Karnataka Election Schedule: కర్ణాటక ఎన్నికల షెడ్యూల్: మే 10వ తేదీన పోలింగ్
29 March 2023, 10:15 IST
Karnataka Election Schedule Live: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ నేడు (మార్చి 29) వెల్లడైంది. ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం (ECI) ప్రకటించింది. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారాన్ని నిలబెట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. జేడీఎస్ కీలకంగా వ్యవహరించనుంది. కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలకు గాను ఈ ఏడాది మేలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించేందుకు మీడియా సమావేశాన్ని భారత ఎన్నికల సంఘం నేటి ఉదయం 11.30 గంటలకు ప్రారంభించింది. తేదీలను వెల్లడించింది. ఈ అంశంపై తాజా అప్డేట్లను ఇక్కడ చూడండి.
58వేల పోలింగ్ స్టేషన్లు
మే 10వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కోసం 224 నియోజకవర్గాల్లో 58,282 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఇందులో 1320 పోలింగ్ కేంద్రాల్లో అందరూ మహిళా అధికారులే ఉంటారు.
కర్ణాటక ఎన్నికల పూర్తి షెడ్యూల్ ఇదే
ఏప్రిల్ 13వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్ల దాఖలు ఏప్రిల్ 20న పూర్తవుతుంది. 21 ఏప్రిల్ నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉప సంహరణకు ఏప్రిల్ 24వ తేదీ వరకు గడువు ఉంటుంది. మే 10వ తేదీన పోలింగ్ జరుగుతుంది. మే 13వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది.
మే 10వ తేదీన పోలింగ్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మే 10వ తేదీన జరుగుతుందని సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు. కౌటింగ్ మే 13వ తేదీన జరగనుంది.
తొలిసారి ఇంటి నుంచే ఓటు
80 సంవత్సరాలు దాటి వృద్ధులు, దివ్యాంగులు.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకోవచ్చని సీఈసీ రాజీవ్ కుమార్ చెప్పారు. తొలిసారి ఇలాంటి విధానాన్ని అమలు చేస్తున్నామని అన్నారు.
మే 24న గడువు ముగుస్తుంది
ఈ ఏడాది మే 24న కర్ణాటక అసెంబ్లీ ప్రస్తుత గడువు ముగుస్తుందని ఎన్నికల సంఘం పేర్కొంది.
మీడియా సమావేశం మొదలు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు మీడియా సమావేశాన్ని భారత ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఎన్నికల తేదీలను సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించనున్నారు.
మళ్లీ మాదే అధికారం: సీఎం
రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకుంటామని ముఖ్యమంత్రి, బీజేపీ నేత బస్వరాజు బొమ్మై అన్నారు. అన్ని వర్గాలకు తాము సామాజిక న్యాయం, సంక్షేమం అందిస్తున్నామని అన్నారు. మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ అగ్రనేతలు కర్ణాటకపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే మోదీ, అమిత్ షా పలుసార్లు కర్ణాటకలో పర్యటించారు. ఈ ఏడాది ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ హోరాహోరీగా ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ ఏర్పాటులో జేడీఎస్ కీలక పాత్ర పోషిస్తుందన్న అంచనాలు ఉన్నాయి.
కాంగ్రెస్ తొలి జాబితా
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఇటీవలే అభ్యర్థుల తొల జాబితాను విడుదల చేసింది. 124 స్థానాలను అభ్యర్థులను ఖరారు చేసింది.
ప్రస్తుతం ఇలా..
కర్ణాటకలో ప్రస్తుతం అధికార బీజేపీకి 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ తరఫున 75 మంది, జేడీఎస్కు 28 ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఓటర్లు ఇలా..
కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 5.21 కోట్ల మంది ఓటు వేయాల్సి ఉంది. ఇందులో 2.59 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 9.17 లక్షల మంది కొత్త ఓటర్లు యాడ్ అయ్యారు.
నేటి ఉదయం 11.30 గంటలకు..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం (EC) నేడు వెల్లడించనుంది. తేదీలను ప్రకటించనుంది. కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అధికార బీజేపీ మళ్లీ గెలువాలని పట్టుదలగా ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ.. తిరిగి అధికారం చేజిక్కించుకోవాలని కృషి చేస్తోంది. జేడీఎస్ కూడా కీలకంగా ఉంది.