CM Jagan On Housing : ఇళ్ల నిర్మాణంపై సీఎం జగన్ కీలక ఆదేశాలు
24 November 2022, 16:31 IST
- CM Jagan Review : గృహనిర్మాణశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఇళ్లులేని వారికి ఇళ్లు ఇవ్వడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ. 5,655 కోట్లు ఖర్చు చేశామన్నారు.
సీఎం జగన్ సమీక్ష
గృహనిర్మాణశాఖపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేసిన జగన్.. కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇళ్ల నిర్మాణంపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. లే అవుట్లలో పర్యటన వల్ల ఇళ్ల నిర్మాణ ప్రగతిపై సమీక్షించి ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. లే అవుట్లను సందర్శించినట్టుగా ఫొటోలను కూడా అప్లోడ్ చేయాలని స్పష్టం చేశారు.
ప్రతి శనివారం హౌసింగ్డే(Housing Day)గా నిర్వహిస్తున్నట్టు తెలిపిన అధికారులు. ఆ రోజు తప్పనిసరిగా అధికారులు లే అవుట్లను సందర్శిస్తున్నారని వెల్లడించారు. ఇళ్ల నిర్మాణం అనుకున్న సమయానికల్లా పూర్తికావాలని సీఎం జగన్(CM Jagan) ఆదేశించారు. ఆప్షన్–3 ని ఎంపిక చేసుకున్న లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణంపై దృష్టిపెట్టాలన్నారు. లే అవుట్ల వారీగా ప్రాధాన్యత పరంగా పనులను గుర్తించి.. అనుకున్న సమయానికి ఆ పని పూర్తయ్యేలా చూడాలని చెప్పారు. దీనివల్ల ఇళ్ల నిర్మాణంలో చెప్పుకోదగ్గ ప్రగతి కనిపిస్తుందన్నారు.
'ఇళ్ల నిర్మాణం నాణ్యతలో ఎలాంటి రాజీ వద్దు. ప్రతి దశలోనూ నాణ్యతా నిర్ధారణ పరీక్షలు జరగాలి. ఇళ్ల నిర్మాణంలో క్వాలిటీ(Quality)ని నిరంతరం పాటించడానికి ఎస్ఓపీలను అందుబాటులో ఉంచాలి. గ్రామ సచివాలయాల్లో ఉన్న ఇంజినీరింగ్ అసిస్టెంట్(Engineering Assistants) సేవలను విస్తృతంగా వాడుకోవాలి. ఇళ్ల నిర్మాణంలో క్వాలిటీ ప్రమాణాలు పాటించే విషయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ భాగస్వామ్యం తీసుకోవాలి. ఇళ్లు పూర్తయ్యే సరికి మూడు రకాల మౌలిక సదుపాయాలు ఉండాలి. విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలి. మిగిలిన మౌలిక సదుపాయాలనూ వృద్ధిచేసుకుంటూ ముందుకు సాగాలి.' అని సీఎం ఆదేశించారు.
ఈ పనులకు సంబంధించి ఇప్పటికే డీపీఆర్(DPR)లు సిద్ధం అయ్యాయని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. ప్రాధాన్యతాక్రమంలో చేసుకుంటూ వెళ్తున్నామన్నారు. ఈ సమీక్షా సమావేశంలో గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ సమీర్ శర్మ, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ దవులూరి దొరబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.