'కండోమ్లు ఎక్కువగా వాడుతున్నది ముస్లింలే.. జనాభా పెరగడం లేదు'
09 October 2022, 13:56 IST
Owaisi on RSS Chief's remarks : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మధ్య మాటల యుద్ధం నడుస్తున్నట్టు కనిపిస్తోంది. జనాభా నియంత్రణపై భగవత్ చేసిన వ్యాఖ్యలను ఓవైసీ తిప్పికొట్టారు.
అసదుద్దీన్ ఓవైసీ
Owaisi on RSS Chief's remarks : దేశంలో ముస్లింల జనాభా పెరగడం లేదని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. ముస్లింలే కండోమ్లను ఎక్కువగా వాడుతున్నారని అన్నారు. జనాభా నియంత్రణపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను తిప్పి కొడుతూ ఈ మేరకు మాట్లాడారు ఓవైసీ.
"ముస్లింల జనాభా పెరగడం లేదు. తగ్గుతోంది. ముస్లిం పిల్లల మధ్య గ్యాప్ కూడా పెరుగుతోంది. కండోమ్లు ఎక్కువగా ఎవరు వాడుతున్నారు? ముస్లింలే. ఈ విషయంపై మోహన్ భగవత్ మాట్లాడటం లేదు," అని తాను చేసిన ట్వీట్లో వ్యాఖ్యానించారు అసదుద్దీన్ ఓవైసీ.
'జనాభాను నియంత్రించాలి..'
Owaisi vs Mohan Bhagwat : ఇటీవలే జరిగిన ఆర్ఎస్ఎస్ సభలో జనాభా నియంత్రణ అంశంపై మోహన్ భగవత్ మాట్లాడారు. అందరికి సమానంగా వర్తించే ఒక విధానాన్ని తీసుకొచ్చి.. దేశంలో జనాభాను నియంత్రించాలని పిలుపునిచ్చారు. జనాభా నియంత్రణతో పాటు మతపరమైన అసమతుల్యతను తొలగించాలని, బలవంతపు మత మార్పిడీలను అడ్డుకోవాలని ప్రసంగించారు.
మోహన్ భగవత్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు అసదుద్దీన్ ఓవైసీ. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5ని ఉటంకిస్తూ.. ముస్లింలలో టీఆర్ఎఫ్(టోటల్ ఫర్టిలిటీ రేట్) భారీగా తగ్గిందని గుర్తుచేశారు. ముస్లింల గురించి కాకుండా.. తప్పిపోతున్న హిందూ బాలికల సమస్యపై దృష్టిపెట్టాలని హితవు పలికారు ఓవైసీ.
Asaduddin Owaisi on muslim population : "2000-2019 మధ్య అనేక మంది హిందూ బాలికలు తప్పిపోయారు. ఇది ప్రభుత్వ లెక్కల్లో ఉంది. కానీ మోహన్ భగవత్ దీని గురించి మాట్లాడటం లేదు. భారత జాతీయవాదానికి.. సవాలు విసురుతున్నారు. ఇది దేశానికే వ్యతిరేకం," అని అసదుద్దీన్ ఓవైసీ అభిప్రాయపడ్డారు.
బీజేపీ ఎక్కడ ప్రభుత్వంలో ఉంటే.. అక్కడ ముస్లింలు జైల్లో జీవిస్తున్నట్టుగా భావిస్తున్నారని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. గుజరాత్లో ముస్లింలను స్తంభానికి కట్టేసి కొట్టారని, ప్రధాని మాత్రం మౌనంగా ఉన్నారని మండిపడ్డారు.
Asaduddin Owaisi news : "గర్భా సమయంలో కొందరు ముస్లింలను స్తంభానికి కట్టేసి కొట్టారు. ఇది ప్రధాని మోదీకి చెందిన గుజరాత్లో జరిగింది. ఇదేనా దేశంలో ఉన్న గౌరవం? పోలీసు వ్యవస్థను మూసేయండి. కోర్టులను మూసేయండి," అని ఓవైసీ విమర్శించారు.