Delhi Liquor Scam : తెలుగు రాష్ట్రాల నుంచి స్పెషల్ ఫ్లైట్లలో ఎవరు ప్రయాణించారు?
17 November 2022, 16:59 IST
- Delhi Liquor Scam Update : దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడుగా వెళ్తొంది. అన్ని వైపుల నుంచి విచారణ చేస్తోంది. ఏ ఒక్క క్లూ వదలట్లేదు. తాజాగా ప్రత్యేక విమానాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన వారిపై ఆరా తీస్తోంది.
లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు
దిల్లీ లిక్కర్ కేసు(Delhi Liquor)లో ఈడీ వేగవంతంగా విచారణ చేస్తోంది. మద్యం పాలసీ రూపకల్పన సమయంలో ఎవరెవరు దిల్లీ(Delhi), తెలుగు రాష్ట్రాల(Telugu States) మధ్య ప్రత్యేక విమానాల్లో ప్రయాణించారనే దానిపై ఆరా తీస్తున్నారు. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఈడీ అధికారులు.. వివరాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. రాజకీయ నేతలు, వ్యాపార వేత్తలకు సంబంధించిన డేటాను చూస్తున్నట్టుగా సమాచారం.
అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్చంద్రారెడ్డి భార్య కనికా టేక్రివల్ సంస్థ జెట్ సెట్ గో నిర్వహణ, కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను ఈడీ సంపాదించింది. దీంతోపాటుగా ఆ సంస్థ ఏర్పాటు చేసిన చార్టర్డ్ విమానా(Flights)ల్లో ప్రయాణించిన వారి వివరాలను ఈడీ సేకరించినట్టుగా సమాచారం. దిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి.. ప్రముఖుల పేర్లు, నగదు లావాదేవీల వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
ఇప్పటికే జెట్ సెట్ గో(jet set go) ప్రైవేట్ విమానంలో ఎవరెవరు ప్రయాణించేరనే సమాచారాన్ని ఈడీ తీసుకుంది. ఎయిర్ పోర్టు(Air Ports)ల్లో సీసీ టీవీ నుంచి ఆధారాలను కూడా సేకరించినట్టుగా తెలుస్తోంది. విమాన ప్రయాణాలు, సౌత్ గ్రూప్ నగదు లావాదేవీలకు సంబంధించిన వివరాలపై శరత్ చంద్రారెడ్డి, బినయ్ బాబు, అభిషేక్, విజయ నాయర్ ను ఈడీ ప్రశ్నిస్తోంది.
మరోవైపు శరత్ చంద్రారెడ్డి, బినయ్ బాబు ఈడీ కస్టడీ ముగియనుంది. దీంతో కస్టడీ మరోసారి పొడిగించాలని ఈడీ కోరే అవకాశం ఉంది. లిక్కర్ స్కాంలో దర్యాప్తు పురోగతిని కోర్టుకు ఈడీ తెలపనుంది. జెట్ సెట్ గో విమానంలో లిక్కర్ కుంభకోణానికి(Liquor Scam) సంబంధించిన డబ్బును హైదరాబాద్(Hyderabad) తరలించారని వార్తలు వస్తున్నాయి.
లిక్కక్ కుంభకోణంలో కోట్ల నగదును పెనక శరత్ చంద్రారెడ్డి భార్య కనికా ఏర్పాటు చేసిన విమానాల్లోనే తరలించారని ఈడీ అధికారులు(ED Officials) అనుమానిస్తున్నట్టుగా తెలుస్తోంది. కనికా సీఈవోగా నిర్వహిస్తున్న జెట్ సెట్ గో సంస్థ ఏర్పాటైనప్పటి నుంచి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రత్యేక విమానాల్లో(Special Flights) ప్రయాణించిన వారి వివరాలను ఈడీ రాబడుతోంది. దీనిపై ఎయిర్ పోర్ట్స్ అథారిటీకి కూడా ఈడీ లేఖ రాసిన విషయం తెలిసిందే. పీఎంఎల్ఏ చట్టం ప్రకారం జరుగుతున్న విచారణలో ఈ వివరాలు అడుగుతున్నట్టుగా ఈడీ డిప్యూటీ డైరెక్టర్ లేఖలో తెలిపారు.