Protests Against PM : ప్రధాని పర్యటనపై రాష్ట్ర వ్యాప్త నిరసనలు
09 November 2022, 13:35 IST
- Protests Against PM ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని కమ్యూనిస్టు పార్టీలు నిర్ణయించాయి. ఈ నెల 11,12 తేదీల్లో ఏపీలో ప్రధాని పర్యటించనున్న నేపథ్యంలో, మోదీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాలని వామపక్షలు నిర్ణయించాయి.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
Protests Against PM రాష్ట్రానికి అన్యాయం చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాలని వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. మోదీ ఏపీ పర్యటన సందర్భంగా భవిష్యత్తు కార్యాచరణ పై చర్చించినట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ప్రధాని మోడీ ఈనెల 11,12 తేదీలలో పర్యటన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రకటించారు.
ప్రధాని మోదీ ఏపీని అన్నివిధాలుగా మోసం చేసి, సిగ్గు లేకుండా రాష్ట్రానికి వస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్కు మోడీ ప్రభుత్వం ఒక్క అంశంలో అయినా న్యాయం చేసిందా అని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి కూడా అధికార యంత్రాంగాన్ని మోడీ పర్యటన కు వినియోగిస్తున్నారని విమర్శించారు. కోట్ల రుపాయల ఖర్చుతో ప్లీనరీ సమావేశం తరహాలో ప్రచారం చేస్తున్నారని, రాష్ట్రానికి హోదా లేదు, పోలవరం పూర్తి కాలేదు, విభజన హామీలు అమలు చేయకపోయినా ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
మోడీ మెడలు వంచుతా అన్న జగన్, మోడీ ముందు తల వంచుతూనే ఉన్నాడని విమర్శించారు. ప్రధాని పర్యటన బిజెపి తమ కార్యక్రమం గా చెప్పుకుంటే, విజయ సాయి రెడ్డి వారికన్నా అత్యుత్సాహంతో ప్రకటన చేస్తున్నారన్నారు. వైసీపీకి మోడీ అంటే భయమా, కేసుల నుంచి బయట పడేందుకు తంటాలు పడుతున్నారా అని ప్రశ్నించారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేయవద్దని మా వాళ్లు పోరాటాలు చేస్తున్నారని, మోడీ స్టీల్ ఫ్లాంట్ ప్రభుత్వం ఆధీనంలో ఉంచుతామని చెప్పాకే ఎపిలో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. రెండు రోజులు తమ నిరసన కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు కూడా నల్ల జెండాలతో నిరసన తెలపాలని సూచించారు.
ప్రజలకు ద్రోహం చేసిన వారికే, ప్రజల సొమ్ముతో పెద్ద పీట వేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు. రాష్ట్రానికి రైల్వే జోన్ ఇవ్వరని, ఏపీకి అన్యాయం చేసిన వారికి సన్మానాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. పోలవరం నిర్వాసితులను ఆదుకోవడం లేదని, లాభాలలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేస్తున్నారని మండిపడ్డారు.
మోడీ నిర్ణయానికి వ్యతిరేకంగా అసెంబ్లీ లో జగన్ తీర్మానం చేశారని, ఇప్పుడు ఏమీ చేయకుండానే సాగిలపడి స్వాగతం పలుకుతారా అని నిలదీశారు. బిజెపి తరహాలో వైసిపికి కూడా ప్రజా వ్యతిరేక తప్పదన్నారు. సభలకు అనుమతి ఇచ్చి, మళ్లీ నోటీసులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రం లో నిరసనకు తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు చేస్తే ప్రతిపక్ష పార్టీలు చూస్తూ కూర్చుంటాయా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మోడీ ని నిలదీయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి మేలు చేసేలా హామీల అమలుకు డిమాండ్ చేయాలన్నారు.