CM KCR Meet Farmers : రాజకీయాల్లో రైతులు భాగస్వాములు కావాలి.. చట్టసభల్లోకి రావాలి-cm kcr 2nd day meet with farmers union leaders and announced key decisions ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Kcr Meet Farmers : రాజకీయాల్లో రైతులు భాగస్వాములు కావాలి.. చట్టసభల్లోకి రావాలి

CM KCR Meet Farmers : రాజకీయాల్లో రైతులు భాగస్వాములు కావాలి.. చట్టసభల్లోకి రావాలి

HT Telugu Desk HT Telugu
Aug 28, 2022 06:58 PM IST

KCR Meet With Farmers : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనుసరించిన జమిలి పంథానే దేశ రైతుల సమస్యల పరిష్కారానికి అనుసరించాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఉద్యమ పంథాకు పార్లమెంటరీ పంథాను సమన్వయం చేసి జమిలి పోరాటాలు సాగించాలన్నారు.

సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్

తెలంగాణ వ్యతిరేకులతో నాడు 'జై తెలంగాణ' నినాదాన్ని అనిపించినట్టే.. నేడు రైతు వ్యతిరేకులతో 'జై కిసాన్ నినాదాన్ని పలికించాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఆ దిశగా దేశంలోని రైతు నేతలంతా ఐక్య సంఘటన కట్టి, ప్రతినబూనాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దేశ రైతుకు వ్యవసాయం ఒక జీవన విధానం అని, రైతు బాగుంటేనే వ్యవసాయం బాగుంటదన్నారు. వ్యవసాయం బాగుంటేనే సమాజం బాగు పడతదని సీఎం అన్నారు. ఈ దేశంలో రైతు మర్యాదను నిలబెట్టి, ఆత్మ గౌరవం కాపాడేందుకు కలిసి పనిచేద్దామని జాతీయ రైతు నేతలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

దేశంలో దశాబ్దాల కాలం నుంచీ రైతులు ఎదుర్కొంటున్న వ్యవసాయ సమస్యలకు వజ్రోత్సవ స్వతంత్ర భారతంలో ఇంకా పరిష్కారాలు దొరకకపోవడం దురదృష్ణకరమన్నారు సీఎం కేసీఆర్. దేశాన్ని ఏలుతున్న కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టి వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందామని ఆదివారం నాటి జాతీయ రైతు సంఘాల సమావేశం స్పష్టం చేసింది.

దేశ రైతాంగాన్ని గ్రామస్థాయి నుంచీ ఐక్యం చేసేందుకు నాయకత్వం వహించాలని సీఎం కేసీఆర్ ను సమావేశం ముక్తకంఠంతో కోరుతూ తీర్మానించింది. ఆదివారం నాడు జాతీయ సంఘాల నేతలతో ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రెండోరోజు సమావేశం జరిగింది. జాతీయ స్థాయిలో రైతుల ఐక్య వేదిక ఏర్పాటు చేయాలని శనివారం నాటి తీర్మానాన్ని అనుసరించి చర్చ కొనసాగింది. త్వరలో మరో సమావేశం ఏర్పాటు చేసి, విధి విధానాలను రూపొందించాలని సమావేశం తీర్మానించింది.

సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ, రైతు వ్యతిరేక విధానాలపై, వాటి పరిష్కార మార్గాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా పలు రాష్ట్రాలకు చెందిన జాతీయ రైతు సంఘాల నేతలు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. స్వాతంత్ర్య కాలం నుంచి నేటి వరకూ దేశంలో జరిగిన రైతాంగ పోరాటాలను, అందుకు నాయకత్వం వహించిన నేతలు, వారు అవలంభించిన విధానాలు, పోరాట రూపాలను చర్చించారు.

నాటి వ్యవసాయ పరిస్థితులకు, మారిన నేటి పరిస్థితులకు అవలంభించాల్సిన ఉద్యమ కార్యాచరణ విధి విధానాలను, పోరాట రూపాల బ్లూ ప్రింట్ ను తయారు చేసి దేశ రైతాంగాన్ని సంఘటితం చేసే దిశగా చర్యలు ప్రారంభించాలని అభిప్రాయం వ్యక్తమైంది. దాని కోసం అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ ను కోరుతూ సమావేశంలో సీనియర్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

'వ్యవసాయం ఈ దేశ ప్రజల జీవన విధానం. వ్యవసాయాన్ని ఈ దేశం నుంచి ఎవరూ వేరు చేయలేరు. రైతన్నలో శక్తి గొప్ప శక్తి దాగి ఉంటది. దాన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉన్నది. మన సమస్యలకు పరిష్కారాన్ని మనమే అన్వేషించాలి. జట్టు కట్టి పట్టు పడితే సాధించలేనిది ఏమీ లేదని నేను స్వయంగా ప్రారంభించిన తెలంగాణ ఉద్యమం, లక్ష్యాన్ని సాధించి రుజువు చేసింది. నాకంటే ముందు తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. కానీ నిర్దిష్ట పరిస్థితులకు అనుసరించాల్సిన నిర్దిష్ట కార్యాచరణ కొరవడటంతో ఆనాడు లక్ష్యం నెరవేరలేదు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ముందు పలు రంగాలకు చెందిన మేధావులతో కొన్ని వేల గంటల మేధో మధనం చేశాను.' అని కేసీఆర్ అన్నారు.

తెలంగాణ పోరాటాలు విఫలం చెందడానికి కారణాలను అన్వేషించానని కేసీఆర్ చెప్పారు. ఆఖరి పోరాటం ఆగం కాకూడదనే దృఢ సంకల్పంతో, మొహమాటాలకు, బేషజాలకు తావు లేకుండా రాజకీయ పంథాకు, ఉద్యమ పంథాను సమన్వయం చేసినట్టుగా తెలిపారు. జమిలి పోరాటాలతో ముందుకు సాగాలనే తుది నిర్ణయం తీసుకోవడం ద్వారా గమ్యాన్ని ముద్దాడినట్టు వివరించారు.

శాంతియుత పంథాలో పార్లమెంటరీ పోరాటం చేద్దాం..

తెలంగాణ ప్రజలను ఇంటింటికీ ఒక యువకుడిని పంపమని అడిగినట్టుగా కేసీఆర్ చెప్పారు. ఓటు వేయడం ద్వారా తమ శక్తిని చాటే పార్లమెంటరీ పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చామన్నారు. రాజకీయ నిర్ణయాల ద్వారానే ప్రజా జీవితాలు ప్రభావితమవుతాయని సీఎం కేసీఆర్ అన్నారు. అందుకు అసెంబ్లీలు, పార్లమెంటులే వేదికలన్నారు. కేవలం ఉద్యమాలు, ఆందోళనల పేరుతో చట్టసభలకు దూరంగా జరిగే పోరాటాలు సఫలీకృతం అయిన చరిత్ర స్వతంత్ర భారతంలో కనిపించదన్నారు. రాజకీయాలు చేయడం అంటే నామోషీ అని భావించడం తప్పు అని సీఎం కేసీఆర్ అన్నారు. దేశానికి అన్నంపెట్టే రైతులు చట్టసభల్లోకి ఎందుకు వెళ్లకూడదు? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.

'రాజకీయాలంటే అయోమయం అవసరం లేదు. మొహమాటాల నుంచి రైతు నేతలు బయటపడి రాజకీయాలనే పవిత్ర యజ్ఞంలో భాగస్వాములవ్వాలి. దేశ రైతాంగ సమస్యల పరిష్కారానికి పాటుపడాలి. సందర్భాలను బట్టి, నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్ట కార్యాచరణను అనుసరిస్తూ, అవసరమైన చోట ఉద్యమ పంథాను కూడా కొనసాగించాలి. ప్రజాస్వామిక పార్లమెంటరీ పంథా ద్వారా మాత్రమే ప్రజాస్వామిక దేశాల్లో ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది. అందుకు తెలంగాణ రాష్ట్ర సాధనే నిదర్శనం. ఎక్కడ ఆందోళన అవసరమైతదో అక్కడ ఆందోళన చేద్దాం. ఎక్కడ రాజకీయాలు అవసరమైతాయో అక్కడ రాజకీయాలు చేద్దాం. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. మన శక్తిని మనం గుర్తించడంలో వెనకబడి ఉన్నాం. రాజకీయాల్లో ఉండటం అపవిత్రం అనుకోవడం సరికాదు.' అని సీఎం కేసీఆర్ అన్నారు.

దేశవ్యాప్తంగా గ్రామగ్రామానికి చేరుకునేలా రైతుల ఐక్యత చాటుదామని కేసీఆర్ పిలుపునిచ్చారు. దేశం నలుమూలల నుంచి రైతుల డిమాండ్లను విందామన్నారు. జాతీయస్థాయిలో ఐక్యసంఘటనను ఏర్పాటు చేద్దామని కేసీఆర్ అన్నారు. సమావేశంలో పాల్గొన్న వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు నేతలు తమతమ అభిప్రాయాలను చెప్పారు.

IPL_Entry_Point