Nara Lokesh Yuvagalam: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో నారా లోకేష్ యువగళం పాదయాత్ర
31 May 2023, 12:22 IST
- Nara Lokesh Yuvagalam: నాలుగు రోజుల బ్రేక్ తర్వాత మొదలైన నారా లోకేష్ యువగళం పాదయాత్ర వైఎస్సార్ జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. 111వ రోజు జమ్మలమడుగు శివార్లలోని బైపాస్ రోడ్డు ప్రారంభమైన పాదయాత్రలో అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జమ్మలమడుగులో నారా లోకేష్
Nara Lokesh Yuvagalam: యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా జమ్మలమడుగు జనసంద్రంగా మారింది. 111వరోజు యువగళం పాదయాత్ర జమ్మలమడుగు శివారు బైపాస్ రోడ్డు నుంచి సాయంత్రం ప్రారంభమైంది. పెద్ద సంఖ్యలో జనం లోకేష్ ను చూసేందుకు రోడ్లపైకి రావడంతో ప్రధాన రహదారి కిక్కిరిసిపోయింది.
రోడ్లన్నీ జనంతో నిండిపోవడంతో భవనాలపైకి ఎక్కడి యువనేతకు అభివాదం తెలిపారు. లోకేష్ ని చూసేందుకు మహిళలు, వృద్దులు, రైతులు భారీగా రోడ్లపైకి తరలివచ్చారు. లోకేష్ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకున్నారు. తనని కలవడానికి వచ్చిన ప్రజలతో యువనేత ఓపిగ్గా ఫోటోలు దిగడంపై స్థానికులు ఆనందం వ్యక్తంచేశారు.
జమ్మలమడుగు సెంటర్ లో నిర్వహించిన బహిరంగసభకు పెద్దఎత్తున జనం హాజరుకావడంతో నాయకుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. లోకేష్ ప్రసంగిస్తున్నంతసేపు యువకులు కేరింతలతో సభాప్రాంగణం హోరెత్తింది. బహిరంగసభ అనంతర జమ్మలమడుగులో నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా విద్యుత్ నిలిచిపోవడంతో చీకట్లోనే నారా లోకేష్ పాదయాత్ర కొనసాగించారు.
జమ్మలమడుగు శివారు నుంచి ప్రారంభమైన పాదయాత్ర పెదపసుపుల మోటు, సంజాముల మోటు, జమ్మలమడుగు పాతబస్టాండు, కన్నెలూరు క్రాస్, శేషారెడ్డిపల్లి మీదుగా దేవగుడి చేరుకుంది. దారిపొడవునా వివిధ వర్గాల ప్రజలు యువనేతను కలిసి సమస్యలను విన్నవించారు. కన్నెలూరు స్థానికులు వినతిపత్రం సమర్పిస్తూ తమ గ్రామంలో హైస్కూలు కావాలి, టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అందజేయాలని, డ్రైనేజి బాగు చేయాలని కోరారు.
రాబోయే టీడీపీ ప్రభుత్వం అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని భరోసా ఇస్తూ లోకేష్ ముందుకు సాగారు. 111వరోజున యువనేత లోకేష్ 12.1 కి.మీ. దూరం నడిచారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1435.1 కి.మీ. మేర కొనసాగింది. బుధవారం సాయంత్రం యువగళం పాదయాత్ర ప్రొద్దటూరు అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది.
జగన్ మోసగాడు...చంద్రన్న మొనగాడు.
అధికారంలోకి వచ్చాక హామీలన్నీ అమలుచేసి తీరుతామని, కష్టాలు తెలుసుకున్న తరువాత చంద్రన్న మహాశక్తి పథకం కింద పేరుతో సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించారని చెప్పారు. మహాశక్తి పథకం కింద... ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4). ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తామని చెప్పారు. జగన్ ఆర్టీసీ టికెట్ ధర పెంచితే మీ చంద్రన్న టికెట్ లేకుండా చెయ్యాలని అనుకుంటున్నారని వివరించారు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో అమలు చేసిని అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని, టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మైనార్టీల సంక్షేమం కోసం ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాంమన్నారు. రెడ్డి సోదరులు కూడా ఆలోచించాలని కోట్లు ఖర్చు చేసి జగన్ ని గెలిపించుకున్నా ఇప్పుడు వైసిపి లో కనీస గౌరవం దక్కుతుందా అని ప్రశ్నించారు. ఒక్క టిడిపి లోనే అందరికి గౌరవం దక్కుతుందని చెప్పారు.