తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Independence Day : స్వాతంత్య్ర సమరయోధుల కోసం అక్కడ ఆహార పొట్లాలు పెట్టేవారు

Independence Day : స్వాతంత్య్ర సమరయోధుల కోసం అక్కడ ఆహార పొట్లాలు పెట్టేవారు

Anand Sai HT Telugu

15 August 2022, 15:41 IST

    • ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.. తెలుగు నేలపై స్వాతంత్య్ర సమరయోధులు ఎంతోమంది. తమ రక్తాన్ని ఉద్యమానికి ధారపోశారు. బానిస సంకెళ్లను తెచ్చేందుకు, భవిష్యత్ తరాలకు స్వేచ్ఛా వాయువును అందించేందుకు ప్రాణాలను వదిలారు. అలాంటి వారిలో ఒకరు సుందరం.
సుందరం కోసం నిర్మించిన ఆలయం
సుందరం కోసం నిర్మించిన ఆలయం

సుందరం కోసం నిర్మించిన ఆలయం

తూర్పుగోదావరి జిల్లా గుమ్మలదొడ్డి గ్రామంలో శ్రీరామగిరి ఆలయాన్ని స్వాతంత్య్ర సమరయోధుడు సుందరం నిర్మించారు. ఆయన గుర్తుగా శిష్యులు ఓ ఆలయాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ శిష్యులు, అనుచరులు పూజలు చేస్తున్నారు. ఈ ఆలయం రాజమండ్రి జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్వాతంత్య్ర సమరయోధుడు, విద్యావేత్త, దేవాలయ నిర్మాత అయిన అప్పనబోయిన సుందరం స్వరాజ్యానికి ముందు స్వాతంత్య్ర సమరయోధుడిగా, స్వరాజ్యం తర్వాత గ్రామాభివృద్ధి యోధుడిగా సేవలందించారు.

1902లో జన్మించిన సుందరం 2005 వరకు సుమారు 103 సంవత్సరాలు జీవించారు. స్వాతంత్య్ర పోరాటం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో దేశభక్తి భావజాలం, పోరాట పటిమ సుందరాన్ని గుమ్మలదొడ్డి ప్రాంతంలో స్వాతంత్య్ర సమరయోధుడిగా తయారు చేశాయి. అజ్ఞాతంలో ఉన్న స్వాతంత్య్ర సమరయోధులకు గుమ్మలదొడ్డి నుంచి ఆహార పదార్థాలు పంపేవారు. కొంతమంది గ్రామస్తులు ఆహార పొట్లాలను తీసుకుని సుందరం గుర్తించిన కొన్ని చోట్ల ఉంచేవారు. ముందుగానే ఆయన ఏ ప్రాంతంలో పెట్టాలో చెప్పేవారట. ఇప్పుడు నిర్మించిన శ్రీరామగిరి ఆలయం ప్రాంతంలోనూ ఆహారాన్ని పెట్టేవారు.

అప్పటి పోరాట వివరాలను సుందరం స్వయంగా చెప్పడం విన్నామని గ్రామస్థులు ఇప్పటికీ చెబుతున్నారు. సుందరం పెళ్లి చేసుకోలేదని, బంధువులు ఎవరూ లేరని, చివరి వరకు ఒంటరిగా జీవించేవారని తెలిపారు. కానీ గ్రామస్థులందరినీ తన కుటుంబంలా ప్రేమించేవాడు. 2003 వరకు ఆరోగ్యంగా, చురుగ్గా ఉన్న సుందరంతో పరిచయం ఏర్పడిన వారందరూ ఆయనకు సేవ గురించి గుర్తు చేసుకుంటారు.

గుమ్మలదొడ్డి గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది శ్రీరామగిరి ఆలయం. 1956లో గ్రామంలోని సుమారు ఆరు ఎకరాల కొండపై గొప్ప ఆలయాన్ని నిర్మించాడు సుందరం. భద్రాద్రి ఆలయంలో పాంచరాత్ర ఆగమ ప్రకారం ఆగమ క్రతువులు నిర్వహించేందుకు అర్చకులుగా ఆచార్యులను రప్పించారు. గుమ్మలదొడ్డి, అచ్యుతాపురం, బావాజీ పేట, వెదురుపాక తదితర గ్రామస్తులకు ఈ దేవాలయం ఆరాధ్యదైవంగా ఉంది. దీనిని సుందరగిరి అని కూడా పిలుస్తారు.

సుందరం శ్రమదానంతో (స్వాతంత్య్రానికి ముందు ప్రజల భాగస్వామ్యంతో) గుమ్మళ్లదొడ్డి నుంచి అచ్యుతాపురం గ్రామం వరకు అందమైన మట్టి రోడ్డును నిర్మించారు. ఆయన సేవలకు గుర్తింపుగా 25 మంది శిష్యుల బృందం శ్రీరామగిరి (సుందరగిరి) పాదాల వద్ద ఒక చిన్న ఆలయాన్ని నిర్మించి, సుందరుని విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్ లో భాగంగా ఇక్కడ సుందరం శిష్యులంతా చేరి స్మరించుకున్నారు. వేడుకలను ఘనంగా నిర్వహించారు.