తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Maharashtra Cm: ప్రధాని మోదీ ముందుకు మహారాష్ట్ర సీఎం పంచాయితి..! మోదీ మాటే ఫైనల్ అన్న షిండే

Maharashtra CM: ప్రధాని మోదీ ముందుకు మహారాష్ట్ర సీఎం పంచాయితి..! మోదీ మాటే ఫైనల్ అన్న షిండే

Sudarshan V HT Telugu

Published Nov 27, 2024 08:07 PM IST

google News
  • Maharashtra CM: మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎంగా తమ నేత ఏక్ నాథ్ షిండే నే కొనసాగాలని శివసేన వర్గం కోరుతుండగా, దేవేంద్ర ఫడణవీస్ వైపు బీజేపీ సీనియర్ నేతలు మొగ్గు చూపుతున్నారు. చివరకు బాల్ ప్రధాని మోదీ కోర్టుకు చేరింది.

మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరు? (ANI file photo)

మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరు?

Maharashtra CM: మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. దేవేంద్ర ఫడణవీస్ (బీజేపీ), ఏక్ నాథ్ షిండే (శివసేన) ల మధ్య సీఎం పదవి విషయంలో గట్టిపోటీ నెలకొని ఉంది.


మోదీ మాటే ఫైనల్

కాగా, ఈ విషయంలో బుధవారం శివసేన నేత ఏక్ నాథ్ షిండే కొంత స్పష్టతనిచ్చారు. మహాయుతి కూటమి నుంచి ఎవరిని సీఎంగా ఎంపిక చేయాలనే నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కి కూటమి నేతలు అప్పగించారు. ప్రధాని మోదీ నిర్ణయమే ఫైనల్ అని, ఆ నిర్ణయాన్ని తామంతా అంగీకరిస్తామని ఏక్ నాథ్ షిండే చెప్పారు. ముంబైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏక్ నాథ్ షిండే మాట్లాడుతూ ప్రధాని మోదీ తమ కుటుంబ పెద్ద అని అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ నాయకత్వం తనను అడ్డంకిగా భావించరాదని ఆయన అన్నారు. తన వల్ల మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ఏదైనా సమస్య వస్తుందని ఎలాంటి సందేహం పెట్టుకోవద్దని, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం తనకు ఆమోదయోగ్యమేనని ప్రధానికి చెప్పానని షిండే వెల్లడించారు. ‘‘నన్ను అడ్డంకిగా చూడొద్దని ప్రధాని మోదీకి, అమిత్ షాకు చెప్పాను. వారు ఏ నిర్ణయం తీసుకున్నా నేను కట్టుబడి ఉంటాను’’ అని చెప్పారు. మహారాష్ట్ర సీఎం పదవికి సంబంధించి బీజేపీ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా తమ పార్టీ మద్దతు ఇస్తుందని షిండే చెప్పారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిర్ణయానికి తను, శివసేన కట్టుబడి ఉంటుందని ఆయన చెప్పారు.

నేనెప్పుడూ సామాన్యుడినే..

తాను సామాన్యుడిగానే పనిచేశానని, తనను తాను ఎప్పుడూ ముఖ్యమంత్రిగా భావించలేదని షిండే అన్నారు. తాను నిరుపేద కుటుంబం నుంచి వచ్చానని, రాష్ట్ర ప్రజల బాధలు, కష్టాలను అర్థం చేసుకోగలనని, వారి కష్టాలు తీర్చడమే తన లక్ష్యమని చెప్పారు. ఒక సీఎంగా శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే, ప్రధాని మోదీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించానని చెప్పారు. ‘‘గత రెండున్నరేళ్లలో నేను చేసిన పనులతో చాలా సంతృప్తిగా ఉన్నాను. నేను కలత చెందే రకం కాదు. ప్రజల కోసం పోరాడే, పోరాడే వ్యక్తిని’’ అని ఆయన అన్నారు. ఏక్ నాథ్ షిండే బుధవారం మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీ (narendra modi), అమిత్ షాలతో మహాకూటమి మిత్రపక్షాల సమావేశం కూడా జరగనుంది.

షిండేకు థాంక్స్

కాగా, సీఎం పదవిపై ఏక్ నాథ్ షిండే వైఖరికి మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్ కులే కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఆయన ఎప్పుడూ కేంద్ర నాయకత్వాన్ని గౌరవించారు. పాటించారు. బీజేపీ కేంద్ర నాయకత్వం ఇచ్చిన ప్రతి సూచనను ఆయన పాటించారు. ఆయన నిజమైన మహాకూటమి నాయకుడిగా వ్యవహరించారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు, అభినందనలు’’ అన్నారు.

బిహార్ పద్ధతిలో..

మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని మహాయుతి కూటమి విజయం సాధించిన తరువాత సీఎం పీఠం కోసం ఏక్ నాథ్ షిండే (eknath shinde), బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఇద్దరూ పోటీ పడ్డారు. మరోవైపు, సంకీర్ణంలో చిన్న భాగస్వామిగా ఉన్నప్పటికీ నితీశ్ కుమార్ (nitish kumar) ను బిహార్ ముఖ్యమంత్రిగా బీజేపీ కొనసాగించడాన్ని శివసేన (షిండే) వర్గం గుర్తు చేస్తోంది. అదే తరహాలో మహారాష్ట్రలో శివసేనకే ఈ పదవిని ఇవ్వాలని డిమాండ్ చేసింది. అయితే బిహార్ (bihar) ఫార్ములా మహారాష్ట్రకు వర్తించదని బీజేపీ చెబుతోంది. ‘‘నితీష్ కుమార్ ను సీఎం చేస్తామని ఎన్నికలకు ముందు ప్రకటన చేశారు. మహారాష్ట్రలో శివసేన (shiv sena) కు అలాంటి హామీ ఏమీ ఇవ్వలేదు. కాబట్టి మహారాష్ట్రలో దీన్ని పునరావృతం చేసే ప్రసక్తే లేదు’’ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రేమ్ శుక్లా తెలిపారు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.