Kadapa Crime : అప్పు తీర్చని స్నేహితుడు, పూచీకత్తు ఉన్న వ్యక్తి దారుణ హత్య!
04 June 2023, 12:35 IST
- Kadapa Crime : పూచీకత్తు ప్రాణాలు తీసింది. స్నేహితుడు అప్పు తిరిగి చెల్లించకపోవడంతో... అప్పు ఇచ్చిన వాళ్లు పూచీకత్తు ఉన్న వ్యక్తిపై దాడి చేశారు. ఈ దాడిలో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
పూచీకత్తు ఉన్న వ్యక్తి దారుణ హత్య
Kadapa Crime : స్నేహితుడు చేసిన అప్పునకు పూచీకత్తు ఉన్నందుకు ఓ వ్యక్తి ప్రాణం కోల్పోయాడు. వైఎస్ఆర్ జిల్లా చింతకొమ్మదిన్నెలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. జూన్ 1వ తేదీన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. స్నేహితుడే కదా అని నమ్మి రూ.15 లక్షలకు పూచీకత్తు ఉన్నాడు శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి. అయితే స్నేహితుడు ఆ అప్పు తిరిగి చెల్లించకపోవడంతో అప్పు ఇచ్చిన వాళ్లు శ్రీకాంత్ రెడ్డిని అడిగారు. ఈ క్రమంలో వారి మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణలో శ్రీకాంత్ రెడ్డిపై అప్పు ఇచ్చిన వాళ్లు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. నిందితుడులు శ్రీకాంత్ రెడ్డి మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. ఈ హత్య కేసులో పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేయగా.. వారిలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.
ఆర్థిక తగాదాలతో అత్తమామలపై అల్లుడు దాడి
తూర్పుగోదావరి జిల్లా పసివేదల గ్రామంలో దారుణం జరిగింది. ఆర్థిక వ్యవహారాలతో అత్తమామలతో గొడవ దిగిన అల్లుడు ఆగ్రహంతో వారిపై దాడికి పాల్పడ్డాడు. ఐదు కేజీల గ్యాస్ బండతో అత్తమామలను కొట్టడంతో మామ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. తీవ్రగాయాల పాలైన అత్తను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అత్తామామలు బేబీ(61), రాయoకుల రామకృష్ణ (62)లు అల్లుడు నందిగం గోపి(42)కి మధ్య ఆర్థిక తగాదాలు ఉన్నాయి. ఈ వివాదమే దాడికి కారణమని పోలీసులు వెల్లడించారు. ఆవేశంతో గోపి వారిపై గ్యాస్ బండతో దాడికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.