TTD Face Recognition : తిరుమలలో ఫేస్‌ రికగ్నిషన్‌తో భక్తులకు వేగంగా గదుల కేటాయింపు-ttd eo dharma reddy on tirumala temple face recognition technology ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Face Recognition : తిరుమలలో ఫేస్‌ రికగ్నిషన్‌తో భక్తులకు వేగంగా గదుల కేటాయింపు

TTD Face Recognition : తిరుమలలో ఫేస్‌ రికగ్నిషన్‌తో భక్తులకు వేగంగా గదుల కేటాయింపు

HT Telugu Desk HT Telugu

Face Recognition In Tirumala : తిరుమలలో ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీతో భక్తులకు వేగంగా గదుల కేటాయింపు జరుగుతుందని ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి చెప్పారు. గదుల రొటేషన్, దళారి వ్యవస్థ తగ్గిందన్నారు.

ఈవో ధర్మారెడ్డి

శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ(Face Recognition technology)తో 5 నుండి 10 నిమిషాల వ్యవధిలో గదులు పొందుతున్నట్లు టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల(Tirumala) అన్నమయ్య భవనంలో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలలో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ వల్ల గదుల రొటేషన్ పూర్తిగా తగ్గిందన్నారు . దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు ఈ టెక్నాలజీ(technology) చక్కగా ఉపయోగపడుతుందన్నారు.

సామాన్య భక్తులు ఎవరైతే గదుల కొరకు పేర్లు రిజిస్ట్రేషన్ సమయంలో ఫేస్ రికగ్నిషన్(Face Recognition) చేసుకుంటున్నారో, వారే ఉపవిచారణ కార్యాలయాల్లో గదులు పొంది, ఖాళీ చేసే సమయంలో కూడా నేరుగా వెళ్లి ఖాళీ చేస్తేనే కాషన్ డిపాజిట్ రిఫండ్ చేయడం జరుగుతుందన్నారు. ఒకసారి తమ ఆధార్ కార్డుతో గదులు పొందిన భక్తులు మళ్లీ 30 రోజుల తర్వాతే గదులు పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. మార్చి 1వ తేదీ నుండి 12వ తేదీ వరకు గదుల కేటాయింపు ద్వారా అత్యధికంగా రూ.2.95 కోట్ల రాబడి వచ్చిందని తెలిపారు. అడ్వాన్స్ బుకింగ్, కరెంటు బుకింగ్ లో కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నట్లు చెప్పారు.

తిరుమల(Tirumala)లోని వివిధ ప్రాంతాల్లో వసతి కోసం పేర్ల నమోదు కౌంటర్లను ప్రయోగాత్మకంగా త్వరలో సీఆర్ఓ వద్దకు మార్చనున్నట్లు తెలిపారు. అదేవిధంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2 లో భక్తులకు అందించే ఉచిత లడ్డులో కూడా ఫేస్ రికగ్నిషన్ ద్వారా అక్రమాలను అరికట్టినట్లు తెలిపారు. తద్వారా వ్యక్తి లేకుండా లడ్డు టోకెన్ రాదన్నారు.

అంతకుముందు మీడియా ప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారాఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ వల్ల భక్తులు(Devotees) పొందుతున్న సౌకర్యాలను వివరించారు. ఈ సమావేశంలో సిఇ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఎస్వీబీసీ సిఈవో శ్రీ షణ్ముఖ కుమార్, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబు, రిసెప్షన్ డిప్యూటీ ఈవోలు శ్రీ హరింద్రనాథ్, శ్రీ భాస్కర్, ఏఈఓ శ్రీ వెంకటేశ్వర్లు నాయుడు పాల్గొన్నారు.

తిరుమలలో మార్చి 1 నుంచి ప్రయోగత్మకంగా ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ ప్రవేశపెట్టినట్టుగా గతంలోనే టీటీడీ(TTD) ప్రకటించింది. గదుల కేటాయింపు, కాషన్ డిపాజిట్ తిరిగి చెల్లించే కౌంటర్స్ వద్ద ఈ బయోమెట్రిక్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫొటో ఆధారిత బయోమెట్రిక్ అమలుతో దళారులకు అడ్డుకట్ట వేయనున్నారు. గదుల కేటాయింపు సమయంలో ఫొటో క్యాప్చర్ తీసుకుంటారు. గదులు ఖాళీ చేసే సమయంలో క్యాప్చర్ అయిన ఫొటో మ్యాచ్ అయితేనే కాషన్ డిపాజిట్ అకౌంట్లో జమ చేస్తారు.