AP Govt On Employees Retirement Age: ఆ వార్తలన్నీ ఫేక్.. క్లారిటీ ఇచ్చిన ఏపీ సర్కార్
28 January 2023, 16:18 IST
- Employees Retirement Age News: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంచినట్లు వచ్చిన వార్తలపై సర్కార్ స్పందించింది. అవన్నీ తప్పుడు వార్తలన్నీ స్పష్టం చేసింది. బాధ్యులపై చర్యలకు సిద్ధమైంది.
పదవీ విరమణ వయసు పెంపుపై సర్కార్ క్లారిటీ
AP Govt On Employees Retirement Age: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయో పరిమితిని మరో ఏడాది పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఉద్యోగ వర్గాల్లో కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న రిటైర్మెంట్ వయసును మరో ఏడాది పెంచాలని ప్రభుత్వం భావిస్తోందని.. తుది నిర్ణయం తీసుకోకపోయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలోనే ఈ ఆలోచన చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అంతేకాదు రిటైర్మెంట్(పదవీ విరమణ) వయసు 62 నుండి 65కు పెంచినట్లు కూడా కొన్ని వార్తలు సర్క్యూలెట్ అయ్యాయి. ఆయా వార్తలపై ఏపీ సర్కార్ క్లారిటీ ఇచ్చింది.
విచారణకు ఆదేశాలు..
ఈ వార్తలపై గుంటూరుకు డీఐజీకీ ఆర్థిక శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేసు నమోదు విచారణ జరిపించాలని ఎస్పీని ఆదేశించారు. మరోవైపు ప్రభుత్వం ఉద్యోగుల పదవి విరమణ వయస్సును 62 నుండి 65 సంవత్సరాలకు పెంచినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల సమాఖ్య ఛైర్మన్ వెంకటరామిరెడ్డి. ప్రచారంలో ఉన్న జీవో నకిలీది అని అన్నారు. ఉద్యోగులెవరూ కూడా ఈ ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇప్పటి వరకు రెండుసార్లు ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును పెంచారు. 2014 జూన్లో అప్పటి టీడీపీ ప్రభుత్వం 58ఏళ్ల నుంచి రిటైర్మెంట్ వయసును 60ఏళ్లకు పెంచింది. 2019లో అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పిఆర్సీ, డిఏ పెంపులపై ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగాయి. ఉద్యోగ సంఘాల నుంచి ఒత్తిడి పెరిగిన సమయంలో అనూహ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 62ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు వార్తలు చర్చనీయాంశంగా మారింది. ఈ వార్తలు.. ఉద్యోగ వర్గాల్లో గందరగోళానికి గురి చేశాయి. మరో ఏడాది పెంచడం వెనుక చెల్లింపుల భారాన్ని వాయిదా వేయడానికే అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు ఆర్ధిక ప్రయోజనాలను చెల్లించాల్సి ఉండటం, ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ఖజానాలో అందుకు సరిపడా నగదు లభ్యత లేకపోవడంతో మరో ఏడాది పాటు పదవీ విరమణ వయసును వాయిదా వేయాలని సర్కార్ యోచిస్తోందేమో అన్న అభిప్రాయాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్పందించిన సర్కార్… ఇవన్నీ కూడా ఫేక్ వార్తలనీ స్పష్టం చేసింది. ఈ వార్తలను నమ్మవద్దని ఉద్యోగులను కోరింది.