Aqua Farmers : సెప్టెంబరు 1 నుంచి ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ
02 August 2022, 15:23 IST
- 10 ఎకరాలలోపు ఆక్వా సాగు చేసే చిన్న, సన్నకారు ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ వర్తింపజేసేందుకు చేపట్టిన సర్వే ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ మేరకు విద్యుత్ సబ్సిడీ వర్తింపజేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది.
ప్రతీకాత్మక చిత్రం
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అర్హులైన ఆక్వా సాగు రైతులకు విద్యుత్ సబ్సిడీ వర్తింపజేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది 10 ఎకరాలలోపు సాగు చేసే చిన్న ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ వర్తింపజేసేందుకు చేపట్టిన సర్వే ఈ నెలాఖరుతో ముగియనుంది.
రాష్ట్రంలో 1.40 లక్షల ఎకరాల్లో ఉప్పునీరు, 3.89 లక్షల ఎకరాల్లో మంచినీరు సాగులో ఉంది. వీటిలో 63,343 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ-క్రాప్ బుకింగ్ ప్రకారం 2.5 ఎకరాలలోపు 95,277 మంది, 2.5 నుంచి ఐదెకరాల లోపు 22,358 మంది, 5-10 ఎకరాలలోపు 11,809 మంది, పది ఎకరాల్లోపు 6,398 మందితో కలిపి 1,35,842 మంది ఆక్వా రైతులు ఉన్నారు. కానీ నాన్ ఆక్వా జోన్ లో సాగు చేస్తున్న వారు కూడా విద్యుత్ సబ్సిడీ ద్వారా లబ్ది పొందుతున్నారు. అలాగే కొన్ని చోట్ల ఒకరి పేరు మీద కనెక్షన్ ఉంటే మరొకరు సాగు చేస్తున్నారు.
మొదటి జోన్లో ఐదెకరాల విస్తీర్ణంలో ఉన్న చిన్న, సన్నకారు ఆక్వా రైతులకు మాత్రమే విద్యుత్ రాయితీ వర్తింపజేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఆ తర్వాత.. పరిమితిని పది ఎకరాలకు పెంచింది. అనంతరం ఆక్వాజోన్ పరిధిలో వాస్తవంగా సాగు చేస్తున్న రైతులను గుర్తించేందుకు విద్యుత్, రెవెన్యూ, మత్స్యశాఖలతో సర్వే నిర్వహించారు. విద్యుత్ కనెక్షన్ ఎవరి పేరుతో ఉంది. ఆ కనెక్షన్ ఎంత విస్తీర్ణంలో ఉంది. చెరువుకు లైసెన్స్ ఉందా వంటి వివరాలు కూడా అధికారులు తెలుసుకున్నారు.