IRCTC Andaman Tour : అండమాన్ దీవుల్లో ఎంజాయ్ చేసి రావొచ్చు ఇలా..
08 November 2022, 20:00 IST
- IRCTC Tour Package : అండమాన్ దీవులకు వెళ్లాలనుకునేవారికి ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. బంగాళాఖాతంలో ఉన్న ఈ దీవుల్లో ఎంజాయ్ చేసి రావొచ్చు. ఇందుకోసం టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది.
ప్రతీకాత్మక చిత్రం
అండమాన్ దీవులను చూడాలనుకునే వారి కోసం ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ ప్రకటించింది. తెల్లని ఇసుక తిన్నెలతో ఆహ్లాదకరంగా కనిపించే బీచ్లు చూడాలనుకుంటే తప్పకుండా ఈ దీవులకు వెళ్లి ఎంజాయ్ చేసి రావొచ్చు. ANDAMAN EMERALDS EX VISHAKHAPATNAM పేరుతో ప్యాకేజీ ప్రకటించింది. 5 రాత్రులు, ఆరు రోజుల టూర్ ప్యాకేజీ ఇది. HAVELOCK, PORT BLAIRలాంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. ఫ్లైట్లో వెళ్లాలి. జనవరి 28, 2023న ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది.
మెుదటి రోజు విశాఖపట్నం(Visakhapatnam) నుంచి 08:40 గంటలకు ఫ్లైట్ బయలుదేరుతుంది. 12:50 గంటలకు పోర్ట్ బ్లెయిర్ వెళ్తారు. హోటల్లో చెక్ ఇన్ అవుతారు. మధ్యాహ్నం సెల్యులార్ జైలు, కార్బిన్స్ కోవ్ బీచ్ సందర్శి్స్తారు. తర్వాత సెల్యులార్ జైలులో లైట్, సౌండ్ షో(Sound Show) చూడొచ్చు. పోర్ట్ బ్లెయిర్(PORT BLAIR)లోనే రాత్రి భోజనం, బస ఉంటుంది. రెండోరోజు హోటల్ లో అల్పాహారం చేసి.. రాస్ ఐలాండ్ బయలుదేరుతారు. తర్వాత నార్త్ బే సందర్శన ఉంటుంది. భోజనం తర్వాత నేవల్ మెరైన్ మ్యూజియం సందర్శిస్తారు. పోర్ట్ బ్లెయిర్లో రాత్రి భోజనం, బస ఉంటుంది.
మూడోరోజు అల్పాహారం చేసి హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. హావ్లాక్(HAVELOCK) ద్వీపానికి తీసుకెళ్తారు. అక్కడ , హోటల్లో చెక్ ఇన్ అవ్వాలి. ఎలిఫెంట్ బీచ్కి వెళ్లి వాటర్ స్పోర్ట్ ఎంజాయ్ చేయోచ్చు. సాయంత్రం రాధానగర్ బీచ్ సందర్శన ఉంటుంది. హావ్లాక్ ద్వీపంలో రాత్రి బస చేస్తారు. నాలుగోరోజు హోటల్ లో అల్పాహారం చేసి.. చెక్ అవుట్ చేయాలి. తర్వాత కాలాపత్తర్ బీచ్(Kala Pathar Beach) సందర్శన ఉంటుంది. నీల్ ద్వీపం కోసం ప్రీమియం క్రూయిజ్ ఎక్కాలి. అక్కడకు చేరుకున్న తర్వాత హోటల్కు వెళ్లి చెక్ ఇన్ చేయాలి. రిఫ్రెష్ అయిన తర్వాత సహజ వంతెన, లక్ష్మణపూర్ బీచ్ సందర్శన ఉంటుంది. నీల్ ద్వీపంలోనే రాత్రి డిన్నర్, బస ఉంటుంది.
ఐదోరోజు ఉదయాన్నే భరత్పూర్ బీచ్లో సూర్యోదయాన్ని ఆస్వాదించొచ్చు. అల్పాహారం ముగించుకుని హోటల్ నుండి చెక్ అవుట్ చేయాలి. క్రూయిజ్ ద్వారా పోర్ట్ బ్లెయిర్(Port Blair)కు బయలుదేరాలి. విశ్రాంతి, షాపింగ్ కోసం టైమ్ ఉంటుంది. పోర్ట్ బ్లెయిర్లోనే రాత్రి భోజనం, బస ఏర్పాటు చేస్తారు. ఆరో రోజు హోటల్ లో అల్పాహారం చేసి చెక్అవుట్ చేయాలి. 07:45 గంటలకు విశాఖపట్నం వెళ్లే విమానం ఉంటుంది. 11:50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు.
ఈ టూర్ ప్యాకేజీలో ధరలు చూసుకుంటే.. సింగిల్ ఆక్యూపెన్సీ కోసం ధర రూ.63525గా నిర్ణయించారు. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.47270గా ఉంది. ట్రిపుల్ ఆక్యూపెన్సీకి రూ.45765గా ఉంది. హోటల్, ఫుడ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ లాంటివి ఈ ప్యాకేజీలో కవర్ అవుతాయి.