TS Electricity charges: ప్రజలకు ఊరట.. వచ్చే ఏడాది కరెంట్ ఛార్జీలు పెరగవు!
01 December 2022, 8:50 IST
- Electricity charges Updates: ఎన్నికల ఏడాది ప్రజలపై కరెంట్ భారం తగ్గనుంది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో కరెంటు చార్జీలు పెంచబోమని విద్యుత్తు పంపిణీ సంస్థలు ప్రకటించాయి.
విద్యుత్ ఛార్జీలు
Electricity Charges in Telangana: వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కరెంట్ ఛార్జీల విషయంలో ప్రజలకు ఊటర దొరకనుంది. ఈ మేరకు విద్యుత్ పంపిణీ సంస్థలు కీలక ప్రకటన చేశాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24)లో రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను పెంచకుండా ఇప్పుడున్నట్టుగానే కొనసాగించాలని నిర్ణయించాయి. ఈ మేరకు ప్రస్తుత రిటైల్ టారిఫ్ను యథాతథంగా కొనసాగించాలంటూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(Electricity Regulatory Commission)కి ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ( టీఎస్ఎనీ్పడీసీఎల్/ టీఎస్ఎస్పీడీసీఎల్)లు ప్రతిపాదించాయి. సంస్థల ఆదాయ, వ్యయాల లెక్కలతో వచ్చే ఏడాదికి ‘వార్షిక ఆదాయ అవసరాల’ (ఏఆర్ఆర్) నివేదికలను ఉత్తర, దక్షిణ తెలంగాణ డిస్కంల సంచాలకులు గణపతి, స్వామిరెడ్డిలు బుధవారం ఈఆర్సీ ఛైర్మన్ శ్రీరంగారావుకు అందజేశారు.
రూ. 10 వేల కోట్లకు పైగా లోటు…
రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేసేందుకు రూ.2023–24లో రూ.54,060 కోట్ల వ్యయం అవుతుందని ఈఆర్సీ ఛైర్మన్ శ్రీరంగారావు చెప్పారు. ప్రస్తుతం ఉన్న కరెంట్ చార్జీలను యథాతథంగా అమలుచేస్తే రూ.43,525 కోట్లు మాత్రమే వస్తాయని రెండు డిస్కంలు అంచనా వేసినట్టు వెల్లడించారు. రూ.10,535 కోట్ల లోటు వస్తుండగా.. ఆ మేరకు విద్యుత్ సబ్సిడీలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని ఆశిస్తున్నట్టుగా పేర్కొన్నాయని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో అమలవుతున్న ఫ్రీ కరెంట్, ప్రతినెలా ఎస్సీ, ఎస్టీల గృహాలకు 101 యూని ట్లు, క్షౌరశాలలు, లాండ్రీలకు 250 యూని ట్ల వరకు ఉచిత విద్యుత్, పవర్ లూమ్స్, పౌల్ట్రీఫారాలు, స్పిన్నింగ్ మిల్లులకు యూనిట్పై రూ.2 రాయితీ పథకాలపై కూడా కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది కూడా యథాతథంగా వీటిని అమలు చేయనున్నట్లు ఆయా డిస్కంలు ప్రతిపాదనల్లో తెలిపాయని వెల్లడించారు.
ప్రస్తుత విద్యుత్ చార్జీలనే వచ్చే ఏడాది కూడా కొనసాగించాలని డిస్కంలు ప్రతిపాదించినప్పటికీ.. వాటిపై సమీక్షిస్తామని ఈఆర్సీ ఛైర్మన్ శ్రీరంగారావు చెప్పారు. ఆర్థిక పరిస్థితులను పరిశీలించిన తర్వాత అవసరమైన మేర చార్జీల తగ్గింపు లేదా పెంపుపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. డిస్కంల ప్రతిపాదనలను ఈఆర్సీ వెబ్సైట్లో పెట్టి, అన్నివర్గాల వినియోగదారుల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరిస్తామన్నారు. బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిన అనంతరం ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. ప్రార్థన స్థలాలు, ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్ చార్జీలను తగ్గించాలన్న విజ్ఞప్తులు తమ పరిశీలనలో ఉన్నాయని, ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు.