BJP Nirudyoga Deeksha: మేం అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం - బండి సంజయ్
26 March 2023, 13:24 IST
BJP Nirudyoga Deeksha in Hyderabad: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్ వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దొందూ దొందే అని, నిరుద్యోగుల కంటే రాహుల్ గాంధీ ప్రయోజనాలే ఆ పార్టీలకు ఎక్కువయ్యాయని ఆయన ఎద్దేవా చేశారు. శనివారం హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ నిరుద్యోగ మహా ధర్నా చేపట్టింది. బీజేపీ అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యో గాలను భర్తీ చేస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. తన కొడుకు తప్పుచేస్తే కేసీఆర్ ఎందుకు బర్తరఫ్ చేయడం లేదని ప్రశ్నించారు. వెంటనే కేటీఆర్ రాజీనామా చేయాలన్నారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి, నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇచ్చేదాకా పోరాడుతామని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. లీకేజీపై ప్రశ్నించిన తనకు నోటీసులు ఇస్తున్నారని... మరి కేటీఆర్కు ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదని నిలదీశారు. ఏప్రిల్ 2 నుంచి ఆరో తేదీ వరకు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని చెప్పారు. ఆ తర్వాత హైదరాబాద్లో భారీ ఎత్తున నిరుద్యోగ మిలియన్ మార్చ్ చేపడతామని ప్రకటించారు. అన్ని విశ్వవిద్యాలయాలకు వస్తామని… ఉద్యోగ అభ్యర్థులు చేసే పోరాటానికి మద్దతు ఇస్తామని చెప్పారు.