Pawan kalyan: ప్రశ్నిస్తే అట్రాసిటీ కేసులు పెడుతారా..?
06 August 2022, 20:12 IST
- pawan kalyan fires on ysrcp govt:వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. అట్రాసిటీ చట్టాన్ని అడ్డగోలుగా వాడేస్తోందని ఆరోపించారు.
పవన్ కల్యాణ్ (ఫైల్ ఫొటో)
pawan kalyan slams ysrcp govt:ఎస్సీ. ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా వాడేస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై ఈ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. గడప గడపకు కార్యక్రమంలో ఫీజు రియంబర్స్ మెంట్ పై ప్రశ్నిస్తే తప్పా అని నిలదీశారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన జశ్వంత్ అనే యువకుడు ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవటంపై స్థానిక ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే.. అతనితో పాటు మరో తొమ్మిది మంది జన సైనికులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద పోలీసులు కేసులు నమోదు చేశారన్నారని అన్నారు. ఇలా సమస్యలపై ప్రశ్నించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద నాన్ బెయిలబుల్ కేసులు ఎలా పెడతారని పవన్ ప్రశ్నించారు.
నియోజకవర్గంలో పని చేయకపోతే ప్రజలు నిలదీస్తారని పవన్ అన్నారు. ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండా రిమాండ్కు తీసుకెళ్లిన పోలీసులపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారన్నారని తెలిపారు. న్యాయమూర్తి రిమాండు రిపోర్టును రిజెక్టు చేసినా.. ఆ యువకుల్ని ఈ కేసులో ఏదో రకంగా ఇరికించాలని నాయకులు, పోలీసులు ప్రయత్నించారని పవన్ ఆక్షేపించారు. ప్రశ్నించినంత మాత్రానా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి వేధిస్తాం అంటే ఎలా ? అని నిలదీశారు. నిజంగా ఆ యువకులు పరిధి దాటి ప్రవర్తిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కానీ అక్రమ కేసులు పెట్టి వేధిస్తారా ? అని మండిపడ్డారు. ఇలా అకారణంగా ప్రశ్నించిన వారిని వేధించటం అంబేడ్కర్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఈ విషయాన్ని మానవహక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని పవన్ స్పష్టం చేశారు. అట్రాసిటీని ఇలా ఇష్టానుసారంగా వాడటంపై పార్టీలో లోతుగా చర్చిస్తామని చెప్పారు. పోలీసులకు వేధింపులకు గురువతున్న తొమ్మిది మంది యువకులకు చిత్తూరు జిల్లా జనసేన నాయకులు అండగా ఉండాలని కోరారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.