TSRTC: ఛార్జీలు పెంచండి… పొరుగు రాష్ట్రాలకు టీఎస్ ఆర్టీసీ సర్క్యులర్
15 June 2022, 7:29 IST
- ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు బస్సులు నడిపే ఆర్టీసీ సంస్థలకు టీఎస్ఆర్టీసీ సర్క్యులర్ జారీ చేసింది. ఆయా రాష్ట్రాల మధ్య తిరిగే బస్సు ఛార్జీలు ఒకేలా ఉండాలనే నిబంధన ఉందని.. ఈ నేపథ్యంలో ఛార్జీలు పెంచాలని కోరింది.
టీఎస్ ఆర్టీసీ సర్క్యులర్
TSRTC Circular To Other States: ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు పలు రకాల ఛార్జీలను పెంచింది టీఎస్ఆర్టీసీ. అన్ని రకాల ఛార్జీలను భారీగానే పెంచుతూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఆదాయం బాగానే పెరిగింది. కానీ పొరుగు రాష్ట్రాలకు.. ప్రధానంగా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర వెళ్లి వచ్చే ఆర్టీసీ బస్సులకు ప్రయాణికుల నుంచి ఆదరణ తగ్గింది.
ఆ బస్సులకు పెరిగిన ఆదరణ…
డీజిల్పై సెస్ను రూ.5 నుంచి రూ.175 వరకు పెంచడంతో టీఎస్ఆర్టీసీ బస్సు టికెట్ల ధరలు పెరిగాయి. అదేసమయంలో తెలంగాణ నుంచి నడిచే ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో చార్జీలు తక్కువగా ఉండడంతో ఎక్కువ మంది ఆ బస్సుల్లోనే వెళ్తున్నారు. దీంతో తెలంగాణ నుంచి ఏపీకి నడిచే టీఎస్ఆర్టీసీ బస్సుల ఆదాయం పడిపోయింది. మరోవైపు ఇతర రాష్ట్రాల ఆర్టీసీ బస్సులకూ ఆదరణ పెరిగింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన టీఎస్ ఆర్టీసీ... పొరుగు రాష్ట్రాలకు సర్కులర్ జారీ చేసింది.
పెంచాల్సిందే…!
అంతర్ రాష్ట్ర రవాణా సంస్థల ఒప్పందం ప్రకారం... ఆయా రాష్ట్రాల మధ్య తిరిగే బస్సు ఛార్జీలు ఒకేలా ఉండాలనే నిబంధన ఉందని టీఎస్ ఆర్టీసీ ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రాలు కూడా ఛార్జీలు పెంచాలని విజ్ఞప్తి చేసింది. ఇందులో భాగంగానే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లకు సర్క్యులర్లను పంపించినట్టు టీఎస్ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
నిర్ణయం తీసుకోపోతే...!
ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చి వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు పెరగడంతో ఏపీఎస్ఆర్టీసీకి సైతం సర్క్యూలర్ పంపించారు టీఎస్ ఆర్టీసీ అధికారులు. ప్రభుత్వంలో ఏపీఎస్ ఆర్టీసీ విలీనం కావడంతో తెలంగాణ ప్రాంతంలో తిరిగే ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల ఛార్జీలపై నిర్ణయం ఇప్పుడే తీసుకోలేమని ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం పేర్కొన్నట్టు సమాచారం. అయితే తమ సర్కులర్ పై స్పందించి నిర్ణయం తీసుకోకపోతే... ఆ రాష్ట్రాల బస్సులను నియంత్రించాలని నిర్ణయించినట్లు సమాచారం.