Cough: దగ్గు అధికంగా ఉన్నప్పుడు తినకూడని ఆహారాలు ఇవే-these are the foods that should not be eaten when the cough is severe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cough: దగ్గు అధికంగా ఉన్నప్పుడు తినకూడని ఆహారాలు ఇవే

Cough: దగ్గు అధికంగా ఉన్నప్పుడు తినకూడని ఆహారాలు ఇవే

Haritha Chappa HT Telugu
May 01, 2024 09:30 AM IST

Cough: కొందరు దగ్గు ఉన్నా పట్టించుకోకుండా కొన్ని రకాల ఆహారాలను తింటారు. వీటివల్ల దగ్గు అధికమైపోతుంది. కాబట్టి దగ్గు ఉన్నప్పుడు ఏ పదార్థాలు తినకూడదో తెలుసుకోండి.

దగ్గు ఉంటే తినకూడని ఆహారాలు
దగ్గు ఉంటే తినకూడని ఆహారాలు (Pexels)

Cough: ప్రతి ఒక్కరూ ఏడాదిలో ఒకటి రెండు సార్లు అయినా పొడి దగ్గుతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దగ్గు సాధారణంగా వచ్చే అనారోగ్య సమస్య. కొన్నిసార్లు అనేక కారణాల వల్ల కూడా ఇది వస్తుంటుంది. కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల వల్ల దగ్గు అధికంగా వస్తూ ఉంటుంది. దగ్గు ఉన్నప్పుడు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. చాలా మంది తెలియక దగ్గుకు మందులు వాడుతూ కూడా సాధారణంగానే ఆహారాన్ని తింటారు. దీని వల్ల కొన్నిసార్లు దగ్గు ఎక్కువైపోతుంది. కాబట్టి దగ్గుతో బాధపడుతున్నప్పుడు ఎలాంటి ఆహారాలను దూరంగా పెట్టాలో తెలుసుకోండి.

ఎలాంటి ఆహారాలు తినకూడదు?

దగ్గు అధికంగా ఉన్నప్పుడు ఉప్పు అధికంగా వేసిన ఆహారాలను దూరం పెట్టండి. ఇది దగ్గును పెంచేస్తుంది. అలాగే నూనెలో డీప్ ఫ్రై చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. నూనె అధికంగా ఉన్న పూరీలు, గారెలు వంటి వాటికి కూడా దూరంగా ఉండడం మంచిది. పంచదార వేసిన పదార్థాలను తినడం మానేయాలి. ఇది రోగనిరోధక శక్తిని తగ్గించడంతో పాటూ, దగ్గును పెంచేస్తాయి.

ఇలాంటి ఆహారాలు తినడం వల్ల కఫం అధికంగా ఉత్పత్తి అవుతుంది. అలాగే దగ్గు ఉన్నప్పుడు బెల్లంతో చేసిన ఆహారాలు, చల్లగా ఉండే నీరు, పెరుగు వంటివి కూడా తినడం మానేయాలి. అలాగే పండ్ల రసాలను దూరంగా పెట్టాలి. చల్లగా ఉండే పండ్ల రసాలు దగ్గును పెంచేస్తాయి. పరగడుపున గోరువెచ్చగా ఉన్న నీటిలో తేనె కలుపుకొని తాగితే చాలా మంచిది. ఒకవేళ పండ్ల రసాలు తాగినా కూడా చల్లగా కాకుండా, గది ఉష్ణోగ్రత వద్ద ఉండేట్టు చూసుకోవాలి. అలాగే ఆ పండ్ల రసాల్లో పంచదార వంటివి వేయకుండా, తేనె మాత్రం వేసుకొని తాగితే ఎంతో మంచిది.

దగ్గు సమస్య ఉన్నప్పుడు రాత్రి అవుతున్న కొద్దీ మరింతగా దగ్గు వేధిస్తుంది. అలాంటివారు నూనెతో వండిన ఆహారాలకు బదులుగా ఉడికించిన ఆహారాలను తినడం మంచిది. అంటే నీళ్లు పోసి వండిన కూరలు, అన్నం వంటివి తింటే మంచిది. అలాగే మసాలాలు అధికంగా ఉండే ఆహారాలను తినకూడదు. పండ్లను తినడం వల్ల మేలు జరుగుతుంది. కానీ సాయంత్రం ఏడు గంటలలోపే పండ్లను తినడం మంచిది. అది కూడా చల్లగా ఉన్న పండ్లను తినకూడదు. గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న వంటలను మాత్రమే ఎంపిక చేసుకొని తినాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే దగ్గు త్వరగా తగ్గుతుంది. లేకుంటే వారం రోజుల్లో తగ్గాల్సిన దగ్గు, నెల రోజులకు తగ్గే అవకాశం ఉంటుంది.

WhatsApp channel