Tirumala Srivari Salakatla Teppotsavams 2024: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు(Srivari Salakatla Teppotsavams) మార్చి 20 నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 24వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగనున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఓ ప్రకటనలో వెల్లడించింది. రాత్రి 7 నుండి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారుని తెలిపింది.
తెప్పోత్సవాల(Srivari Salakatla Teppotsavams 2024) కారణంగా మార్చి 20, 21వ తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, మార్చి 22, 23, 24వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
ఇవాళ తిరుమలలోని 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ తెలిపింది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 68,446గా ఉంది. 28,549 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా.. హుండీ ఆదాయం రూ.3.24 కోట్లుగా ఉంది.
లోకకల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మార్చి 10వ తేదీ ఆదివారం 18వ విడత అయోధ్యకాండ అఖండ పారాయణం జరుగనుంది. ఉదయం 7 నుండి 9 గంటల వరకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అయోధ్యకాండలోని 26 నుండి 30వ సర్గ వరకు మొత్తం ఐదు సర్గల్లో 156 శ్లోకాలు, యోగవాశిష్టం మరియు ధన్వంతరి మహామంత్రంలోని 25 శ్లోకాలు కలిపి మొత్తం 181 శ్లోకాలను పారాయణం చేస్తారు. ఎస్.వి.వేద విఙ్ఞాన పీఠం, ఎస్.వి.వేద విశ్వవిద్యాలయం, టీటీడీ వేదపండితులు, టీటీడీ సంభావన పండితులు, శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజైన శనివారం సాయంత్రం శివపార్వతుల కల్యాణం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు శ్రీ మణివాసన్ గురుకుల్ ఆధ్వర్యంలో అర్చకులు శాస్త్రోక్తంగా పార్వతీ పరమేశ్వరుల కల్యాణం జరిపించారు. ఆనంతరం తిరుచ్చిపై స్వామివారు పురవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.
బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన మార్చి 10వ తేదీ ఆదివారం త్రిశూలస్నానం వైభవంగా జరుగనుంది. ఉదయం 6.30 నుండి 8.30 గంటల వరకు శ్రీ నటరాజస్వామివారు సూర్యప్రభ వాహనంపై దర్శనమివ్వనున్నారు. ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు త్రిశూలస్నానం ఘట్టం శాస్త్రోక్తంగా జరుగనుంది. సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల మధ్య ధ్వజావరోహణం నిర్వహించనున్నారు. ధ్వజావరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. కాగా రాత్రి 8 నుండి 10 గంటల వరకు రావణాసుర వాహనసేవ జరుగనుంది.