తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cps Employees Protest : సీపీఎస్ ఉద్యోగుల చలో విజయవాడకు పోలీసులు బ్రేక్, అనుమతులు లేవని అరెస్టులు!

CPS Employees Protest : సీపీఎస్ ఉద్యోగుల చలో విజయవాడకు పోలీసులు బ్రేక్, అనుమతులు లేవని అరెస్టులు!

17 February 2024, 15:54 IST

    • CPS Employees Protest : ఏపీలో ఎన్నికల వేళ ఉద్యోగులు ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ డిమాండ్లపై వాయిస్ పెంచుతున్నారు. తాజాగా సీపీఎస్ ఉద్యోగులు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. అయితే చలో విజయవాడకు అనుమతి లేదని పోలీసులు అంటున్నారు.
సీపీఎస్ ఉద్యోగుల చలో విజయవాడ
సీపీఎస్ ఉద్యోగుల చలో విజయవాడ

సీపీఎస్ ఉద్యోగుల చలో విజయవాడ

CPS Employees Protest : ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమ కార్యాచరణకు సిద్ధమయ్యారు. సీపీఎస్ ఉద్యోగులు(CPS Employees Protest ) నేడు, రేపు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. సీపీఎస్ వల్ల నష్టపోయామని, తన గోడును సీఎం జగన్ మొరపెట్టుకుంటామని ఉద్యోగులు అంటున్నారు. అయితే సీపీఎస్ ఉద్యోగుల చలో విజయవాడకు అనమతిలేదని విజయవాడ పోలీసులు తేల్చిచెప్పారు. చలో విజయవాడ చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విజయవాడలో సెక్షన్ 30, 144 సెక్షన్ అమలులో ఉన్నాయని సీపీ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే చలో విజయవాడ నిర్వహించాలని సీపీఎస్ ఉద్యోగులు పట్టుదలటో ఉన్నారు. ఇప్పటికే పలువురు సీపీఎస్ నాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఎవరైనా ఆందోళనలో పాల్గొంటే అరెస్ట్‌లు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

విజయవాడ ధర్నా చౌక్ లో

ఏపీ సీపీఎస్ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని, సీపీఎస్ (CPS Employees Protest)రద్దు చేయాలని చలో విజయవాడ(Chalo Vijayawada) ఆందోళనకు పిలుపునిచ్చారు. విజయవాడ ధర్నాచౌక్ లో చలో విజయవాడ నిరసన కార్యక్రమం నిర్వహణకు అనుమతించాలని పోలీసులను కోరారు. కానీ అనుమతులు నిరాకరించారు. పలువురు సీపీఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. సీపీఎస్(CPS) రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీపీఎస్ ను అంగీకరించమని తేల్చిచెబుతున్నారు. ఎవరైతే జీపీఎస్(GPS) కు అంగీకరించాలని ఆ నలుగురు ఉద్యోగ సంఘాల నేతలకు అమలు చేసుకోవచ్చని సీపీఎస్ ఉద్యోగులు అంటున్నారు. జీపీఎస్ వల్ల ఉద్యోగుల డబ్బులు ఇన్వెస్ట్మెంట్ గా మారుతున్నాయని, అత్యవసర సమయాల్లో డబ్బులు వినియోగించుకునే అవకాశం లేకుండా పోయిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పూర్తిగా మారిపోయాయన్నారు. చలో విజయవాడకు పోలీసులు అనుమతులు ఇవ్వడపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాగైనా ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు.

బయటకు వస్తున్న ఉద్యోగ సంఘాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హడావుడితో పాటే ఉద్యోగ సంఘాలు (AP Govt Employees) కూడా మెల్లగా బయటకు వస్తున్నాయి. ఇన్నాళ్లు వ్యూహాత్మక మౌనం పాటించిన ఉద్యోగ సంఘాలు అదను కోసం ఎదురు చూస్తూ వచ్చాయి. ఎలక్షన్ టైమ్‌ దగ్గర పడటంతో తమ ఆయుధాలకు పదును పెడుతున్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి చేయడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కొద్ది నెలలుగా సైలెంట్ అయిపోయాయి. దీనికి కారణం ఏమిటనేది ఎవరికి అంతు చిక్కలేదు. ఉద్యోగ సంఘాల లోటుపాట్లన్ని ప్రభుత్వం గుప్పిట్లో ఉండటంతో అన్ని సంఘాలు ఓ దశలో బెదిరిపోయాయి. ఓ సంఘం నాయకుడు ఏకంగా పోలీసుల నుంచి తప్పించుకోడానికి నెలల తరబడి ప్రవాస జీవితం గడపాల్సి వచ్చింది. ఉద్యోగ సంఘాలను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ ఖజానాకు భారీ ఎత్తున సదరు నాయకుడు గండి కొట్టిన వ్యవహారం పోలీసుల దర్యాప్తులో వెలుగు చూడటంతో చాన్నాళ్లు పత్తా లేకుండా పోయారు. శాఖాధిపతుల్ని శాసించిన నాయకుడు చివరకు కాళ్లబేరానికి రావాల్సిన పరిస్థితి చూసిన మిగిలిన సంఘాలు కూడా వెనక్కి తగ్గాయి. ప్రభుత్వంతో గొడవ పడితే ఏమి జరుగుతుందో తెలిసిపోయాక ఉద్యోగ సంఘాలన్నీ సైలెంట్ అయిపోయాయి.

ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న ఉద్యోగ సంఘాలు ఒక్కసారిగా యాక్టివేట్ అవుతున్నాయి. మళ్లీ ఉద్యమాలకు సిద్ధమని ప్రకటిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే కోడ్ అమల్లోకి వచ్చేస్తుంది. అప్పుడు ప్రభుత్వానికి జవాబుదారిగా ఉండాల్సిన పని ఉద్యోగులకు ఉండదు. కేవలం ఎలక్షన్ కమిషన్‌‌కు మాత్రమే లోబడి ఉద్యోగులు పనిచేయాల్సి ఉంటుంది. ఎటూ ఎలక్షన్ కోడ్ వచ్చేస్తున్నందున వీలైనంత త్వరగా తమ డిమాండ్లను నెరవేర్చుకోవాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. ఇన్నాళ్లు ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోక పోవడంతో గుర్రుగా ఉన్న సంఘాలన్నీ ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని యోచిస్తున్నాయి.

తదుపరి వ్యాసం