November 12 Telugu News Updates : రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ జాతికి అంకితం
12 November 2022, 22:00 IST
- తెలంగాణ, ఏపీ వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి. తాజా వార్తల కోసం రిఫ్రెష్ చేస్తూ ఉండండి.
బీచ్ లో పవన్,,
జనసేన అధినేత పవన్ విశాఖ బీచ్ లో గడిపారు. బీచ్ లో కాసేపు గడిపిన తర్వాత... రిషికొండను పరిశీలించారు. అక్కడ జరుగుతున్న తవ్వకాలను పరిశీలించారు. జనసేనకు చెందిన స్థానిక నేతలను కొందరిని వెంటేసుకుని అక్కడికి చేరుకున్న పవన్... బారీకేడ్ల ఆవతలి వైపు జరుగుతున్న పనులను పరిశీలించారు.
డేట్స్ రిలీజ్…
ఇంటర్ వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ప్రకటించింది తెలంగాణ ఇంటర్ బోర్డు. ఈనెల 14 నుంచి 30 వరకు ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఆలస్య రుసుము రూ.100 చెల్లించి డిసెంబరు 2 నుంచి 6వరకు చెల్లించవచ్చు. ఇక రూ.500 చెల్లించి డిసెంబరు 8 నుంచి 12 వరకు, రూ.వెయ్యి ఆలస్య రుసుముతో డిసెంబరు 14 నుంచి 17 వరకు, రూ.2వేలు చెల్లించి డిసెంబరు 19 నుంచి 22 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొంది.
కేటీఆర్ కామెంట్స్….
ఆధునిక భారతదేశంలో పరిశోధనాత్మక జర్నలిజం కొరవడిందన్నారు మంత్రి కేటీఆర్. మీడియా అకాడమీ ఆఫ్ తెలంగాణ భాగస్వామ్యంతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జాతీయ సెమినార్ ను నిర్వహించింది. "తెలంగాణలో మీడియా: గతం, వర్తమానం, భవిష్యత్తు’ అనే అంశంపై మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.... స్వరాష్ట్రం కోసం ఢిల్లీదాక వచ్చి తెలంగాణ జర్నలిస్టులు కొట్లాడారని గుర్తు చేశారు. ప్రతిరోజూ 13 పేపర్లు చదివే అలావాటు ఉందని... పత్రికలు చదవకుంటే ఏమీ తెలియదన్నారు. అయితే ప్రస్తుత రోజుల్లో చదివితే ఏదీ నిజమే తెలియదన్నట్లుగా పరిస్థితి మారిపోయిందని వ్యాఖ్యానించారు.• మీడియా కంటే కూడా అందులో పనిచేసే కలం వీరుల పనితనం గొప్పదని కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ షోయబ్ ఉల్లాఖాన్, సురవరం ప్రతాప్ రెడ్డి వంటి మహానీయులను స్మరించుకున్నారు.
చంద్రబాబు ఫైర్…
చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయించడంపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. తగలబెట్టడం కూలగొట్టడం వంటి సంప్రదాయ క్షుద్ర రాజకీయం నుంచి వైసీపీ ఇంకా బయటకు రాదా..? అని ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లా పుంగనూరు అనంతపురం జిల్లా గుంతకల్లులో జరిగిన రెండు ఘటనలు.. వైసీపీ రాక్షస రాజకీయానికి నిదర్శనమని మండిపడ్డారు.
అలా చేసే ప్రసక్తే లేదు…
బొగ్గు గనులపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదన్నారు. హైదరాబాద్ నుంచి కొందరు రెచ్చగొడుతున్నారని అన్నారు. ఇందులో కేంద్రం వాటా 49 శాతం మాత్రమేని స్పష్టం చేశారు. ప్రైవేటీకరించటం కేంద్రం చేతిలో లేదని.. రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుందన్నారు. సింగరేణిలో తెలంగాణ ప్రభుత్వం వాటా 51 శాతమని చెప్పారు.
జాతికి అంకితం…
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. ఈ కార్యక్రమంలో గవర్నర్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు.
బహిరంగ సభలో మోదీ
రామగుండంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రదాని మోదీ పాల్గొన్నారు. అంతకుముందు ఎరువుల కర్మాగారాన్ని మోదీ పరిశీలించారు.
రామగుండంలో మోదీ…
ప్రధాని మోదీ రామగుండం చేరుకున్నారు. 03.10 నిమిషాలకు హెలికాప్టర్ లో చేరుకున్న ఆయన… పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.
రామగుండానికి మోదీ…
కాసేట్లో ప్రధాని మోదీ రామగుండం చేరుకోనున్నారు. మధ్యాహ్నం 03. 30 నిమిషాలకు రామగుండం ఎరువుల కంపెనీకి చేరుకునే అవకాశం ఉంది.
మోదీ వార్నింగ్…
బేగంపేటలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. అభివృద్ధి వ్యతిరేకులతో టీఆర్ఎస్ సర్కారు జతకట్టిందని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీ గా బంగారం పట్టివేత.
దుబాయ్ ప్రయాణీకుల వద్ద 3 కోట్ల విలువ చేసే 5.5 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో సీజ్ చేశారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారాన్ని పేస్టు గా మార్చి లోదుస్తుల లో దాచి తరలించే ప్రయత్నం చేశారు. అమీర్ ఖాన్, మహ్మద్ ఖురేషీ అనే ఇద్దరు ప్రయాణీకుల ప్రొఫైల్ పై అనుమానం కలగడం తో అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన కస్టమ్స్ బృందం. లోదుస్తుల లో దాచిన బంగారం గుట్టు ను రట్టు చేసిన అధికారులు. ఇద్దరిపై అక్రమ బంగారం రవాణా కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
త్వరలో ఏపీకి వందేభారత్ రైలు'
దేశంలోని అన్ని రైల్వేస్టేషన్లలో ప్రపంచ స్థాయి సదుపాయాలు కల్పిస్తున్నామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 'రూ. 446 కోట్లతో విశాఖ రైల్వేస్టేషన్ను ఆధునీకరణ చేపడుతున్నామని మంత్రి చెప్పారు. మోదీ నాయకత్వంలో వందే భారత్ రైలు కల సాకారమైందన్నారు. త్వరలోనే ఏపీకి కూడా వందేభారత్ రైలు వస్తుందన్నారు. 2014కి ముందు ఏపీకి రూ.986 కోట్లే వచ్చాయి. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో రూ.7032 కోట్లు వచ్చాయని అని విశాఖ సభలో చెప్పారు.
రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం
కేంద్రంతో తమ అనుబంధానికి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.
భారీగా తరలి వచ్చిన ప్రజలు
విశాఖపట్నం ఆంధ్రా యూనివర్శిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు నమూనాలను ప్రధాని మోదీ ఆసక్తిగా పరిశీలించారు.
ఏయూ ప్రాంగణం చేరుకున్న ప్రధాని, సిఎం
విశాఖపట్నంలో పలు జాతీయ ప్రాజెక్టులను వర్చువల్ పద్ధతిలో ప్రధాని మోదీ ప్రారంభించారు. మరికొన్ని నూతన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రూ.15వేల కోట్ల రుపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.
విశాఖ హెచ్బీ కాలనీ దగ్గర ఉద్రిక్తత
విశాఖ హెచ్బీ కాలనీ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. - స్టీల్ ప్లాంట్, కార్మిక, ప్రజా సంఘాల జేఏసీ నిరసన ర్యాలీ ప్రారంభించిన వెంటనే పోలీసులు అడ్డుకున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టారు. నిరసనకారులను ఆడ్డుకున్న పోలీసులు, అరెస్ట్ చేశారు.
విశాఖలో ప్రధానికి వ్యతిరేకంగా నిరసనలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ నిరసనకారులు ఆందోళనకు దిగారు. ప్రధాని పర్యటనను నిరసిస్తూ వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్న కార్మిక సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
తిరుమలలో ఎడతెరిపిలేని భారీ వర్షం
తిరుమలలో ఎడతెరిపిలేని భారీ వర్షం కురుస్తోంది. వర్షానికి తోడు చలితీవ్రతతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఆస్థాన మండపం వద్ద భారీ వృక్షం నేలకూలి కారు ధ్వంసం అయ్యింది. ఈ ప్రమాదం అర్థరాత్రి జరగడంతో ప్రమాదం తప్పింది. ఘాట్రోడ్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు.
ఏనుగుల దాడి
పార్వతీపురం జిల్లా కొమరాడ మండలం కళ్లికోటలో ఏనుగుల బీభత్సం సృష్టించాయి. ఏనుగుల గుంపు దాడిలో రైతు దాసరి గోవింద్ మృతి చెందాడు. ఏనుగుల దాడులతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు.
జగనన్న ఇళ్లు-పేదలకు కన్నీళ్లు….
నేటి నుంచి జగనన్న ఇళ్లు - పేదలందరికీ కన్నీళ్లు పేరుతో జనసేన కార్యక్రమం చేపట్టింది. జగనన్న ఇళ్ల పథకం అమలు తీరును జనసేన నేతలు పరిశీలించనున్నారు. రేపు విజయనగరం జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. గుంకలాంలో జగనన్న ఇళ్ల నిర్మాణాలను పరిశీలించనున్నారు. మూడు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు జనసేన సిద్ధమవుతోంది.
భద్రతా వలయంలో పెద్దపల్లి
ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా వలయంలో రామగుండం చిక్కుకుంది. ప్రధాని పర్యటన దృష్ట్యా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐదుగురు ఎస్పీలు, ఐదుగురు అడిషనల్ ఎస్పీలు, 25 మంది డీఎస్పీలు, 2,500 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. వామపక్షాల బంద్ పిలుపు నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కంపార్టుమెంట్లు నిండి క్యూలైన్లు వెలుపలకు వచ్చాయి. శ్రీవారి సర్వదర్శనానికి 40 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.66 కోట్లు లభించింది. శ్రీవారిని 57,104 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,351 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
విశాఖలో ప్రధాని మోడీ పర్యటన
విశాఖలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని మోడీతో కలిసి సీఎం జగన్ బహిరంగ సభలో పాల్గొంటారు. ఉదయం 10:10కి తూర్పు నౌకాదళ కమాండ్ సెంటర్ నుంచి ఏయూకు ప్రధాని చేరుకుంటారు. ఉదయం 10:30 గంటలకు ఏయూకు చేరుకునే ప్రధాని విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. రాయ్ పూర్-విశాఖ 6 లైన్ల ఎకానమిక్ కారిడార్ పనులకు శంకుస్థాపన చేస్తారు. విశాఖ పోర్టు- షీలానగర్ ప్రత్యేక రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు. గెయిల్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం అంగూల్ పైప్ లైన్ పనులు జాతికి అంకితం చేస్తారు. పాతపట్నం, నర్సన్నపేట, ఇచ్చాపురం, పర్లాకిమిడి రెండు లైన్ల రోడ్డు ప్రారంభిస్తారు. ఓఎన్జీసీ యు ఫీల్డ్ పనులు జాతికి అంకితం చేయనున్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ పనులకు ప్రారంభోత్సవం చేస్తారు.