తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Jagan On Cbn: నరకాసురుడిని నమ్మొచ్చు కానీ నారా చంద్రబాబును నమ్మొద్దన్న జగన్

Cm Jagan On CBN: నరకాసురుడిని నమ్మొచ్చు కానీ నారా చంద్రబాబును నమ్మొద్దన్న జగన్

HT Telugu Desk HT Telugu

26 May 2023, 13:11 IST

    • Cm Jagan On CBN: నరకాసురుడినైనా నమ్మొచ్చు కానీ నారా చంద్రబాబును మాత్రం నమ్మకూడదని ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు.పొరపాటున కూడా బాబును నమ్మొద్దని  2014-19మధ్య ఒక్క సెంటు కూడా చంద్రబాబు ఇవ్వలేదని గుర్తు చేశారు.
ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో సిఎం జగన్మోహన్ రెడ్డి
ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో సిఎం జగన్మోహన్ రెడ్డి

ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో సిఎం జగన్మోహన్ రెడ్డి

Cm Jagan On CBN: ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో చంద్రబాబు మరిన్ని ఎత్తులు, మోసాలతో ప్రజల ముందుకు వస్తారని, అబద్దాలను అలవోకగా చెబుతారని సిఎం జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. వెంకటపాలెంలో లబ్దిదారులకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబుపై జగన్ నిప్పులు చెరిగారు. నరకాసురుడినైనా నమ్మొచ్చు కానీ నారా చంద్రబాబును మాత్రం నమ్మకూడదని అన్నారు.ప్రజలు పొరపాటున కూడా బాబును నమ్మొద్దని హెచ్చరించారు. 2014-19మధ్య ఒక్క సెంటు కూడా చంద్రబాబు ఇవ్వలేదని గుర్తు చేశారు.

వేలమందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడం గతంలో ఎప్పుడైనా చూశారా అని ప్రశ్నించారు. ప్రజలు గతానికి ఇప్పటికి తేడా గమనించాలని,50వేల ఇళ్ల స్థలాల పంపిణీతో పాటు 8చోట్ల జగనన్న కాలనీల్లో టిడ్కో ఇళ్లను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. దాంతో పాటు 5024మంది లబ్దిదారులకు టిడ్కో ఫ్లాట్లను కేటాయిస్తున్నట్లు చెప్పారు. వారం రోజుల్లో లబ్దిదారులతో టిడ్కో ఫ్లాట్లలో గృహ ప్రవేశాలు చేయిస్తామన్నారు.

రాష్ట్రంలో టిడ్కో ఇళ్లు కేటాయించిన 5వేల ఇళ్ల విలువ 443కోట్ల ఖరీదు చేస్తాయని సిఎం చెప్పారు.కేంద్రం ఒక్కో ఫ్లాట్‌పై లక్షన్నర సబ్సిడీ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 256కోట్ల రుపాయల కోట్ల ఖర్చు చేసిందని చెప్పారు.

టిడ్కో ఇళ్లపై చంద్రబాబు మోసాలు…

టిడ్కో ఇళ్ల గురించి చంద్రబాబు నోటి వెంట రకరకాల అసత్య ప్రచారం,అబద్దపు మాటలు వస్తున్నాయని జగన్ మండిపడ్డారు. టిడ్కో ఇళ్లు ఇవ్వడానికి నాలుగేళ్లు ఎందుకు పట్టిందని అడుగుతున్నారన్నారు.

టిడ్కో ఇళ్లలో 300చదరపు అడుగుల ఇంటినిర్మాణానికి ఒక్కో అడుగుకు 2వేల రుపాయల ఖర్చు అవుతుందని, ఒక్కొ ఫ్లాట్‌కు 5.25లక్షల ఖర్చు అవుతుందని సిఎం చెప్పారు. మౌలిక సదుపాయాలకు మరో లక్ష ఖర్చు అవుతుందన్నారు. కేంద్ర, రాష్ట్రాల సబ్సిడీ మూడు లక్షలు పోను, లబ్దిదారులపై మరో రూ.3.25 లక్షల రుపాయల అప్పు లబ్దిదారులపై పడేదన్నారు. నెలనెల రూ.3వేల చొప్పున 20ఏళ్లలో రూ.7.20లక్షల రుపాయలను టిడ్కో ఫ్లాట్ కోసం కట్టాల్సి వచ్చేదన్నారు.

టిడ్కో ఇళ్లపై చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని, ప్రజలపై భారం మోపేలా ఇళ్లు ఇవ్వడం అంటే, చంద్రబాబు మాటల్లో దానిని ఇచ్చినట్టో కాదో చెప్పాలన్నారు. తాను ప్రతి ఒక్కరికి వారి పేరుతోనే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నట్లు చెప్పారు. కేవలం రుపాయికే వారి పేరిట టిడ్కో ఇళ్లు కేటాయిస్తున్నామని వివరణ ఇచ్చారు. పథకాలపై వక్రభాష్యాలు చెప్పే చంద్రబాబు ముఠా దీనిపై సమాధానం చెప్పాలన్నారు. టిడ్కో ఇళ్ల పంపినీలో తేడాలు ప్రజలు గమనించాలన్నారు.

ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ప్రభుత్వంలో ఏ ఒక్కరికి సెంటు భూమి కూడా ఇవ్వలేదని, 2014 ఎన్నికల్లో మాటలు చెప్పి, 600పేజీల మ్యానిఫెస్టో రిలీజ్ చేసి అన్ని వర్గాలను మోసం చేశారన్నారు. వాగ్దానాలతో అన్ని వర్గాలను మోసం చేసి, ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం విషయంలో మోసం చేసిన సంగతి గుర్తుంచు కోవాలన్నారు.

ఆర్ధిక ఇబ్బందులున్నా 30లక్షల స్థలాల పంపిణీ…

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో మళ్లీ మ్యానిఫెస్టో అంటాడని ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు అంటూ మోసపూరిత మాటలతో వస్తాడని, చంద్రబాబు చెప్పే మోసాల గురించి జ్ఞాపకం చేసుకోవాలన్నారు. తమ ప్రభుత్వం ఎన్ని కష్టాలు చూసినా, కోవిడ్ కష్టాలు రెండేళ్లు వెంటాడినా ప్రజల కోసం కష్టపడ్డానని చెప్పారు. కోవిడ్ కష్ట సమయంలో కూడా 30లక్షల ఇళ్ల స్థలాలు సేకరించి అప్పగించానని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నెరవేర్చడానికి తాపత్రయపడ్డానని వివరించారు.

ఇళ్ల స్థలాల పంపిణీతో పాటు ఇళ్ల నిర్మాణాన్ని దశల వారీగా పరుగులు తీయిస్తున్నట్లు చెప్పారు. అవినీతికి తావు లేకుండా రెండు లక్షల కోట్ల రుపాయల నగదును నేరుగా బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసినట్లు వివరించారు. డిబిటి,నాన్ డిబిటి ద్వారా లక్షల కోట్ల రుపాయల మేలు జరిగితే తట్టుకోలేని దుష్టచతుష్టయం దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

ఐదేళ్ల చంద్రబాబు పాలనలో దోచుకోవడం, పంచుకోవడం మాత్రమే జరిగాయని, అప్పుడు ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్ అని అయినా ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. ఇన్ని లక్షల కోట్లు లంచాలు, వివక్ష లేకుండా నేరుగా ప్రజల ఖాతాల్లోకి ఎలా వెళ్లగలిగాయన్నారు.మంచి చేయాలనే తాపత్రయం లేకపోవడమే అసలు కారణమన్నారు.

అధికారంలోకి రావడం అంటే దోచుకోవడానికి మాత్రమే అని వారి ఉద్దేశం అన్నారు. ప్రశ్నిస్తామన్న వారు ఎవరు ప్రశ్నించరని, అదే చంద్రబాబు హయంలో జరిగిన మాయ అని ఆరోపించారు. రాష్ట్రంలో ఓ వైపు పేదలు ఓ వైపు మరోవైపు పెత్తందారులు మరో వైపు నిలిచారని, రెండు వర్గాల మధ్య పోరాటం జరుగుతోందన్నారు.

పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే కోర్టుల వరకు వెళ్లి అడ్డుకుంటున్నారని, సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని చెప్పడం ఎంత అన్యాయమని ప్రశ్నించారు. సుప్రీం కోర్టులో ఓడిపోయిన తర్వాత కూడా ఇళ్ల స‌్థలాలు ఇస్తామంటే రకరకాల పద్ధతుల్లో అడ్డుకోవడం చూస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు.