Margadarsi Chits: తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టు ని ఆశ్రయించిన ఏపీ సర్కారు
05 June 2023, 13:12 IST
- Margadarsi Chits: మార్గదర్శి చిట్స్ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాలను ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. చిట్ఫండ్ అక్రమాలపై చర్యలకు అనుమతించాలని విజ్ఞప్తి చేసింది.
సుప్రీం కోర్టు
Margadarsi Chits: మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థ నిధుల దారి మళ్లింపు కేసులో గత వారం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.
మార్గదర్శి సంస్థ యజమానులు, ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్లో కోరింది. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలన్న అభ్యర్థనను పరిశీలిస్తామని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రకటించింది.
మార్గదర్శి చిట్ఫండ్స్ యాజమాన్యంతో పాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో తదుపరి విచారణ జులై 18కి వాయిదా వేశారు. తెలంగాణ హైకోర్టు జారీ చేసిన స్టే సిఐడి దర్యాప్తునకు ఆటంకం కలిగిస్తోందని పిటిషన్లో పేర్కొన్నారు.
దర్యాప్తునకు ఎలాంటి ఆటంకాలు కల్పించవద్దన్నది ప్రాథమిక న్యాయసూత్రం అని రకరకాల అటంకాలు సృష్టిస్తూ నిందితులు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలోనే అత్యధిక చిట్ఫండ్ డిపాజిట్దారులు ఉన్నారని వారి ప్రయెోజనాలు కాపాడాల్సిన బాద్యత ప్రభుత్వంపై ఉందని ఏపీ తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు.
మార్గదర్శి చిట్ఫండ్స్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉన్న కారణంతో తెలంగాణ హైకోర్తు స్టే ఇవ్వడం సరికాదని, బ్రాంచ్ ఆఫీస్ డబ్బు హెడ్ ఆఫీస్కు తరలించి స్వాహా చేశారని ఆరోపించారు. సంపూర్ణ న్యాయం కోసం హైకోర్టులో ఏ పిటిషన్ అయినా ట్రాన్స్ ఫర్ చేసే అధికారం 139-A కింద సుప్రీంకు ఉందని ఏపీ ప్రభుత్వం పేర్కొనడంతో పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు ప్రకటించింది.