AP Govt On High Court : మనసు మార్చుకున్న ప్రభుత్వం.. అమరావతిలోనే హైకోర్టు!
28 November 2022, 21:20 IST
- Andhra Pradesh High Court : కర్నూలులో హైకోర్టు.. ఈ మాటలు ప్రభుత్వం ఎప్పటి నుంచో చెబుతోంది. కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నట్టుగా కనిపిస్తోంది. అమరావతిలోనే హైకోర్టు ఉంటుందని సుప్రీంకోర్టుకు తెలిపింది.
రాజధాని అమరావతి
అమరావతి(Amaravati)లో అసెంబ్లీ, విశాఖలో సచివాలయం, కర్నూలుకు హైకోర్టు(High Court).. ఇవీ ఏపీ ప్రభుత్వం కొన్ని రోజులు చెబుతున్న మాటలు. అయితే తాజాగా ఈ నిర్ణయాన్ని మార్చుకుంది ప్రభుత్వం. హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని సుప్రీం కోర్టు(Supreme Court)కు తెలిపింది. ఇదే ఏపీ ప్రభుత్వ అభిమతమని స్పష్టం చేసింది. దీంతో ఏపీ రాజకీయాల్లో మరోసారి చర్చ లేచింది.
అమరావతి పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు అంశం కూడా చర్చకు వచ్చింది. హైకోర్టుకు ఇప్పటి వరకూ ఎంత ఖర్చు పెట్టారని సుప్రీం కోర్టు అడిగింది. రూ. 150 కోట్లు కేటాయించగా.. రూ. 116 కోట్లు ఖర్చు చేశారని ఏపీ ప్రభుత్వ(AP Govt) తరఫు న్యాయవాది తెలిపారు. హైకోర్టు ఎక్కడ ఉండాలనుకుంటున్నారని ప్రశ్నించగా.. అమరావతిలోనే ఉంటుందని.. ఉండాలని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు.
మూడు రాజధానుల్లో(Three Capitals) న్యాయరాజధాని కర్నూలు అని ప్రకటించి.. ఇప్పుడు ప్రభుత్వం మనసు మార్చుకోవడంపై పెద్ద ఎత్తున చర్చ మెుదలైంది. కర్నూలు(Kunrool)లో హైకోర్టు ప్రతిపాదన గతంలోనిదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాంటి ఆలోచన ఇప్పుడు లేదని చెప్పడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
ప్రభుత్వం మూడు రాజధానులు ప్రతిపాదించినప్పటి నుంచీ.. వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. అనూహ్యంగా ఇప్పుడు కర్నూలులో న్యాయ రాజధాని ఉండదని సుప్రీం కోర్టుకు చెప్పింది. ఈ విషయం ఆసక్తికరంగా మారింది. దీని వెనక ప్రత్యేక వ్యూహం ఏమైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అమరావతి రాజధాని నిర్మాణంపై ఏపీ హైకోర్టు(AP High Court) గత మార్చి 3న ఇచ్చిన తీర్పులో పలు అంశాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఆర్నెళ్ల లోపు రాజధాని నిర్మాణం పూర్తి చేయాలనే నిబంధన విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉపశమనం లభించింది. అదే సమయంలో ల్యాండ్ పూలింగ్ సందర్భంగా రైతుల(Farmers)కు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కేసు విచారణను వచ్చే ఏడాది జనవరి 31కు వాయిదా వేసింది.
ఏ నగరాలను ఎలా అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వ నిర్ణయమని, హైకోర్టులు నిర్ణయించలేవని సర్వోన్నత న్యాయస్థానం కేసు విచారణ సందర్భంగా అభిప్రాయపడింది. మార్చి 3న ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం(State Govt) సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ వ్యవహారంపై దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్స్పై సుప్రీం కోర్టు(Supreme Court) విచారణ జరిపింది.