తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Energy Minister Peddireddy Slams Opposition Partys On Smart Electric Meters For Agriculture Connections

Peddireddy in Assembly: స్మార్ట్ మీటర్లపై విపక్షాలది దుష్ప్రచారమన్న పెద్దిరెడ్డి

HT Telugu Desk HT Telugu

20 March 2023, 4:35 IST

    • Peddireddy in Assembly: స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, వ్యవసాయ కనెక్షన్లకు వినియోగించే విద్యుత్ బిల్లుల్ని ప్రత్యక్ష నగదు బదిలీతో చెల్లించవచ్చని మంత్రి అసెంబ్లీలో ప్రకటించారు.స్మార్ట్ మీటర్ల వినియోగంపై టీడీపీ,వామపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పెద్దిరెడ్డి ఆరోపించారు.
ఏపీ విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ఏపీ విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ఏపీ విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Peddireddy in Assembly: వ్యవసాయ విద్యుత్‌కు పగటిపూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తామని, వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల ద్వారా రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. వ్యవసాయ కనెక్షన్ లకు వినియోగించే విద్యుత్ బిల్లులు డిబిటి ద్వారా చెల్లిస్తారని వివరణ ఇచ్చారు. స్మార్ట్ మీటర్లపై తెలుగుదేశం, కమ్మూనిస్ట్ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు

AP Model School Marks: ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష మార్కులు విడుదల… ఆన్‌లైన్‌‌లో చెక్ చేసుకోండి ఇలా..

AP Summer Upadtes: ఆత్మకూరులో అదరగొట్టిన ఎండలు.. 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు, నేడు 61 మండలాలకు వార్నింగ్

Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్, మే నెలలో విశేష ఉత్సవాలు

Konaseema Accident: కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు దుర్మరణం, ఆటోను ఢీకొన్న లారీ

వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లను పెట్టడం ద్వారా వాస్తవ విద్యుత్ వినియోగం తెలుస్తుందన్నారు.శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ వల్ల 33 శాతం తక్కువ వినియోగం ఉన్నట్లు తేలిందని చెప్పారు. కేంద్రప్రభుత్వం, కేంద్ర విద్యుత్ నియంత్రణ సంస్థల మార్గదర్శకాల ప్రకారమే స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

స్మార్ట్ మీటర్ల టెండర్లు ఫైనాన్సియల్ బిడ్ ప్రాసెస్ లో ఉన్నాయని, ఉచిత విద్యుత్ ఇస్తే తీగెలపై దుస్తులు ఆరేసుకోవాలని ఆనాడు చంద్రబాబు ఎద్దేవా చేశాడని పెద్దిరెడ్డి గుర్తు చేశారు. వ్యవసాయం దండుగ అని చంద్రబాబు అనలేదా అని అసెంబ్లీలో ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో ఎందరు రైతులు కరెంట్ షాక్, పాముకాటుతో చనిపోయారో లెక్కలు చెప్పాలన్నారు.

18.58లక్షల స్మార్ట్ మీటర్ల ఏర్పాటు…

ఏపీలో వ్యవసాయ పంపు సెట్లకు 18.57 లక్షల స్మార్ట్ మీటర్లు అమర్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. స్మార్ట్ మీటర్లు కొనుగోలు, ఇన్స్టలేషన్, నిర్వహణ కోసం మొత్తం రూ. 3,406.14 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామన్నారు. మీటర్లు, ట్రాన్స్ ఫార్మర్లు, రక్షణ అనుబంధ పరికరాల కోసం 2286.22 కోట్లు అవసరం అవుతుందని అంచనా వేశామని,మొత్తం రూ.5692.36 కోట్లు ఆయా సంవత్సరాల బడ్జెట్ లలో కేటాయించడం ద్వారా దీనిని ప్రభుత్వం భరిస్తోందని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతోనే….

కేంద్రప్రభుత్వం ఎఫ్‌ఆర్బిఎం లిమిట్ పెంచడానికి పెట్టిన కండీషన్ కోసం రైతులకు ఇచ్చే విద్యుత్ కు మీటర్లు పెట్టామని తెలుగుదేశం సభ్యులు ఆరోపించడం భావ్యం కాదని పెద్ది రెడ్డి చెప్పారు. రైతులందరికి మేలు చేసేలా వినియోగించిన విద్యుత్ బిల్లులను డిబిటి ద్వారా డబ్బులు వారి ఖాతాలకు జమచేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.స్మార్ట్ మీటర్లు భిగించడం ద్వారా ఏ రైతు ఎంతమేర విద్యుత్ ను వినియోగిస్తున్నాడనే లెక్కలు తేల్చడం కోసమే పైలెట్ ప్రాజెక్ట్ గా శ్రీకాకుళం జిల్లాలో దీనిని ప్రారంభించామని చెప్పారు. శ్రీకాకుళంలో డిఆర్బిఎ మీటర్లు పెట్టాంమని శ్రీకాకుళం జిల్లాలో 18వేల ఉచిత వ్యవసాయ కనెక్షన్లు ఉండటం వల్ల అందుబాటులో ఉన్న ఐఆర్డిఎ మీటర్లు, అనుబంధ సామగ్రితో ఈ జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ గా అమలు చేశామన్నారు.

శ్రీకాకుళం జిల్లాల్లో 2021 ఆర్థిక సంవత్సరంలో ఉచిత విద్యుత్ కోసం వినియోగించిన విద్యుత్ 101.5 మిలియన్ యూనిట్లు ఉంటే మీటర్లు ఏర్పాటు వల్ల 67.76 మిలియన్ యూనిట్ల వినియోగం జరిగినట్లు తేలింది. అంటే ఏడాదికి 33.75 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ వినియోగం తక్కువగా ఉన్నట్లు గుర్తించామని మంత్రి తెలిపారు. పైలెట్ ప్రాజెక్ట్ తర్వాత శ్రీకాకుళం జిల్లాలో 2022 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ వినియోగదారుల సంఖ్య పెరిగిప్పటికీ విద్యుత్ వినియోగం మాత్రం 33% తగ్గిందన్నారు.

తగ్గిన స్మార్ట్‌ మీటర్ల ధర…

ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా ఉచిత వ్యవసాయ కనెక్షన్ లకు స్మార్ట్ మీటర్లు పెట్టలేదని, డొమెస్టిక్ మాటర్లు మాత్రమే పెట్టారని, ప్రతిచోటా మనకంటే రెట్టింపు ఉన్నాయన్నారు. స్మార్ట్ మీటర్ల కోసం 2021లో 6480.12 కోట్ల అంచనాలతో టెండర్లు పిలిచామని మంత్రి చెప్పారు. అప్పటి రేట్ల ప్రకారం అధిక వ్యయం అవుతుండటంతో టెండర్లను రద్దు చేశామన్నారు. కరోనా తరువాత రేట్లు కొంత మేర తగ్గడంతో తిరిగి 2022లో అప్పటి రేట్ల ప్రకారం రూ.5692.35 కోట్లతో సవరించిన అంచనాలతో టెండర్లు పిలిచామని, టెండర్ ఫైనాన్షియల్ బిడ్ ప్రాసెస్ లో ఉందని, దీనిని ఎవరికో ఇచ్చేశామని, మాకు కావాల్సిన వారికి కట్టబెట్టామనే విధంగా మాట్లాడటం కూడా సరికాదన్నారు.

తెలుగుదేశం సభ్యులు ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ విజయానంద్ ప్రభుత్వంకు రాసిన లేఖలో స్మార్ట్ మీటర్లు అవసరం లేదని పేర్కొన్నారని సభలో ఆరోపించడారు. దీనిని పెద్దిరెడ్డి ఖండించారు. మీటర్ల ఏర్పాటుపై అన్ని రకాల మీటర్లను పరిశీలించి చర్యలు తీసుకోవాలని మాత్రమే లేఖలో రాశారని దీనిని వక్రీకరించి మాట్లాడటం దురదృష్టకరమన్నారు.

టీడీపీ హయంలో ఏం చేశారో చెప్పాలన్న పెద్దిరెడ్డి

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ పై ఎం మాట్లాడారో అందరికీ తెలుసని, ఉచిత విద్యుత్ ఇచ్చే తీగెలపై దుస్తులు ఆరేసుకోవాలని ఆయన మాట్లాడలేదా అని నిలదీశారు. వ్యవసాయం దండగ అని అనలేదా అని, ప్రభుత్వం రైతులకు పగటిపూటే తొమ్మిది గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను వ్యవసాయం కోసం ఉచితంగా అందిస్తోందని చెప్పారు. తెలుగుదేశం హయాంలో అర్థరాత్రి ఇచ్చే ఉచిత విద్యుత్ వల్ల ఎంత మంది రైతులు చీకట్లో పాము కాటుకు గురయ్యారు, ఎంత మంది విద్యుత్ షాక్ తో మృతి చెందారో తెలుగుదేశం సభ్యులు లెక్కలు చెప్పాలన్నారు.

వ్యవసాయ కనెక్షన్ లకు స్మార్ట్ మీటర్లు భిగించాలనే నిర్ణయం కోసం వాస్తవంగా ఉచిత వ్యవసాయ కనెక్షన్ల ద్వారా ఎంత వినియోగం అవుతుందో తెలుసుకునేందుకే. రైతులకు మరింత నాణ్యమైన విద్యుత్ ను అందించేందుకే ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అది కూడా కేంద్రప్రభుత్వం, సెంట్రల్ రెగ్యులేటరీ అథారిటీ మార్గదర్శకాల ప్రకారమే స్మార్ట్ మీటర్లను అమరుస్తున్నామని చెప్పారు. తెలుగుదేశం, కమ్యూనిస్ట్ లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా రైతులు డిబిటి కోసం స్వచ్ఛందంగా బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారని, ఇప్పటి వరకు కేవలం 10,025 మంది రైతులు మినహా మిగిలిన రైతులంతా ఖాతాలను తెరిచారని పెద్ది రెడ్డి చెప్పారరు.