Healthy Lifestyle Tips: కాలం మారేకొద్ది మనం కొన్ని పాత పద్ధతులను గాలికి వదిలేస్తున్నాం. కానీ, ఇప్పటికీ ఒకప్పటి పద్ధతులే ఎన్నో విధాల శ్రేయస్కరం అని తరచుగా నిరూపితం అవుతున్నాయి. తినేటప్పుడు సాధారణంగా నేలపై కూర్చోవడం (Floor sitting) భారతీయ సంస్కృతులలో ఒక భాగం. ఇలా నేలపై కూర్చునే భంగిమను యోగాలో సుఖాసనం (Sukhasana Yoga) అంటారు. అంటే కేవలం నేలపై కూర్చోవడం ద్వారా కూడా యోగా చేస్తూ మనం మన ఆరోగ్యానికి పలు ప్రయోజనాలు అందించడమే. మన వెన్నెముక (Spine) నిజానికి నిటారుగా ఉండదు అని చాలా మందికి తెలియదు. ఇది మన మెడ, థొరాసిక్, నడుము ప్రాంతాలలో మూడు సహజ వక్రతలతో కూడిన ‘S-ఆకారపు’ నిర్మాణం.నేలపై కూర్చుంటే మన వెన్నెముక దాని సహజ ఆకృతిలో ఉండటానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది, దీంతో శరీర భంగిమ మెరుగుపడుతుంది. శరీర ఫ్లెక్సిబిలిటీ, చలనశీలత కూడా మెరుగుపడుతుంది, కీలకమైన కండరాలు బలోపేతం అవుతాయి. అయినప్పటికీ, ఎక్కువసేపు నేలపై కూర్చోవడం వలన అసౌకర్యంగా ఉంటుంది, ఇది వెన్నునొప్పి (Back pain), కీళ్ల సమస్యలకు (Knee pains) దారితీస్తుంది. కాబట్టి మీకు సౌకర్యంగా అనిపించేంతవరకు నేలపై కూర్చోవడం, నేలపై కూర్చొని తినడం చేస్తే చాలు.
ప్రతిరోజూ కొంత సమయం పాటు నేలపై కూర్చోవడం వలన వివిధ ప్రయోజనాలు పొందవచ్చు. ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకోండి.
నేలపై కూర్చోవడం ద్వారా మీ శరీర భంగిమను సరిచేయడానికి వీలు కలుగుతుంది. ఇది మీ భుజాలను వెనక్కి నెట్టి, వెన్నెముకకు దాని సహజ ఆకృతిని అందివ్వడంలో సహాయపడుతుంది. తద్వారా దిగువ వీపు, కటి ప్రాంతంలో స్థిర్వత్వం లభిస్తుంది. కొద్దిసేపు నేలపై కూర్చోవడం వల్ల వెన్నునొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఎక్కువసేపు కుర్చీపై కూర్చునే వారికి డిస్క్ స్లిప్ కావడం, నడుము నొప్పి వంటి సమస్యలు నిరంతరం ఉంటాయి. కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసే వారు ఈ సమస్యలను ఎక్కువ ఎదుర్కొంటారు. నేలపై కూర్చున్నప్పుడు మోకాళ్లను వంచి చతికిలబడాలి, తద్వారా దిగువ కండరాలపై కొంత ఒత్తిడి కలుగుతుంది, ఇది మీ దిగువ-శరీర కండరాలను సాగదీయడంలో మీకు సహాయపడుతుంది. దీనిని యోగాలో క్రియాశీల విశ్రాంతి భంగిమగా (active rest postures) చెబుతారు. ఇది మీ కండరాల వశ్యతను, హిప్ ఫ్లెక్సిబిలిటీని (Flexibility) పెంచుతుంది.
నేలపై కాళ్లు ముడుచుకొని కూర్చోవడం యోగా భంగిమలో ఒక ఆసనం. దీనినే సుఖాసనం అని పిలుస్తారు. ఇది మన జీర్ణక్రియ ప్రక్రియను (Digestion) మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఆహారం తినడానికి ప్లేట్ను నేలపై ఉంచినప్పుడు, తినడానికి మన శరీరాన్ని కొద్దిగా ముందుకు కదిలించాలి, ఆపై మళ్లీ అసలు స్థితికి తిరిగి వస్తాము. ఇలా శరీరాన్ని పదేపదే కదిలించేచర్య ఉదర కండరాలను ఉత్తేజపరుస్తుంది, ఇది కడుపులో జీర్ణ ఎంజైమ్ల స్రావాన్ని పెంచుతుంది, ఆహారం బాగా జీర్ణం కావడానికి వీలు కల్పిస్తుంది.
నేలపై కూర్చోవడం వలన మీ ఆయుష్షు (Lifespan)కూడా పెరుగుతుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ, యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, క్రాస్-లెగ్డ్ పొజిషన్లో (పద్మాసనం) నేలపై కూర్చున్న వ్యక్తులు ఎటువంటి మద్దతు లేకుండా లేవగలిగేవారు ఎక్కువ సంవత్సరాలు జీవించే అవకాశం ఉంది. కారణం ఏమిటంటే, ఆ స్థానంలో కూర్చొని ఎలాంటి మద్ధతు లేకుండా లేవడానికి మంచి బలం, వశ్యత అవసరం. ఇలాంటి అభ్యాసం చేసే వారిలో బలం, వశ్యత మెరుగుపడతాయి. అందువల్ల వారి జీవితకాలం పెరుగుతుందని ఆ అధ్యయనం పేర్కొంది.
కాబట్టి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారైనా, ఎక్కువ సేపు కుర్చీలు, సోఫాలకు అతుక్కుపోయే వారైనా రోజులో కొంత సమయం పాటు నేలపై కూర్చొవడం ప్రాక్టీస్ చేయండి, మీరు పైన పేర్కొన్న ప్రయోజనాలు పొందవచ్చు.