Koil Alwar Thirumanjanam at Tirumala 2024: శ్రీవారి భక్తులకు అప్డేట్ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam). ఏప్రిల్ 9వ తేదీన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా…. ఏప్రిల్ 2వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం(Koil Alwar Thirumanjanam) ఉంటుందని పేర్కొంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.
ఏప్రిల్ 2న ఉదయం 6 నుండి 11 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని(Koil Alwar Thirumanjanam) అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పుతారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
TTD Krodhinama Panchangam 2024 : భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం(TTD). శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే రాబోయే నూతన తెలుగు సంవత్సరాది శ్రీ క్రోధినామ సంవత్సర పంచాగాన్ని(Krodhinama Panchangam 2024) టీటీడీ ముద్రించింది. మార్చి 27వ తేదీ నుంచి తిరుమలతో పాటు తిరుపతిలలోని టీటీడీ పుస్తక విక్రయ కేంద్రాలలో వీటిని కొనుగోలు చేయవచ్చని తెలిపింది. రూ.75 చెల్లించి భక్తులు వీటిని పొందవచ్చని ఓ ప్రకటనలో పేర్కొంది.