తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nara Lokesh Yuvagalam: లోకేష్‌ పాదయాత్రపై కోడిగుడ్ల దాడి..పొద్దుటూరులో ఉద్రిక్తత

Nara Lokesh Yuvagalam: లోకేష్‌ పాదయాత్రపై కోడిగుడ్ల దాడి..పొద్దుటూరులో ఉద్రిక్తత

HT Telugu Desk HT Telugu

02 June 2023, 8:42 IST

    • Nara Lokesh Yuvagalam: యువగళం పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పొద్దుటూరులో జరుగుతున్న నారా లోకేష్ పాదయాత్రలో ఇద్దరు యువకులు కోడిగుడ్లతో దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. భద్రతా వైఫల్యం, కవ్వింపు చర్యలపై  లోకేష్‌ నిరసనకు దిగారు. 
ప్రొద్దుటూరు పాదయాత్రలో నారా లోకేష్
ప్రొద్దుటూరు పాదయాత్రలో నారా లోకేష్

ప్రొద్దుటూరు పాదయాత్రలో నారా లోకేష్

Nara Lokesh Yuvagalam: నారా లోకేష్ యువగళం పాదయాత్రలో గురువారం రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రొద్దుటూరులో వైకాపా కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ లోకేష్‌ నిరసనకు దిగారు. వైఎస్సార్‌ జిల్లాలో పాదయాత్రకు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని లోకేష్‌ పోలీసులపై మండిపడ్డారు.

గురువారం రాత్రి బహిరంగ సభ అనంతరం మైదుకూరు రోడ్డు మార్గంలో లోకేశ్‌ పాదయాత్ర సాగుతుండగా ఓ వ్యక్తి కోడిగుడ్డు విసరడంతో అది భద్రతా సిబ్బందిపై పడింది. దీంతో లోకేశ్‌ నిరసనకు దిగారు. పోలీసులు వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేయడంతో వారి తీరును దుయ్యబట్టారు. వైకాపా కవ్వింపు చర్యలపై చర్యలు తీసుకోనందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కోడిగుడ్డు విసిరిన వ్యక్తిని తెదేపా కార్యకర్తలు పట్టుకొచ్చి దేహశుద్ధి చేశారు. చివరకు పోలీసులు సర్ది చెప్పడంతో లోకేష్ పాదయాత్ర కొనసాగింది.

వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో లోకేశ్‌ యువగళం పాదయాత్ర సందర్భంగా వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడిందని టీడీపీ ఆరోపించింది. పాదయాత్ర వెళ్లే మార్గంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం, రహదారులను తవ్వేయడం, ఇసుక, కంకరతో నింపేయడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడ్డారు.

రోడ్లను తవ్వేసిన మార్గంలో కాకుండా మరో మార్గంలో లోకేష్ పాదయాత్ర సాగింది. గురువారం రాత్రి లోకేశ్‌పై ఓ వ్యక్తి కోడిగుడ్డు విసరగా ఆయన భద్రతా సిబ్బందిపై పడింది. 'అబ్బాయి... బాబాయిని చంపాడు' పేరిట మాజీమంత్రి వివేకాతో పాటు సీఎం జగన్‌, ఎంపీ అవినాష్‌రెడ్డి చిత్రాలతో ముద్రించిన ప్లకార్డును లోకేశ్‌ ప్రదర్శించారు. '

బాబాయ్‌ను లేపేసింది ఎవరు?' అంటూ ప్రజలను అడిగి వారి నుంచి సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు. ఈ ప్లకార్డులను ప్రదర్శిస్తున్న తెదేపా కార్యకర్తలను వారిస్తూ డీఎస్పీ నాగరాజు లోకేశ్‌ వద్దకు చేరుకున్నారు. 'అన్ని అనుమతులు తీసుకుని యాత్ర చేస్తున్నామని తమను రెచ్చగొట్టేలా వైకాపా వాళ్లు ఫ్లెక్సీలు పెట్టినప్పుడు ఎక్కడున్నారని డీఎస్పీని నిలదీశారు. వైసీపీ ఫ్లెక్సీలను తొలగిస్తే తాము ప్లకార్డుల ప్రదర్శన ఆపేస్తామని లోకేశ్‌ అన్నారు. దీంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

పాదయాత్రలో భాగంగా హూ కిల్డ్‌ బాబాయ్‌?' అంటూ పొద్దుటూరులో ప్రశ్నించారు. 'సొంత పత్రిక, ఛానల్‌ ఉన్నాయని.. బాబాయ్‌ హత్యపై కట్టుకథలు అల్లారని, నారాసుర చరిత్ర అని రాశారన్నారు. బాబాయ్‌ ఆత్మ వెంటాడింది. అది జగనాసుర రక్త చరిత్ర అని తేలిపోయిందన్నారు. అబ్బాయిలే బాబాయ్‌ను చంపేశారని.. చెల్లే రహస్యంగా సాక్ష్యం చెప్పిందని కేసు నుంచి బయటపడటానికి దిల్లీ వెళ్లి అందరి కాళ్లు పట్టుకుంటున్నారు అని ఆరోపించారు.

ప్రొద్దుటూరును ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి.. గ్యాంబ్లింగ్‌, క్రికెట్‌ బెట్టింగ్‌, మట్కా, గుట్కా, దొంగనోట్లు, ఇసుక అక్రమ రవాణాకు అడ్డాగా మార్చేశారని లోకేశ్‌ ఆరోపించారు.మరోవైపు ప్రొద్దుటూరులో యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు జనం పోటెత్తారు. పాదయాత్ర దారిలో భారీగా రోడ్లపైకి వచ్చిన యువకులు, మహిళలు యువనేతకు ఘనస్వాగతం పలికారు.

లోకేష్‌కు బ్రహ్మరథం పట్టిన జనం…

113వరోజు పాదయాత్ర ప్రొద్దుటూరు శివారు చౌటపల్లినుంచి ప్రారంభమై దొరసానిపల్లి మీదుగా ప్రొద్దుటూరు పట్టణంలోకి ప్రవేశించింది. రోడ్డుపొడవునా యువనేతకు హారతులు పడుతూ మహిళలు నీరాజనాలు పలికారు. ప్రొద్దటూరు టౌన్ లో పట్టిపీడిస్తున్న సమస్యలను స్థానికులు లోకేష్ దృష్టికి తెచ్చారు. కాలనీల్లో డ్రైనేజ్, తాగునీరు, అధికార పార్టీ నాయకుల వేధింపుల గురించి యువనేత దృష్టికి తెచ్చారు.

మరో ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలు పరిష్కరిస్తుందని చెప్పి యువనేత ముందుకు సాగారు. 113వరోజు యువనేత లోకేష్ 10.5 కి.మీ. దూరం నడిచారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1456.6 కి.మీ. పూర్తయింది.