తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Road Accident In Bapatla: ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం.. మృతుల్లో ఎస్ఐ భార్య, కుమార్తె

Road Accident in Bapatla: ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం.. మృతుల్లో ఎస్ఐ భార్య, కుమార్తె

HT Telugu Desk HT Telugu

19 February 2023, 8:05 IST

    • bapatla district crime news: బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందగా… ఇందులో అద్దంకి ఎస్‌ఐ భార్య, కుమార్తె కూడా ఉన్నారు.
బాపట్ల జిల్లాలో ఘోర  రోడ్డు ప్రమాదం
బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Road accident at Medarametla:మహాశివరాత్రి పండగ వేళ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బాపట్ల జిల్లా పరిధిలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మేదరమెట్ల వద్ద ఉన్న జాతీయ రహదారిపై శనివారం రాత్రి ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ఓ లారీ బలంగా ఢీకొట్టడంతో.. కారులోని ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇందులో అద్దంకి ఎస్సై సమందర్ వలి భార్యతో పాటు కుమార్తె కూడా ఉన్నారు.

తిరుగు ప్రయాణంలో....

చిన్నగంజాంలో తిరుణాలకు డ్యూటీకి వెళ్లారు ఎస్సై సమందర్ వలి. ఇదే సమయంలో ఆయన సతీమణి షేక్ వాహిదా వలి (38), కూతురు అయేషా హుమేరా వలి (9)ని కూడా తీసుకెళ్లారు. వీరేకాకుండా... పక్కింటికి మరో ఇద్దరిని కూడా తీసుకెళ్లారు. మహాశివరాత్రి వేళ శివాలయంలో దర్శనం ముగించుకున్న తర్వాత డ్రైవర్‌ని ఇచ్చి కుటుంబ సభ్యులను అద్దంకి ఇంటికి పంపించారు. ఈ క్రమంలో మేదరమెట్ల జాతీయ రహదారిపై రాగానే డ్రైవర్ కునుకు తీయడంతో ఒకసారిగా కారు డివైడర్‌ను ఢీకొట్టింది. కారు పల్టీ కొట్టి అవతలి రోడ్డుపై పడిపోవడంతో అటుగా వచ్చిన లారీ కారుని బలంగా ఢీకొంది. దీంతో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఎస్ఐ భార్య, కుమార్తెతో పాటు గుర్రాల జయశ్రీ (50) గుర్రాల దివ్య తేజ(27), డ్రైవర్ బ్రహ్మచారి(22) అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.

ప్రమాదానికి గల కారణం అతివేగం అని తెలుస్తోంది. కంట్రోల్ తప్పటంతో డివైడర్ ను ఢీకొట్టడంతోనే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. పండగ వేళ జరిగిన ఈ రోడ్డు ప్రమాదం స్థానికంగా అందర్నీ కలచివేసింది. తన భార్యతో పాటు తన కుమార్తె రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో అద్దంకి ఎస్ఐ సమందర్ వలి కన్నీరుమున్నీరు అవుతున్నారు.మృతదేహాలను అద్దంకి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఏలూరు జిల్లాలోనూ రోడ్డు ప్రమాదం జరిగింది. భీమడోలు మండలం పూళ్ల వద్ద శనివారం జరిగిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఆర్టీసీ బస్సు.. రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.