One Crore Seized : మునుగోడులో భారీగా నగదు.. బీజేపీదేనా?
Munugode By Election : మునుగోడు ఉపఎన్నిక దగ్గర పడుతోంది. దీంతో ప్రధాన పార్టీలు ప్రలోభలకు తెరలేపుతున్నాయి. తాజాగా కోటి రూపాయల నగదును పోలీసులు సీజ్ చేశారు.
మునుగోడు(Munugode)లో ఎలాగైనా గెలవాలని చూస్తున్న పార్టీలు.. ప్రలోభలకు తెరలేపుతున్నాయి. తాజాగా మునుగోడులో కోటి రూపాయలను పట్టుకున్నారు పోలీసులు. మునుగోడు ఉప ఎన్నిక కోసం తీసుకొస్తున్న బీజేపీ(BJP)కి చెందిన కోటి రూపాయలుగా చెబుతున్నారు. మునుగోడు మండలం చల్మెడ చెక్ పోస్ట్ వద్ద పోలీసుల వాహన తనిఖీలు చేస్తుండగా ఈ నగదు పట్టుబడింది.
బీజేపీకి చెందిన నేత వాహనంగా తెలుస్తోంది. కోటి రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన బీజేపీ కౌన్సిలర్ భర్త వాహనంగా గుర్తించారు. డబ్బుపై పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
భారీగా హవాలా సొమ్ము
మరోవైపు మునుగోడుకు దగ్గరగానే ఉన్న హైదరాబాద్ నగరంలో హవాలా దందా నడుస్తుందా అన్నంతగా డబ్బు దొరుకుతోంది. ఇదంతా మునుగోడు(Munugode)కే వెళ్తుందా అని చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తు్న్నారు. జూబ్లీహిల్స్ లో 54 లక్షలు, మరోచోట 2.5కోట్ల రూపాయల హవాలా డబ్బు(Hawala Money) దొరికింది. బంజారాహిల్స్లో రూ.2 కోట్లు, చాంద్రాయణగుట్టలో రూ. 79 లక్షలు, జూబ్లీహిల్స్లో రూ. 2 కోట్లు ఇలా పట్టుబడుతూనే ఉంది. దీనిపై అధికారులు సైతం సీరియస్ గా ఉన్నారు. పది రోజుల వ్యవధిలోనే సుమారు 10 కోట్లకు పైగానే డబ్బు పట్టుబడింది.
మునుగోడు ఉపఎన్నిక(Munugode Bypoll)ల వేళ ఇంతటి డబ్బు పట్టుబడుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎవరికి వెళ్తోంది. ఎక్కడి నుంచి వస్తుందనే అంశాలపై ఆరా తీస్తున్నారు. అయితే ఇందులో గమ్మత్తైన విషయం ఏంటంటే.. పాత ఇనుప సామాన్ల వ్యాపారం చేసే ఓ వ్యక్తి దగ్గర కూడా భారీగా హవాలా నగదు దొరికినట్టుగా తెలుస్తోంది.
కిందటి నెల మాసబ్ట్యాంక్ దగ్గరలో షోయబ్ అనే వ్యక్తి వద్ద కోటి 24లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) మీరట్కు చెందిన ఇతను హైదరాబాద్(Hyderabad)లో పాత ఇనుప సామాన్ల వ్యాపారం చేస్తుంటాడు. ఇలా ఎవరెవరు హవాలా దందా సాగిస్తున్నారా అనే అంశంపై అధికారులు దృష్టి పెట్టారు. ఓ వైపు మునుగోడు ఉపఎన్నిక జరుగుతుంటే.. ఇంతటి సొమ్ము పట్టుబడుతుండటంతో అందరిలోనూ ప్రశ్నలు మెుదలయ్యాయి.
ఇంతటి హవాలా డబ్బు.. మునుగోడుకేనా అని జనాలు చర్చించుకుంటున్నారు. ఎవరి సొమ్ము.. ఎవరి దగ్గరకు వెళ్తుందని చర్చ మెుదలైంది. మరోవైపు పార్టీలు మునుగోడు ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఖర్చు కూడా భారీగానే ఉంటుందనే.. అభిప్రాయాలు ఉన్నాయి. ఈ డబ్బంతా అక్కడికే తరలిస్తున్నారా? అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.