Peddireddy : కొత్త కనెక్షన్లతో పాటు సబ్ స్టేషన్లు నిర్మిస్తామన్న పెద్దిరెడ్డి
14 February 2023, 7:44 IST
- Peddireddy ఏపీలో ఈ ఏడాది మార్చి నాటికి 1.25 లక్షల కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 100 కొత్త సబ్ స్టేషన్లకు ప్రారంభోత్సవం చేస్తామని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి ప్రకటించారు. ఇంధన శాఖకు ప్రైవేటు కంపెనీల బకాయిల వసూళ్ళపై దృష్టి సారించాలని సూచించిన మంత్రి… తక్షణం బకాయిదారులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని 2617 జగనన్న లేఅవుట్లలో విద్యుద్దీకరణ పూర్తి చేసినట్లు చెప్పారు.
విద్యుత్ శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి
Peddireddy రానున్న వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, కృష్ణపట్నం, ఎన్టిటిపిఎస్ లో కొత్త యూనిట్లను వినియోగంలోకి తీసుకురావాలని మంత్రి పెద్ది రెడ్డి అధికారులకు సూచించారు. వేసవి వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని బొగ్గు కొరత లేకుండా ముందుస్తుగానే నిల్వలను సరిచూసు కోవాలన్నారు.
ఈ ఏడాది మార్చి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1.25 లక్షల వ్యవసాయ కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ లను రైతులకు అందిచనున్నట్లు రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా పగటిపూట తొమ్మిదిగంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను రైతన్నలకు అందించాలని సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులు పనిచేయాలన్నారు.
అర్హత ఉన్న ప్రతి దరఖాస్తుదారుకి ఉచిత విద్యుత్ కనెక్షన్ ను మంజూరు చేయాలని, వచ్చే నెలాఖరు నాటికి మొత్తం లక్షా పాతికవేల కనెక్షన్లను పూర్తి చేయాలని, రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సబ్ స్టేషన్ లలో 100 సబ్ స్టేషన్లను కూడా అదే గడువు నాటికి పూర్తి చేయాలన్నారు.
రానున్న వేసవిలో డిమాండ్ కు తగినట్లుగా విద్యుత్ ఉత్పాదనకు ప్రణాళిక సిద్దం చేసుకోవాలని మంత్రి సూచించారు. కృష్ణపట్నం, ఎన్టిటిపిఎస్ లోని కొత్త యూనిట్లను కూడా వినియోగంలోకి తీసుకురావాలని, ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం రోజుకు 210 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉందని. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ డిమాండ్ 240 మిలియన్ యూనిట్లకు పెరుగుతుందని అంచనా వేసినట్లు చెప్పారు.
విద్యుత్ డిమాండ్ అంచనాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ కోతలు లేకుండా విద్యుత్ ఉత్పత్తి, కొనుగోళ్ళకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న బొగ్గు నిల్వలను పెంచు కోవాలని అధికారులను సూచించారు. వేసవిలో డిమాండ్ కు తగినట్లు అవసరమైతే బయటి నుంచి విద్యుత్ కొనుగోళ్ళు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు కర్మాగారాలు, వ్యాపార సంస్థల నుంచి హెచ్ టి కనెక్షన్ ల నుంచి దాదాపు రూ.349 కోట్లు బకాయిలు రావాల్సి ఉందని, దీనిపై డిస్కంలు దృష్టి సారించాలన్నారు. రానున్న రెండు నెలల్లో ఈ బకాయిలను నూరుశాతం వసూలు చేయాలని, నిర్థిష్ట కాల పరిమితితో ఈ బకాయిలను వసూలు చేయాలని మంత్రి ఆదేశించారు. రెగ్యులర్ విద్యుత్ బిల్లులతో బకాయిలకు గానూ డిమాండ్ నోటీస్ లను జారీ చేయాలన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 9979 జగనన్న కాలనీ లేఅవుట్లు ఉన్నాయని వీటిల్లో 2617 లే అవుట్లలో అంటే దాదాపు 26.25 శాతం విద్యుతీకరణ పూర్తయ్యిందని, మొత్తం రూ.1850 కోట్ల కు గానూ ఇప్పటి వరకు రూ. 257.41 కోట్లు అంటే 25.67 శాతం ఖర్చు చేశామని మంత్రి చెప్పారు. లే అవుట్లలోని 21,851 గృహాలు, సొంతభూముల్లో నిర్మించుకున్న 1,43,823 గృహాలకు కలిపి మొత్తం 1.65 లక్షల జగనన్న పక్కా గృహాలకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. ఇంధన శాఖను బలోపేతం చేసేందుకు, ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు నిరంతరం కృషి చేయాలని మంత్రి సూచించారు.