తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  September 22 Telugu News Updates : పడవ బోల్తా.. 15 మంది మృతి
ఏపీ తెలంగాణ తాజా వార్తలు
ఏపీ తెలంగాణ తాజా వార్తలు (HT)

September 22 Telugu News Updates : పడవ బోల్తా.. 15 మంది మృతి

22 September 2022, 22:50 IST

  • Today Telugu News Updates: సెప్టెంబర్ 22 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి. అప్ డేట్స్ కోసం ఎప్పటికప్పుడూ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి

22 September 2022, 22:49 IST

పడవ బోల్తా.. 15 మంది మృతి

సిరియాలో విషాదం జరిగింది. లెబనాన్​ నుంచి ఐరోపాకు వలసదారులతో బయలుదేరిన ఓ పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది చనిపోయారు. మరికొందరు ప్రాణాలతో బయటపడ్డారు. నీట మునిగిన 15 మంది మృతదేహాలను వెలికితీసినట్టుగా అధికారులు వెల్లడించారు. పడవలో మొత్తం ఎంత మంది ఉన్నారో స్పష్టంగా తెలియాల్సి ఉంది.

22 September 2022, 20:11 IST

నీటిపారుదల అంశాలపై కేంద్రానికి లేఖ

నీటిపారుదల అంశాలపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం 3 లేఖలు రాసింది. పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేయాలని కోరింది. సీడబ్ల్యూసీ, ఎన్ఐహెచ్ సీఈలతో సాంకేతిక బృందం ఏర్పాటు చేయాలని చెప్పింది. రాష్ట్ర అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. కేంద్రం జోక్యం చేసుకొని రక్షణ చర్యలు చేపట్టాలని తెలిపింది.

22 September 2022, 16:23 IST

ఐదేళ్లకోసారి అధ్యక్ష ఎన్నిక ఉంటుంది

వైసీపీ శాశ్వత అధ్యక్ష పదవిపై ప్రతిపాదనను వైఎస్ జగన్ తిరస్కరించారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పారు. 'ప్రస్తుతం ఆ తీర్మానం అమలులో లేదు. ఐదేళ్లకోసారి అధ్యక్ష ఎన్నిక ఉంటుంది. ఎన్టీఆర్ చావుకు కారణం చంద్రబాబు. ఎన్టీఆర్ పట్ల వైఎస్ జగన్‍కు ఎంతో అభిమానం ఉంది. ఎన్టీఆర్‍పై అభిమానంతోనే జిల్లాకు పేరు పెట్టాం. ఎన్టీఆర్‍ను చరిత్ర నుండే తీసేయాలనుకున్న వ్యక్తి చంద్రబాబు. ప్రతి అంశాన్ని టీడీపీ రాజకీయం చేయలనుకుంటోంది.' అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

22 September 2022, 13:17 IST

పలు చోట్ల వర్షం…

గురువారం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, బార్కాస్, మియాపూర్‌, చందానగర్, మదీనాగూడ, మాదాపుర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపుర్ ప్రాంతాల్లో పడిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రాజేంద్రనగర్, అత్తాపూర్, బండ్లగూడ జాగిర్, మణికొండ, నార్సింగి, శంషాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

22 September 2022, 12:24 IST

పరిస్థితి ఉద్రిక్తం

జింఖానా గ్రౌండ్స్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా గేట్లు విరగ్గొట్టి దూసుకు రావడంతో కొందరు కిందపడి పోయారు. దీంతో కొందరు స్పృహతప్పి పడిపోయారు. వెంటనే పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా అదుపు తప్పడంతో పోలీసులు క్రికెట్ అభిమానులపై లాఠీ ఛార్జీ చేశారు. ఒక్కసారిగా గేట్లు తెరవడంతో వందల సంఖ్యలో వచ్చిన క్రికెట్ ఫ్యాన్స్ దూసుకు వచ్చారు.

 

22 September 2022, 12:14 IST

ఇవాళ బీజేపీ సభ..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన నాల్గో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేటితో ముగియనుంది. హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్ పేట ఓఆర్ఆర్ సమీపంలోని ఎల్పీటీ పార్కింగ్ గ్రౌండ్ లో సాయంత్రం నాలుగు గంటలకు ముగింపు సభ ప్రారంభం కానుంది.సభకు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి హాజరుకానున్నారు

22 September 2022, 11:02 IST

గోవా టూర్ ప్యాకేజీ

irctc tourism announced goa tour package: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా హైదరాబాద్ నుంచి గోవాలోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'GOAN DELIGHT' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ లో పలు టూరిజం స్పాట్లను చూపించనుంది. నవంబర్ 24వ తేదీన ఈ టూర్ అందుబాటులో ఉంది. 3 రాత్రులు 4 రోజుల టూర్ ప్యాకేజీ.

22 September 2022, 10:05 IST

బీజేపీ సభ

ఇవాళ బండి సంజయ్ నాల్గొ విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగియనుంది. ఈ మేరకు పెద్ద అంబర్ పేట్ వద్ద బహిరంగ సభను తలపెట్టారు.

22 September 2022, 10:05 IST

త్వరలోనే నిర్ణయం..!

అనధికార లేఅవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై తెలంగాణ ప్రభుత్వం మరోసారి దృష్టిసారించింది. గతంలో ఎల్ఆర్ఎస్ నిబంధన తీసుకురావటంతో ఆగిపోయిన ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ... మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది. రాబడి పెంచుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది సర్కార్... అనుమతులు లేని లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌పై ఉన్న నిషేధాన్ని సడలించాలని భావిస్తోందని సమాచారం. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

22 September 2022, 8:10 IST

సర్కార్ నిర్ణయంపై ఆగ్రహం

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పు ఏపీలో హాట్ హాట్ గా మారింది. జగన్ ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మహానేత అయిన ఎన్టీఆర్ పేరు మార్చటం సరికాదని అంటున్నారు. ఇక టీడీపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు. ఇక ఎన్టీఆర్ కుటుంబం కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించింది. మరోవైపు బీజేపీ, జనసేనతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా సర్కార్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇదే విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు.

22 September 2022, 8:10 IST

దేశవ్యాప్తంగా సోదాలు..

తెలంగాణలో మరోసారి ఎన్‌ఐఏ సోదాలు  చేపట్టింది.  కర్ణాటక (Karnataka) ,కేరళ (Kerala), యూపీ (UP) రాష్ట్రాలతో పాటు తెలంగాణలో సోదాలు జరుగుతున్నాయి. పీఎఫ్ఐ కేసుకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నాయి.

22 September 2022, 7:05 IST

నేటి నుంచే బతుకమ్మ చీరలు…

ఇవాళ్టి నుంచి తెలంగాణ సర్కార్ బతుకమ్మ చీరలను ప్రారంభించనుంది. సిరిసిలల్లో మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా కోటికి పైగా చీరలు పంచే అవకాశం ఉంది.

22 September 2022, 7:03 IST

తీవ్ర అసంతృప్తి

ఎన్టీఆర్‌ పేరు మార్పుపై నందమూరి కుటుంబం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.  ఈ పరిణామంపై స్పందిస్తూ నందమూరి రామకృష్ణ పేరుతో నందమూరి కుటుంబం ప్రకటన విడుదల చేసింది. హెల్త్‌ యూనివర్శిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగించడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొంది.

22 September 2022, 7:01 IST

ఇవాళ నుంచే టికెట్లు…

నగరంలోని జింఖానా గ్రౌండ్‌లో జరిగే భారత్‌- ఆస్ట్రేలియా మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను ఇవాళ్టి నుంచి విక్రయిస్తామని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్ (హెచ్‌సీఏ) వెల్లడించింది. గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఆఫ్‌లైన్‌లో టికెట్లు విక్రయం జరుగుతుందని తెలిపింది.

    ఆర్టికల్ షేర్ చేయండి