Chandrababu Letter : రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ దుర్వినియోగం, హనుమాయమ్మ హత్యే నిదర్శనం- డీజీపీకి చంద్రబాబు లేఖ
06 June 2023, 17:04 IST
- Chandrababu Letter : ప్రకాశం జిల్లాలో మహిళను ట్రాక్టర్ తో ఢీకొట్టి హత్య చేసిన ఘటనపై చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు. ఈ ఘటనను కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. హత్య ఘటనలో వైసీపీ నేతల ప్రమేయం ఉందని, వారికి పోలీసులు సహకరించాలని చంద్రబాబు ఆరోపించారు.
చంద్రబాబు
Chandrababu Letter : ప్రకాశం జిల్లా రావివారిపాలెంలో అంగన్ వాడీ వర్కర్ హనుమాయమ్మ హత్యపై ఏపీ డీజీపీ సహా పలువురికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు లేఖలు రాశారు. దళిత మహిళ దారుణ హత్యపై జోక్యం చేసుకోవాలని నేషనల్ ఎస్సీ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ మహిళా కమిషన్ లకు లేఖలు రాశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ దుర్వినియోగం, బడుగువర్గాల హక్కులు హరిస్తున్న విధానంపై తన లేఖల్లో వివరించారు. హనుమాయమ్మ హత్యపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలని చంద్రబాబు కోరారు. హత్య ఘటనలో వైసీపీ నేతలకు పోలీసుల సహకారంపై విచారణ జరగాలన్నారు. అంగన్ వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న హనుమాయమ్మ కుటుంబానికి రూ.1 కోటి పరిహారం ఇవ్వడంతో పాటు ఆమె కుమార్తెకు ఉద్యోగం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చంద్రబాబు.
డీజీపీకి రాసిన లేఖలో కీలక విషయాలు ప్రస్తావన
రాష్ట్రంలో దారుణమైన శాంతిభద్రతల పరిస్థితిపై ఇప్పటికే అనేక సార్లు లేఖలు రాశానని చంద్రబాబు అన్నారు. కొందరు పోలీసులు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తూ.... వైసీపీ నేతలకు బాసటగా నిలుస్తున్న కారణంగా జరుగుతున్న దౌర్జన్యాలను అనేక సార్లు మీ దృష్టికి తీసుకువచ్చానని డీజీపీకి రాసిన లేఖలో అన్నారు. పోలీసులు నేరాలను అరికట్టడంపై పెట్టాల్సిన శ్రద్ధను, ప్రజాస్వామ్య నిరసనలు అణచివేసేందుకు పెడుతున్నారని ఆరోపించారు. పోలీసుల సహకారంతో జరుగుతున్న దౌర్జన్యాల్లో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల వర్గాల ప్రజలు బాధితులు అవుతున్నారన్నారు.
బాధిత కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం ప్రకటించాలి
టంగుటూరు మండలం రావివారిపాలెంలో అంగన్ వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న దళిత మహిళ హనుమాయమ్మ దారుణ హత్యకు గురైందని చంద్రబాబు గుర్తుచేశారు. ఇదే గ్రామానికి చెందని సంవలం కొండల రావు హనుమాయమ్మను ట్రాక్టర్ తో తొక్కించి అత్యంత దారుణంగా హతమార్చాడని ఆరోపించారు. రెండు సార్లు ఆమెపై ట్రాక్టర్ నడిపించి మరీ కిరాతకంగా హనుమాయమ్మను హత్య చేశాడన్నారు. ఈ దాడిని అడ్డుకునే ప్రయత్నం చేసిన బాధితురాలి కుమార్తెపైనా నిందితుడు దాడి చేశాడని లేఖలో తెలిపారు. నిందితుడు ఎక్కడ ఉన్నాడనే విషయంలో స్థానికులు అక్కడికి వచ్చిన పోలీసులకు సమాచారం ఇచ్చినా అరెస్టు చేయకపోగా...అతడు పారిపోయేందుకు సహకరించారని చంద్రబాబు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తున్న హనుమాయమ్మకు ఇద్దరు పిల్లలు, భర్త ఉన్నారన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.1 కోటి ఆర్థిక సాయం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయాలి
"ఇదే సమయంలో హనుమాయమ్మ హత్యకు దారి తీసిన పరిస్థితులపైనా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి ప్రభుత్వ చర్యలను తప్పు పడుతూ శాంతియుత నిరసనలకు దిగిన సందర్భంలో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఈ నిరసనల్లో హనుమాయమ్మ భర్త సుధాకర్ కూడా పాల్గొన్న సమయంలోనే ఈ హత్య జరిగింది. ఎమ్మెల్యే ప్రజాస్వామ్య పద్ధతిలో చేస్తున్న నిరసనలను అణిచివేసేందుకు దృష్టిపెట్టిన పోలీసులు....కిరాతక హత్యను మాత్రం పట్టించుకోలేదు. వైసీపీ నేతలకు స్వేచ్ఛను ఇవ్వడం వల్లే ఇలాంది దారుణ హత్యలు జరుగుతున్నాయి. పట్టపగలు, అత్యంత దారుణంగా జరిగిన హనుమాయమ్మ హత్యలో పోలీసు అధికారుల పాత్రపై విచారణ జరపాలి. ఈ ఘటనలో పోలీసుల పాత్రపై సమగ్రమైన విచారణ జరగాలన్నా, నిందితులైన వైసీపీ వారికి శిక్షలు పడాలన్నా కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలి." - చంద్రబాబు