలో భూ రికార్డులన్నీ క్రోడీకరించి, మ్యాపులు ( భూ కమతాలతో కూడిన గ్రామ పటం) ఇతర భూ రికార్డులు ఇక గ్రామాల్లోనే అందుబాటులో ఉన్నాయి. ఈ ఫ్లాగ్‌షిప్‌ ప్రోగ్రామ్‌ రూ. 1000 కోట్ల కంటే ఎక్కువ అంచనా వ్యయంతో ప్రారంభించబడింది, డిసెంబర్, 2023 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను రూపొందించింది.

సీఎం పర్యటన సందర్భంగా నరసన్నపేటలో విస్తృత ఏర్పాట్లు చేశారు అధికారులు. 2 కిలోమీటర్ల మేర బారికేడ్లు ఏర్పాటు చేశారు. పలుమార్గాల్లో రోడ్లను బంద్ చేశారు. పోలీసు బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేశారు.