Maharashtra: "అందుకే.. ఉద్ధవ్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేం": సుప్రీం కీలక తీర్పు.. షిండే ప్రభుత్వానికి తప్పిన గండం
11 May 2023, 13:08 IST
- Maharashtra Political Crisis: ఏక్నాథ్ షిండే ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు సుప్రీం నిరాకరించింది. ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని పునరుద్ధరించేందుకు అంగీకరించలేదు.
Maharashtra: షిండే ప్రభుత్వానికి తప్పిన గండం.. ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సుప్రీం నిరాకరణ
Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై సుప్రీం కోర్టు (Supreme Court) గురువారం కీలక తీర్పు వెలువరించింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (Eknath Shinde) తన ప్రభుత్వాన్ని కొనసాగించుకునేలా దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పుచెప్పింది. విశ్వాసపరీక్ష ఎదుర్కోకుండానే ఉద్ధవ్ థాక్రే (Uddhav Thackeray) ముఖ్యమంత్రి పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేసినందున.. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేమని సుప్రీం స్పష్టం చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్యంలోని ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది. గతేడాది జూన్లో ఉద్ధవ్ థాక్రే సీఎంగా ఉన్న సమయంలో శివసేన పార్టీపై తిరుగుబాటు చేసిన షిండేతో 15 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేమని చెప్పింది. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై ఏక్నాథ్ షిండే, ఉద్ధవ్ వర్గాలు దాఖలు చేసిన పలు పిటిషన్లను కొన్ని నెలల పాటు విచారించింది సుప్రీం కోర్టు. ఇప్పుడు తీర్పు వెలువరించింది. అప్పటి గవర్నర్ కోశ్యారీ తీరుపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది.
Maharashtra Political Crisis: గతేడాది జూన్లో 15 మంది ఎమ్మెల్యేలతో పాటు ఏక్నాథ్ షిండే.. శివసేన నుంచి బయటికి వచ్చారు. పార్టీపై తిరుగుబాటు చేశారు. దీంతో ఉద్ధవ్ సీఎంగా ఉన్న మహా వికాస్ అఘాడీ (శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్) ప్రభుత్వ మెజార్టీ తగ్గింది. విశ్వాస పరీక్ష ఎదుర్కోకుండానే శివసేన చీఫ్ ఉద్ధవ్ రాజీనామా చేశారు. అనంతరం బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఏక్నాథ్ షిండే. ఆ తర్వాత షిండే, ఉద్ధవ్ వర్గాలు పలు పిటిషన్లను సుప్రీం కోర్టులో దాఖలు చేశాయి. వాటిపై ఇప్పుడు తీర్పు చెప్పింది న్యాయస్థానం.
గవర్నర్ నిర్ణయం సరైనది కాదు
Maharashtra Political Crisis: గతేడాది జూన్ 30న మెజారిటీని నిరూపించుకోవాలని ఉద్ధవ్ థాక్రేను అప్పటి గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆదేశించడం ఏక్నాథ్ షిండేకు సాయం చేసిందని సుప్రీం కోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ఉద్ధవ్కు మెజార్టీ లేదని గవర్నర్ ఏ ఆధారంగా ఊహించుకున్నారని ప్రశ్నించింది. “మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం మెజార్టీ కోల్పోయిందని నిర్ణయించుకునేందుకు గవర్నర్ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. అందుకే ఆయన నిర్ణయం సరైనది కాదు. ఎమ్మెల్యేలు మద్దతును ఉపసంహరించుకుంటామన్నట్టుగా గవర్నర్ విడుదల చేసిన తీర్మానంలో లేదు” అని సుప్రీం పేర్కొంది.
Maharashtra Political Crisis: పార్టీ అంతర్గత విభేదాలను పరిష్కరించడానికి విశ్వాస పరీక్షను ఉపయోగించుకోకూడని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. శివసేన విప్గా గోగవలేను స్పీకర్ నియమించడం కూడా అక్రమమని పేర్కొంది. రాజకీయ పార్టీ సూచించిన వ్యక్తినే విప్గా స్పీకర్ గుర్తించాల్సి ఉందని సూచించింది.
2016 నాబమ్ రెబియా కేసును ప్రస్తావిస్తూ.. స్పీకర్ వద్ద పెండింగ్లో ఉన్న సమయంలో ఎమ్మెల్యేల అనర్హతపై ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీం కోర్టు చెప్పింది.