NCRB Report : ఏపీలో 19 శాతం పెరిగిన రైతుల ఆత్మహత్యలు
ఏపీలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం 19 శాతానికి పైగా పెరిగాయి.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా నివేదిక ప్రకారం ఏపీలో రైతుల ఆత్మహత్యలు 2021లో 19 శాతానికి పైగా పెరిగాయి. దేశంలోనే రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడో స్థానంలో ఉంది. వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న మొత్తం 1,065 మంది (రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు) 2021లో ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్య చేసుకుని తమ జీవితాలను ముగించారు.
అయితే 2020లో ఆ సంఖ్య 889 మాత్రమే. తర్వాతి ఏడాదిలో 19 శాతం పెరిగింది. 2021లో 1,065 మంది ఆత్మహత్యలతో ఏపీ మూడో స్థానంలో ఉంది. మహారాష్ట్రలో 4,064 మంది, కర్ణాటక 2,169 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని నివేదిక పేర్కొంది.
ఇక 2020తో పోలిస్తే ఏపీలో 2021 ఏడాదిలో మెుత్తం ఆత్మహత్యలు 14.5 శాతం పెరిగాయి. 2021లో మొత్తం 8,067 మంది ఆత్మహత్యలు చేసుకోగా, 2020లో ఆ సంఖ్య 7043గా ఉంది. తాజా NCRB డేటా ఆత్మహత్య చేసుకున్న వారి వృత్తిని మాత్రమే నమోదు చేసింది. వారి జీవితాలను ముగించడానికి గల కారణాల గురించి ప్రస్తావించలేదు. 2021లో రాష్ట్రంలో జరిగిన 1,065 మంది రైతు ఆత్మహత్యల్లో 958 మంది పురుషులు, 107 మంది మహిళలు ఉన్నారు.
359 మంది తమ సొంత పొలాలను సాగుచేసుకున్న రైతులు ఉండగా, 122 మంది కౌలుకు భూములు సాగు చేసిన వారు ఉన్నారు. 584 మంది వ్యవసాయ కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నట్లు డేటా వెల్లడించింది.
AP ప్రభుత్వం అక్టోబర్ 2019లో YSR రైతు భరోసా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం రైతులకు సంవత్సరానికి రూ.13,500 అందజేస్తుంది. 44.92 లక్షల మంది భూ యజమానులు, 1.58 లక్షల మంది కౌలుదారులు లబ్ధి పొందుతున్నారు. రైతుల నిరాశను తగ్గించడంలో ఈ పథకం విఫలమైందనే ఆరోపణలు ఉన్నాయి.
హ్యూమన్ రైట్స్ ఫోరమ్ (HRF), రైతు స్వరాజ్య వేదిక (RSV) ప్రతినిధులు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలను సందర్శించారు. పెరుగుతున్న అప్పులు, వారి వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ ధర లేకపోవడం, కౌలుదారుకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందట్లేదని గమనించారు. వ్యవసాయ సంక్షోభం నుంచి బయటపడాలంటే.. సరైన యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని ప్రభుత్వానికి సూచించారు.
సంబంధిత కథనం