Etela Rajender: నువ్వు 4 పార్టీలు మారలేదా..? రేవంత్ రెడ్డి పై ఈటల ఫైర్
etela rajender Vs revanth reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతూ రాజకీయంగా ఎదిగారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అంతరించిపోతోందని కామెంట్స్ చేశారు.
etela rajender fires on revanth reddy: కోమటిరెడ్డి రాజీనామా వ్యవహరం నేతల మధ్య డైలాగ్ వార్ కు దారి తీస్తోంది. ఇవాళ రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ కాగా... మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా అదే స్థాయిలో ధ్వజమెత్తారు. కోమటిరెడ్డిపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దారుణమన్నారు. కేసీఆర్ మంత్రి పదవి ఇస్తానన్నా, కాంట్రాక్టులు రద్దు చేసినా లొంగని వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అని స్పష్టం చేశారు. అలాంటి వ్యక్తిపై వ్యాఖ్యలు చేయడమేంటని ప్రశ్నించారు.
హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్.. రేవంత్ రెడ్డి నాలుగు పార్టీలు మారలేదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి (Revann reddy) బ్లాక్ మెయిల్ చేసి ఎదిగాడని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ గెలవదనే నిరాశ, నిస్పృహలతో రేవంత్ మాట్లాడుతున్నారని విమర్శించారు. పీసీసీ స్థాయికి వచ్చినా రేవంత్ లో మార్పు రాలేదన్నారు. కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన రేవంత్ రెడ్డి... ఎందుకు అలా చేయలేదని ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షుడు అయ్యాక... సరైన ఫలితాలు రాబట్టడంలో విఫలం కావడంతోనే ఈ తరహా విమర్శలు చేస్తున్నాడని దుయ్యబట్టారు.
అన్యాయాన్ని, అవినీతికి వ్యతిరేకంగా రాజగోపాల్రెడ్డి పోరాటం చేస్తున్నారని ఈటల అన్నారు. రాజగోపాల్రెడ్డిపై పీసీసీ అధ్యక్షుడు మాట్లాడిన మాటలు జుగుప్సాకరంగా ఉన్నాయని.... అవతలివారిపై బట్ట కాల్చి మీదేసి పైకొచ్చిన వ్యక్తి తమపై విమర్శలు చేయడమేంటని నిలదీశారు. కాంగ్రెస్ పెద్దల అహంకారం వల్లే ఆ పార్టీకి ఈ పరిస్థితి అని విమర్శించారు. ప్రాంతీయ పార్టీల పుట్టుకకు కారణం కాంగ్రెస్సేనని అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక వ్యక్తుల మధ్య కాదని.. కేసీఆర్ అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతుందని వ్యాఖ్యానించారు.
అతనో బ్లాక్ మెయిలర్ - రాజగోపాల్ రెడ్డి
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. తనపై రేవంత్ రెడ్డి లేనిపోని విమర్శలు గుప్పించారని మండిపడ్డారు. కాంట్రాక్టుల కోసం పార్టీ మారుతున్నట్లు నిరూపించగలరా? అని ప్రశ్నించారు. మీరు ఆ విషయం నిరూపిస్తే.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. ఒకవేళ నిరుపించకుంటే.. పీసీసీ పదవికి రేవంత్ రాజీనామా చేస్తారా? అని అడిగారు. రేవంత్కు పీసీసీ ఇవ్వాలని తాను అధిష్టానానికి చెప్పినట్లు నిరూపించాలన్నారు.
రేవంత్ రెడ్డి బ్లాక్మెయిలర్ అని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఆయనకు వ్యక్తిత్వం లేదని ఆరోపించారు. మునుగోడులో కాంగ్రెస్ కార్యకర్తలు తన వెంటే ఉన్నారని జోస్యం చెప్పారు. తమ పార్టీలోకి వచ్చి.. తమను తప్పుడుతున్నావ్ అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అయి.. రాష్ట్రాన్ని దోచుకోవాలని రేవంత్రెడ్డి అనుకుంటున్నారని.. కోమటిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీని రేవంత్రెడ్డి ఇష్టానుసారంగా తిట్టి.. ఇప్పుడు పీసీసీ పదవిని అడ్డుపెట్టుకుని వేలకోట్లు సంపాదిస్తున్నారన్నారు.