Amaravati Farmers : అమరావతి రైతుల మహా పాదయాత్ర-2 ప్రారంభం…
12 September 2022, 9:55 IST
- Amaravati Farmers : మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర -2 వెంకటపాలెం గ్రామం నుంచి ప్రారంభమైంది. అమరావతి నుంచి అరసవిల్లి వరకు అమరావతి రైతులు, మహిళల ఐకాస దాదాపు వెయ్యి కిలోమీటర్ల పొడవున పాదయాత్ర నిర్వహించనున్నారు.
వెంకటపాలెం నుంచి అమరావతి రైతుల పాదయాత్ర ప్రారంభం
Amaravati Farmers అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్తో రాజధాని నిర్మాణం కోసం భూములు విరాళంగా ఇచ్చిన రైతులు, మహిళలు మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అమరావతి నుంచి అరసవిల్లి వరకు 12 జిల్లాల్లో మహా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. తొలుత ఏపీ పోలీసులు పాదయాత్రకు అనుమతి నిరాకరించినా హైకోర్టు జోక్యంతో పాదయాత్రకు అనుమతి లభించింది.
తొలిరోజు కృష్ణాయపాలెం, పెనుమాక మీదుగా మహా పాదయాత్ర సాగుతుంది. రాత్రికి మంగళగిరిలోని కల్యాణ మండపాల్లో రైతులు బస చేస్తారు. రైతుల పాదయాత్రలో వారికి మద్దతుగా పలువురు నేతలు పాల్గొననున్నారు. రాజకీయపక్షాలు కూడా రైతుల పాదయాత్రకు మద్దతు తెలపనున్నాయి.
Amaravati Farmers పాదయాత్రలో కామినేని శ్రీనివాస్, దేవినేని ఉమ, తులసిరెడ్డి, సీపీఐ నారాయణ, బోనబోయిన శ్రీనివాస్ పాల్గొంటున్నారు. రాజధాని కోసం రైతులతో కలిసి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రలో పాల్గొననున్నారు. దాదాపు 1000 కి.మీకు సాగనున్న అమరావతి రైతుల మహా పాదయాత్ర, నవంబర్ 11న శ్రీకాకుళంలోని అరసవల్లిలో ముగియనుంది.
Amaravati Farmers నేటితో అమరావతి రైతుల ఉద్యమానికి వెయ్యి రోజులు పూర్తి కానున్నాయి. వెంకటపాలెంలోని తిరుమల తిరుపతి దేవాలయంలో రైతుల పూజలు నిర్వహించారు. వందలాది మంది రైతులు, మహిళలు, ఐకాస నేతలు వెంటకపాలెం నుంచి యాత్రలో పాల్గొంటున్నారు. 60 రోజులపాటు పాదయాత్రకు రూపకల్పన చేశారు. 12 పార్లమెంట్ నియోజక వర్గాల పరిధిలో 45 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగనుంది.
రాజధాని రైతుల మహా పాదయాత్ర-2 సందర్భంగా వెంకటపాలెం శివారు టీటీడీ ఆలయంలో రైతులు పూజలు నిర్వహించారు. టీటీడీ ఆలయం నుంచి వెంకటపాలెం వైపు పాదయాత్ర సాగింది. పాదయాత్రలో రైతుల వెంట మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నడుస్తున్నారు.
రాజధాని పనులు ఆపేసి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నారని, భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం చేశారని, రాష్ట్రంలో వైసీపీ నేతలు ఎక్కడైనా గజం స్థలం ఇవ్వగలరా అని చింతమనేని ప్రశ్నించారు. మూడు రాజధానులు అయ్యే పనికాదని, జగన్కు ధైర్యం ఉంటే అమరావతిపై ఎన్నికలకు వెళ్లాలన్నారు. అసెంబ్లీ రద్దు చేసి అమరావతిపై ఎన్నికలకు వెళ్లాలని, పాదయాత్ర టీడీపీ నడిపిస్తుందనడంలో అర్థం లేదని, తాము నడిపిస్తే మా పార్టీ మొత్తం ఇక్కడే ఉండేదన్నారు.