Indrakeeladri Day 08 Durgastami : శ్రీ దుర్గాదేవిగా కనకదుర్గమ్మ
03 October 2022, 5:55 IST
- Indrakeeladri Day 08 Durgastami దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆశ్వయుజ శుద్ధ అష్టమి రోజు శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. “ సర్వ స్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయోభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే” అంటూ భక్తులు దుర్గాదేవి శరణ వేడుకుంటారు.
దుర్గాదేవి అలంకారంలో కనకదుర్గమ్మ
Indrakeeladri Day 08 Durgastami ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు కొండకు పోటెత్తుతున్నారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదో రోజు అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శరన్నవరాత్రుల్లో అష్టమి తిథి నాడు కనకదుర్గమ్మ దుర్గాదేవిగా భక్తులకు కనువిందు చేస్తున్నారు.
Durgstami లోక కంఠకుడైన దుర్గమాసుడనే రాక్షసుడిని సంహరించి దుర్గతులను పోగొట్టి దుర్గగా వెలుగొందినట్లు చెబుతారు. లోకకంటకుడైన దుర్గమాసురుడిని వధించి దుర్గాదేవిగా కీలాద్రిపై స్వయంగా అమ్మవారు అవతరించినట్లు చెబుతారు. “దుర్గే దుర్గతినాశిని” అనే వాక్యం భక్తులకు శుభాలను కలుగ చేస్తుందని శరన్నవరాత్రుల్లో దుర్గాదేవిని అర్చించడం వల్ల దుర్గతులను పోగొట్టి సద్గతులను ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. దివ్య స్వరూపిణి అయిన కనకదుర్గమ్మ దర్శనం సకల శ్రేయోదాయకయమని చెబుతారు.
దుర్గాష్టమి రోజు ఇంద్రకీలాద్రిపై వేదవిద్వత్ సభ నిర్వహిస్తారు. ఇంద్రకీలాద్రి మల్లికార్జున మహామండపం 6వ అంతస్తులో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఏపీ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వేదపండితులను సత్కరిస్తారు.
దసరా మహోత్సవాల సందర్భంగా ఆంద్రపదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. దేవస్థాన పండితులు డి.జి.పి.గారికి మర్యాదపూర్వకంగా ఆహ్వానం పలికి అమ్మవారి దర్శనం చేయించడం జరిగింది. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణలతో ఆశీర్వచనం చేయించి, అమ్మవారి లడ్డు ప్రసాదం డి.జి.పి.గారికి అందించారు.
దసరా మహోత్సవాలలో కీలకమైన మూలా నక్షత్రం, ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు సమర్పించడానికి వస్తున్న సందర్భంగా సుమారు రెండు లక్షల మంది వరకు భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారన్న అంచనాతో కనకదుర్గ అమ్మవారి టెంపుల్ పరిసర ప్రాంతాలలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ప్రశాంత వాతావరణం లో అమ్మవారి దర్శనం చేసుకోవడానికి పక్కా ప్రణాళికతో ప్రత్యేక పోలీస్ అధికారులు, సిబ్బంది బందోబస్త్ ఏర్పాటు చేశారు.
అక్టోబర్ 1 రాత్రి నుంచి నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా కనకదుర్గ అమ్మవారి టెంపుల్ పరిసర ప్రాంతాలయిన సీతమ్మవారి పాదాలు మరియు వినాయక టెంపుల్, టోల్ గేటు, అంతరాలయం, క్యూ లైన్, కనకదుర్గా నగర్ ఏరియాలో స్వయంగా పర్యవేక్షిస్తూ, డ్రోన్ ద్వారా భక్తుల రద్దీని అంచనా వేస్తూ, కమాండ్ కంట్రోల్ నందు ఏర్పాటు చేసిన సి.సి.కెమెరాలను పర్యవేక్షిస్తూ, భక్తులతో క్యూ లైన్ లు నిండిన సమయంలో కొద్ది కొద్దిగా వారిని క్యూ లైన్ లో భక్తులు తగ్గుతున్న సమయంలో వదిలే విధంగా ఏర్పాట్లు చేశారు.
భక్తులు ఎక్కువ మంది వచ్చినా ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా వుండే విధంగా ఒక పక్క ప్రణాళికతో నగర పోలీసులు వ్యవహరించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఎక్కడా తొక్కిసలాట జరుగకుండా ఉండేందుకు కంపార్ట్ మెంట్ లలో భక్తులను వుంచి అనతరం క్యూ లైన్ లో కలిపే విధంగా ఏర్పాట్లు చేశారు.