High Court On Rushikonda : రాష్ట్ర అధికారులొద్దు.. రుషికొండ తవ్వకాలపై హైకోర్టు
22 December 2022, 14:32 IST
- Rushikonda : రుషికొండ తవ్వకాల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ అధికారులతో కమిటీ నియమించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీశాఖను న్యాయస్థానం ఆదేశించింది.
ఏపీ హైకోర్టు
రుషికొండ(Rushikonda) తవ్వకాల మీద దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు(AP High Court) విచారణ జరిపింది. రుషికొండ తవ్వకాల వ్యవహారం మీద కేంద్ర ప్రభుత్వ అధికారులతోనే కమిటీని నియమించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే ఏర్పాటైన కమిటీలో రాష్ట్ర అధికారులను తక్షణమే తొలగించాలని స్పష్టం చేసింది. రుషికొండపై జరుగుతున్న తవ్వకాలు, నిర్మాణాలను కమిటీ పరిశీలించాని హైకోర్టు పేర్కొంది. కొత్త కమిటీలో నియమించిన సభ్యుల వివరాలను బెంచ్ ముందుంచాలని సూచించింది.
బుధవారం విచారణలోనూ రుషికొండ(Rushikonda)లో తవ్వకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పనులను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన కమిటీపై అసహనం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో కమిటీపై ఉన్న అభ్యంతరాలను అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని పిటిషనర్లను న్యాయస్థానం ఆదేశించింది.
గతంలో విచారించిన హైకోర్టు.. రుషికొండలో జరుగుతున్న తవ్వకాలు, పనులపై కమిటీని నియమించాలని కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్ర పర్యావరణ శాఖ అధికారులతో కమిటీ నియమించాలని స్పష్టం చేయగా... కేంద్రం మాత్రం రాష్ట్ర అధికారులతోనే కమిటీ నియమించింది. దీనిపై పిటిషనర్ తరపు లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై విచారించిన కోర్టు... పిటిషనర్ల అభ్యంతరాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. అక్రమ తవ్వకాలపై నిగ్గు తేల్చేందుకు వేసిన కమిటీలో ముగ్గురు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను నియమించడం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉన్నాయని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు.
కమిటీ సభ్యుల నియామకాన్ని సమర్థిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం(Central Govt) ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది. దీనిపై అసహనం వ్యక్తం చేసిన ఉన్నత న్యాయస్థానం.. విచారణ జరిపి తామే ఓ కమిటీని నియమిస్తామని వ్యాఖ్యానించింది. కేంద్రం తీరు చూస్తుంటే.. రాష్ట్రంలో చేతులు కలిపినట్లు ఉందంటూ సీరియస్ అయింది. గురువారం విచారణ చేసిన హైకోర్టు.. రాష్ట్ర అధికారులు వద్దు.. కేంద్ర అధికారులతో కమిటీ వేయాలని ఆదేశాలు ఇచ్చింది.